Pages

Sunday, August 30, 2015

వేట

సువర్ణ నగరాన్ని పాలించే రాజు ధనవర్మకు వేట అంటే మహా ఇష్టం. ఒక రోజున రాజు వేటకు వెళ్తుండగా, దారిలో రెండు పులి పిల్లలు కనిపించాయి. రాజు ఆ రెండు పులి పిల్లలను తీసుకొని రాజధానికి తిరిగి వచ్చి, వాటిని ప్రేమగా సాకాడు. వాటిలో‌ఒకదాని పేరు మాయ, రెండవదాని పేరు బుజ్జి. ఆ రెండూ రాజుపట్ల చాలా ప్రేమాభిమానాలు కలిగి ఉండేవి.

కానీ రాజుకు మాత్రం ఒక్కటే దిగులు- అదేమిటంటే, "అయ్యో! నాకింకా పెళ్ళి కాలేదే!" అని. ఆ సంగతి తెలుసుకున్న పులిపిల్లలు రెండూ రాజుకు తగిన భార్యను వెతకటం కోసం బయలుదేరి పోయి, దేశ దేశాలూ తిరిగాయి. చివరికి సదిశా రాజ్యం చేరుకొని, పౌరులెవ్వరికీ కనబడకుండా ఆ దేశపు రాజుగారి తోటలోకి దూరాయి. ఆ రాజుగారి బిడ్డ పద్మ- చాలా అందమైనది. ఆమె చెలికత్తెలతో కలిసి అక్కడ ఆటలాడుతూ, అకస్మాత్తుగా పులిపిల్లలను చూసి "వామ్మో!‌ పులి పిల్లలు!" అని గట్టిగా అరిచింది. కానీ చాలా తెలివైన మాయ, బుజ్జిలు సైనికులు వచ్చేలోపు అక్కడినుండి పారిపోయి, సువర్ణ నగరం చేరుకున్నాయి.

ధనవర్మ ఆ పులులను చూసి "అరే! మీరు ఎక్కడికో పారిపోయారే, అని ఎంత దిగులు పడ్డానో‌ తెలుసా?" అన్నాడు సంతోషంగా. అప్పుడా పులి పిల్లలు "మేం నీకోసం ఎంత మంచి యువరాణిని వెతికి పెట్టామో తెలుసా?" అని, సదిశారాజ్యపు రాజుగారి బిడ్డ గురించి చెప్పాయి.ధనవర్మ సదిశారాజ్యం చేరుకునే సరికి రాజుగారు పద్మకు స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నారు- వేగంగా పరుగులెత్తే చిరుతపులికి తగిలేట్లుగా మూడు బాణాలు వేసినవారికి తన బిడ్డనిచ్చి పెళ్ళి చేస్తానని ఆయన ప్రకటించాడు. ఆ పోటీలో ఇతరులెవ్వరూ నెగ్గలేదు. వేటలో అనుభవం గల ధనవర్మ, సునాయాసంగా చిరుతపులిని చంపి, యువరాణి పద్మను పెళ్ళిచేసుకున్నాడు.

రాజు, రాణి కొంతకాలం సుఖంగా కాలం గడిపిన తరువాత, పొరుగు రాజ్యపు సూర్యవర్మ సువర్ణనగరం మీదికి దండెత్తి వచ్చాడు. సూర్యవర్మకు అపారమైన సైన్యం ఉన్నది. 'అతనితో ఎలా తలపడాలా' అని బాధపడుతున్న ధనవర్మతో పులులు "రాజా! దీనికి చింత ఎందుకు? మమ్మల్ని యుద్ధానికి పంపు. రక్తపాతం లేకుండానే సమస్యను మేం పరిష్కరిస్తాం" అన్నాయి. రాజు వాటిని ముందుగా శత్రువులమీదికి వదిలాడు. వాటిని చూడగానే శత్రు సైన్యాలు వెనక్కి పరుగు తీశాయి. తన రాజ్యాన్ని కాపాడిన పులులు రెండింటినీ రాజు ఎంతో మెచ్చుకున్నాడు.
అయితే రాజుగారి వేటపిచ్చి రాజ్యానికే ప్రమాదం కొని తెచ్చింది. రాజును ఆదర్శంగా తీసుకున్న ప్రజలందరూ ఇష్టం వచ్చినట్లు వేటాడి, అడవిలోని జంతువులన్నిటినీ చంపేశారు. అడవుల్లోని చెట్లు, చేమలు అన్నీ ఒక్కటొక్కటే నేలకూలాయి. పర్యావరణం పాడవ్వటం మూలంగా రాజ్యానికి కరువుకాలం వచ్చింది. వానలు లేవు. అడవిలో మిగిలిన క్రూరమృగాలు పల్లెసీమల్లోకి ప్రవేశించి దొరికినవారిని దొరికినట్లు తినెయ్యటం మొదలెట్టాయి.
ఏం చెయ్యాలో తెలీక తల పట్టుకున్న ధనవర్మతో పులులు - "రాజా, మీ దగ్గర ఉన్న ఆహార ధాన్యాలన్నిటినీ రాజ్యంలోని ప్రజలకు పంచిపెట్టండి. మమ్మల్ని అడవిలోకి వదిలి పెట్టండి. వేటను నిషేధించండి. మిగిలినది మేం చూసుకుంటాం " అని అన్నాయి.

"సరే" అని రాజుగారు తన దగ్గరున్న ఆహార ధాన్యాలను ప్రజలకు పంచిపెట్టి, పులులను అడవిలో విడిచాడు. మాయ, బుజ్జి ఆపైన అడవుల సంరక్షణకు పూనుకున్నాయి. త్వరలోనే అడవులన్నీ మళ్ళీ చెట్టు చేమలతో కళకళలాడాయి. జంతువులన్నీ తిరిగి అడవుల్లోకి వచ్చాయి. కరువు తీరి రాజ్యం సుభిక్షం అయ్యింది.

No comments:

Post a Comment