Pages

Sunday, August 12, 2012

తగిన శాస్తి

అనగనగా ఒక పెద్ద అడవి వుండేది. ఆ అడవిలో ఒక గుర్రం, గేదె వుండేవి. అవి పక్క పక్కనే మేస్తుండేవి. ఒకే సెలయేటిలో నీళ్ళూ కూడా తాగేవి. కానీ వాటికి ఏనాడు పడేదికాదు. ఎప్పుడూ పోట్లాడుకునేవి. . నేను గొప్పంటే నేను గొప్పని బడాయిలు పోయేవి. ఎప్పటిలానే ఒక రోజు ఆ రెండూ పోట్లాడుకున్నాయి. కోపం ఆపుకోలేని గేదె తన కొమ్ములతో గుర్రాన్ని బాగా పొడిచింది. దాంతో గాయాలయ్యాయి. రక్తం కూడా ఎక్కువగానే కారింది. గుర్రం ఇది మనసులో పెట్టుకుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అందుకే పక్కనే వున్న గ్రామానికి వెళ్ళింది. రామయ్య అనే రైతును కలిసి గేదెకు జరిగినదంతా చెప్పింది.

అంతా విని అయితే నేనేం చేయాలి? అని అడిగాడు రామయ్య. ఏమీ లేదు నువ్వు నామీద కూర్చొని ఆ గేదెను కర్రతో బాగా బాదాలి. అప్పుడు అది ఓడిపోతుంది. అంది గుర్రం కసిగా పళ్ళు నూరుతూ. మరి నాకేంటి లాభం అన్నాడు రామయ్య. లాభం లేకపోవటమేంటి! గేదెను కొట్టినప్పుడు పడిపోయి అది ఓడిపోతుంది కదా. అప్పుడు అది మన ఆధీనంలోనే వుంటుంది. నువ్వు ఎంచక్కా దాని పాలు తాగొచ్చు. పైగా దాన్ని వ్యవసాయానికి కూడా ఉపయోగించుకోవచ్చు అంది గుర్రం.

సరేనన్నాడు రామయ్య. అతను ఆ మరునాడే వెళ్ళి గేదెను బాగా బాదాడు. దాంతో గేదె గాయపడి చేతికి చిక్కింది. గేదె నీ దగ్గరకు వచ్చిందికదా ఇక నా కళ్ళెం వదిలేయ్ అంది గుర్రం.

అమ్మా! నేనెలా వదులుతాను? నీ వల్ల కూడా నాకు ఉపయోగమే కదా. ఎంచక్కా నీ మీద ఎక్కి స్వారీ చేయొచ్చు. వేరే వూళ్ళకు వెళ్ళొచ్చు. అంటూ తన ఇంటికి పట్టుకెళ్ళాడు రామయ్య. తను చేసిన పనికి గుర్రం సిగ్గుపడింది. తాము తాము చూసుకోక మధ్యలో స్వార్థపరుడైన మనిషిని తెచ్చినందుకు సిగ్గుపడింది. తగినశాస్తి జరిగిందని బాధపడింది.       

No comments:

Post a Comment