Pages

Sunday, May 18, 2014

ధనవంతుడు-బంగారం

ఒక ఊరిలో గురునాథం అనే ధనవంతుడు ఉన్నాడు. అతనికి బంగారమన్నా, తన కుమార్తె అన్నా ఎంతో ఇష్టము. ధనవంతుడు ఇంకా ఎంతో బంగారం సంపాదించి సుఖ పడాలని అతని కోరిక. ఒకనాటి రాత్రి అదృష్ట దేవత అతనికి ప్రత్యక్షమై "నీకు ఏమి కావాలో కోరుకో"మన్నది. అత్యాశగల గురునాథం "నేను ఏది తాకినా అది బంగారం కావాలి" అని కోరుకున్నాడు. తధాస్తు అని దేవత మాయమైనది. తెల్లవారిన తర్వాత ఆ ధనవంతుడు ఆ ఇంటి వెనుక తోటలోనికి పోయి అక్కడ కొన్ని వస్తువులను తాకాడు. అవి అన్నీ బంగారముగా మారినవి. ధనవంతుని ఆనందానికి అవధుల్లేవు.

     ధనవంతునికి ఆకలి వేసి ఫలహారము చేయుటకు కూర్చొని పళ్ళెములోని ఫలహారాలను చేతితో తాకాడు. అవి బంగారముగా మారినవి. ఏది తాకినాను అది బంగారముగా మారుచున్నది. ధనవంతుడైన గురునాథం ఆకలితో ఉండి కూడా ఏమీ తినలేకపోయాడు. ఇంతలో ముద్దుల కూతురు పరుగున వచ్చినది. సంతోషంతో ఆమెను ఎత్తుకొని ముద్దాడాడు. ఆమె కూడా బంగారు ప్రతిమగా మారినది.

      అప్పుడు గురునాథం తన తప్పేమిటో తెలిసినదని ఎంతో దుఃఖించాడు. బాధతో దేవతను ప్రార్ధించాడు. ఆమె ప్రత్యక్షమైనది. తనను క్షమించమని ఇచ్చిన వరముని తిరిగి తీసుకొమ్మని వేడుకున్నాడు. గురునాథం కోరికను మన్నించి దేవత ఒక కూజాతో కొంత నీరు ఇచ్చి "దీనిని బంగారముగా మారిన వస్తువులమీద చల్లితే అవి మళ్ళీ యదాస్థితికి వచ్చును" అని చెప్పి ఆ దేవత అదృశ్యమైనది. గురునాథం సంతోషించి బంగారు ప్రతిమగా మారిన తన కుమార్తె మీద ఆ నీళ్ళు చల్లాడు. ఆమె మాములు మనిషిగా మారింది. ఆమెను ఎత్తుకొని ముద్దాడి, నిజమైన ఆనందం సంపదలో లేదని తెలుసుకున్నాడు.

No comments:

Post a Comment