Pages

Saturday, August 11, 2012

కష్టే ఫలి

కోసల రాజ్యాన్ని పరిపాలించే రాజుకు తన ప్రజలు ఏవిధంగా జీవిస్తున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. తన మంత్రితో సంప్రదించి, బాగా రద్దీగా ఉండే దారి మధ్యలో రాత్రికి రాత్రే ఒక బండరాయిని పాతించాడు. ఆ దారిలో వెళ్లేవాళ్లందరూ దానిని దాటి వెళ్ళే ప్రయత్నం చెసేవారు. కానీ ఎవరూ ఆ రాయిని తొలగించే ప్రయత్నం మాత్రం చెసేవాళ్లు కాదు.

రాజు, మంత్రి మారువేషాల్లో వచ్చి ఆ దారిని గమనిస్తూ ఉండేవాళ్లు. ఎంతటివారు అయినా కష్టపడి పక్కనుండి వెళ్ళేవారే తప్ప, ఆ రాయిని మాత్రం కదిల్చే ప్రయత్నం చేయలేదు. తమ ప్రజల ప్రవర్తన రాజుని ఆశ్చర్యపరిచింది. ఒక రోజు ఒక రైతు, పక్క ఊరి నుండి కూరగాయల సంచి మోస్తూ ఆ ఊరిలోకి వచ్చాడు. దారిలో అడ్డంగా రాయి కనిపించడంతో ఆ రైతు తన సంచిని పక్కన పెట్టి, ఆ రాయిని తొలగించే ప్రయత్నం చేశాడు. చాలాసేపు కష్టపడ్డాక ఆ రాయిని పక్కకి దొర్లించ గలిగాడు. దానితో ఆ ప్రదేశం విశాలమై అందరికీ సౌకర్యంగా మారింది.

రాయిని దొర్లించి వెన్నక్కి తిరుగుతుంటే, రైతుకు ఆ రాయి ఉండిన స్థలంలో ఒక సంచి కనిపించింది. ఏమై ఉంటుంది అని చూస్తే, అందులో కొన్ని బంగారు నాణాలూ, ఒక ఉత్తరమూ కనిపించాయి. ఆ ఉత్తరం రాజు రాసినది. దానిలో - "అందరికీ ఉపయోగపడేలా రాయిని తొలగించినవారికి ఈ బంగారం" అని రాసి ఉంది. రైతు సంతోషిస్తూ, తన కూరగాయల సంచిని తీసుకుని వెళ్లిపోయాడు.

ఇదంతా గమనిస్తున్న రాజు, మంత్రితో -"చూశారా మంత్రిగారూ, అందరూ అడ్దంకిని తప్పించుకునే ప్రయత్నమే చేశారు గానీ, ఈ రైతు దానిని ఎదుర్కొన్నాడు. అందుకే దానిని తీసేయగలిగాడు. మన జీవితాల్లో అడ్డంకులు కూడా మనకి మనం మెరుగుపరచుకోవడానికి అవకాశాల్లాంటివి" అన్నాడు. మంత్రి అవునంటూ తల ఊపాడు.

No comments:

Post a Comment