Pages

Friday, July 20, 2012

పులి.. పేరాశ బ్రాహ్మణుడు

ఒక ముసలి పులి స్నానం చేసి ఒక చేతిలో దర్భలు, మరో చేతిలో బంగారు కంకణం చేతిలో పట్టుకుని ఏటి గట్టుపైన కూర్చుంది. అదే సమయంలో ఏట్లో స్నానం చేసేందుకు వచ్చిన బ్రాహ్మణుడు ఆవలి గట్టుమీద ఉన్న పులిని చూసి భయంతో పారిపోబోయాడు.

ఇది చూసిన పులి "ఓయీ బ్రాహ్మణుడా...! నన్ను చూసి భయపడవద్దు. నేను నిన్నేమీ చేయను" అంది. దీంతో కాస్తంత బెరుకుగానే ఆగిపోయాడు బ్రాహ్మణుడు. ఇంకా అతడికి భయం పోలేదని గ్రహించిన పులి... "ఇదిగో ఈ బంగారు కంకణం తీసుకుని నీ దరిద్రాన్ని పోగొట్టుకో..!" అంటూ నమ్మబలికింది.

బంగారం అనగానే, అసలే పేరాశ కలిగిన ఆ బ్రాహ్మణుడికి కొంచెం ధైర్యం వచ్చింది. కానీ ఈ పులి క్రూరజంతువు కదా... దీన్నెలా నమ్మేది అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. అది చూసిన పులి.. "నేను బాగా వయసులో ఉన్నప్పుడు మనుషులను చంపి తిని బోలెడంత పాపం మూటగట్టుకున్నాను. ఇకమీదటైనా అలాంటి పనులు మానుకోవాలని అనుకుంటున్నాను" అని చెప్పింది.

అయినా కూడా బ్రాహ్మణుడు తన దగ్గరకు రాకపోవడంతో... "నేను పాపపు పనులు చేసేటప్పుడు ఒక పుణ్యాత్ముడు నామీద దయతలచి ఇకపై ఎప్పుడూ పశువులను, మనుషులను చంపకుండా ఉండి సత్కార్యములు చేశావంటే... కాస్తంత పుణ్యమైనా దక్కుతుందని" హితబోధ చేశాడు అని చెప్పింది పులి.



"కాబట్టి... ఆరోజు నుంచి నేను పాపపు పనులేమీ చేయకుండా... ఇలా దానధర్మాలు చేస్తూ, నా పాపాన్ని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటున్నాను" అని మళ్ళీ నమ్మబలికింది ఆ పులి. దాని మాటలకు పూర్తిగా లోబడిపోయిన ఆ బ్రాహ్మణుడు బంగారంపైన ఆశతో... ఏటి అవతలి ఒడ్డువైపున ఉన్న పులి వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నించి బురదలో దిగబడిపోయాడు.

అప్పటిదాకా వేచిచూస్తోన్న పులి, బ్రాహ్మణుడికి దగ్గరికి వచ్చి.. "అయ్యో...! బురదలో దిగబడిపోయావు కదా... ఉండు నేను వచ్చి నిన్ను బయటికి తీస్తాను" అంటూ ఒక్కసారిగా మీదపడింది. అసలే ఆకలితో ఉన్న పులి, ఆ పేరాశ బ్రాహ్మణుడిని సుష్టుగా భోంచేసింది.

కాబట్టి పిల్లలూ...! ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏమిటంటే... పేరాశ ఎప్పటికీ మంచిది కాదు. అదేవిధంగా ఏదైనా ఒక పని చేయాలంటే అన్ని రకాలుగా ఆలోచించిగానీ ఓ నిర్ణయానికి రాకూడదు.

No comments:

Post a Comment