Pages

Wednesday, July 18, 2012

అపాయంలో ఉపాయం

ల్లలూ...! ఈరోజు మనం ఆపద సమయాల్లో మెళకువగా ఎలా ఉండాలో తెలియజెప్పే ఓ చిన్న కథను తెలుసుకుందాం...!

సింహాచలం అనే ఊర్లో ఒక పెద్దావిడ ఉండేది. ఆమెకు నలుగురు కూతుళ్ళు. ఉన్నంతలో నలుగురి కూతుళ్ళకు బాగానే పెళ్లి జరిపించింది. తాను సంపాదించిన మొత్తాన్ని నలుగురు కూతుళ్ళకు సమానంగా పంచింది పెద్దావిడ. అయితే ఆమె ఎలా బ్రతకాలి అన్న సమస్య రావడంతో నలుగురు కూతుళ్ళ వద్దా మూడు నెలలపాటు ఉండాలని నిర్ణయించుకుంటుంది.

మొదటగా పెద్దకూతురు ఇంట్లో మూడు నెలలపాటు గడిపిన పెద్దావిడ, రెండో కూతురు ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఓ అడవి గుండా ఆమె నడచి వెళ్తుంటుంది. ఆ అడవిలోనే పులి ఒకటి తిరుగుతూ ఉండేది. నరవాసనను గుర్తుపట్టిన ఆ పులి పెద్దావిడ దగ్గరకు వచ్చేసింది.


పెద్దావిడను తినేసేందుకు మీదపడింది. అయితే మంచి యుక్తి, వయసుకు తగిన తెలివితేటలు కలిగిన పెద్దావిడ నేర్పుగా పులితో ఇలా అంది. "పెద్ద పులీ...! పెద్ద పులీ...! నేను బాగా ముసలిదాన్నయిపోయాను, బాగా చిక్కిపోయాను, ఆరోగ్యం కూడా బాగలేదు... ఇప్పుడు నేను రెండో కూతురు ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు. అక్కడ పది రోజులు ఉంటాను. బాగా తినేసి ఒళ్ళుచేసి వస్తాను. అప్పుడు నన్ను తిందువుగానీ..." అని చెప్పింది.

పెద్దావిడ మాటలను నమ్మిన పులి అప్పటికి వదిలి పెట్టింది. కానీ పెద్దావిడ రెండో కూతురు ఇంటికి వెళ్ళి పదిరోజులు, పదిహేనురోజులు గడిచి, నెల కూడా పూర్తవుతుంది. అయినా ఆమె రాదు. ఎలాగైనా రాకపోతుందా, వెళ్ళేందుకు ఇదే దారి కదా.... అప్పుడు ఆమె పని పడతానని బీష్మించుకు కూర్చుంది పెద్దపులి.

రెండో కూతురు ఇంట్లో మూడు నెలలపాటు గడిపిన పెద్దావిడ మూడో కూతురి ఇంటికి బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. బయలు దేరే రోజు దగ్గర పడుతుండగా తనకు పులితో తనకు ఎదురైన పరిస్థితి గురించి రెండో కూతురితో పూసగుచ్చినట్లు చెప్పింది.



పెద్దావిడ రెండో కూతురు కూడా తెలివైనదే కావడంతో ఓ ఉపాయం ఆలోచించింది. ఒక పెద్ద బాన తెచ్చి అందులో పెద్దావిడను కూర్చోబెట్టి, మూత పెట్టి, మూతకు గుడ్డ కట్టి దొర్లించి వదిలిపెట్టింది. బాన దొర్లుకుంటూ అడవిలో పోతూ ఉంటుంది. బానలో ఉన్న ముసలమ్మ పులి ఇక తనను ఏమీచేయలేదనుకుంటూ హుషారుగా పాడుకుంటూ వెళుతుంటుంది.

ఇంతలో బాన పులికి దగ్గరగా వస్తుంది. అసలే కోపంతో ఉడికిపోతోన్న పెద్దపులి బానను కాలితో ఆపి, పంజాతో గట్టిగా దెబ్బ కొట్టింది. అంతే బాన ఢాం అని పగిలిపోయి పెద్దావిడ బయటపడింది. ఓసీ ముసల్దానా నన్ను ఇంత మోసం చేస్తావా... నిన్ను ఇప్పుడే తినేస్తానంటూ మీదపడింది.

పెద్దావిడకు వెన్నులో వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుని, మళ్ళీ కాస్త ఆలోచించి "పెద్ద పులీ...! పెద్దపులీ...! ప్రయాణంలో బాగా అలసిపోయాను ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా ఉంది. కాబట్టి, పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి వస్తాను. అప్పుడు హాయిగా తిందువుగానీ" అంటూ బ్రతిమలాడింది. పెద్దావిడ మాటలను మళ్ళీ నమ్మిన పులి "సరే" అని వదిలి పెట్టింది.

చెరువులోకి దిగిన పెద్దావిడ గంట, రెండు గంటలు సేపు గడిచినప్పటికీ బయటికి రాలేదు. అసలే ఆకలితో ఉన్న పెద్దపులి కోపంతో ఊగిపోతూ... గట్టుమీద నుండి పెద్దావిడను పిలిచింది. పులిమాటలు విన్నప్పటికీ పెద్దావిడ పట్టించుకోలేదు. దీంతో పులి ఎలాగైనా సరే ఆమెని తినేయాలని చెరువులోకి దూకి ఆమెకు దగ్గరగా వెళ్ళింది. అంతే ఒక్కసారిగా పెద్దావిడ తన రెండు చేతుల్లో ఉన్న ఇసుకను పులి కళ్ళలోకి కొట్టింది.

ఇంకేముంది... ఇసుక కళ్ళనిండా పడటంతో పెద్దపులికి కళ్ళు కనబడలేదు. కేకలు పెడుతూ... చెరువులోనే గిలగిల తన్నుకుంటూ ఉండిపోయింది. ఈలోపు పెద్దావిడ ఒడ్డుకు చేరుకుని మూడో కూతురు ఇంటికి వెళ్లిపోయింది. కాబట్టి పిల్లలూ...! ఆపద సమయాల్లో ఉపాయంతో, తెలివితో మసలడం అందరూ నేర్చుకోవాలి. సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటే జీవితం ఆనందమయమవుతుంది.

No comments:

Post a Comment