Pages

Saturday, August 11, 2012

అజ్ఞానం

మౌల్వీ నజీరుద్దీన్‌ చాలా గ్రంథాలు చదివి అపార జ్ఞానం సంపాదించాడు. కానీ అసలు జ్ఞానం కావాలంటే అది జీవితం నుండే నేర్చుకోవాలన్నది అతని ఉద్దేశ్యం. అందుకే ప్రజలను కలుసుకునే వీలుండే పనేదైనా చేస్తే జీవిత సత్యాలు తెలుస్తాయని, అన్వేషణ ఆరంభించాడు.

నజీరుద్దీన్‌కి ఈత బాగా తెలుసు. అందువల్ల పడవ నడిపే పని బావుంటుందని, దానిలో చేరాడు. రోజూ నదికి అటూ ఇటూ మనుషుల్ని పడవపై చేరవేయడం అతని పని.

ఒకరోజు అతని పడవలో ఒక ముసలి గురువు ఎక్కాడు. ప్రయాణిస్తుండగా మాటా మాటా కలిసి, ఆ గురువు ఒక మహా పండితుడని తెలిసింది. మౌల్వీ నజీరుద్దీన్‌ తన పేరు చెప్పకుండా, తన గురించి తెలియనివ్వకుండా ఉన్నాడు.

కొద్దిసేపటికి వర్షం ప్రారంభమైంది. "నీకు వర్షం ఎలా కురుస్తుందో తెలుసా?" అని అడిగాడు గురువు.

"నాకు తెలియదు " అన్నాడు నజీరుద్దీన్‌.

"వర్షం ఎలా కురుస్తుందో తెలియకపోతే నీ సగం జీవితం వ్యర్థం" అన్నాడు గురువు ఎగతాళిగా.

"అవునా గురువుగారూ? మరెలా?" అని అడిగాడు అమాయకంగా.

"ఇంకేముంది? నువ్వు సగం చచ్చినవాడితో సమానం" అన్నాడు గురువు. ఇంతలో వర్షం ఎక్కువైంది. పడవలోకి నీళ్లు చేరుతున్నాయి. అలలు పెద్దవై పడవ అటూ ఇటూ ఊగడం మొదలెట్టింది.

"గురువుగారూ! మీకు ఈత వచ్చా?" అని అడిగాడు నజీరుద్దీన్‌. అప్పటికే భయం భయంగా వణుకుతున్న గురువు "రాదు" అన్నాడు.

"అయితే మీ పూర్తి జీవితం వ్యర్థం " అని నజీరుద్దీన్‌ పడవలో నుండి నీటిలోకి దూకి, ఈదుకుంటూ వెళ్లిపోయాడు.

No comments:

Post a Comment