Pages

Thursday, July 19, 2012

పంచతంత్రం కథ... ఉత్తమ మిత్రుడు...!

అసలు మిత్రుడంటే ఎవరు? చెరువులో నీళ్ళున్నప్పుడు తెప్పలుగా వచ్చి చేరే కప్పలలాంటి వాడు కాదు. మిత్రుడంటే తన అవసరానికి మాత్రమే మన దగ్గరకొచ్చి పబ్బం గడుపునేవాడు అంతమాత్రం కాదు. మరి మిత్రుడంటే ఎవరు? పాపపు పనుల నుండి మరల్చేవాడు, మంచి పనులు చేసేలా ప్రోత్సహించేవాడు, ఏవైనా రహస్యాలుంటే దాచిపెట్టేవాడు బర్తృహరి అనే కవి ఎప్పుడో చెప్పాడు.

కాబట్టి... పిల్లలూ... నిజమైన స్నేహితుడు అంటే ఎవరు...? స్నేహితుడంటే ఎలా ఉండాలి...? అని తెలియజెప్పే "ఇంద్ర, శుక సంవాదం" అనే పంచతంత్ర కథను ఈరోజు చదువుకుందాం.


కాశీ రాజు చక్కగా రాజ్యపాలన చేస్తున్న రోజులవి. ఆ రాజ్యంలో రాజుతో పాటుగా ప్రజలు కూడా ఎవరి ధర్మాలను వారు నిర్వర్తిస్తూ ఉండేవారు. ఒకానొక రోజున ఓ వేటగాడు తన వృత్తిధర్మంగా విల్లు, బాణాలను అన్నింటినీ సిద్ధం చేసుకుని వేటకోసం అడవికి బయలుదేరాడు. తన బాణపు దెబ్బ తగిలిన మృగం త్వరగా చనిపోయేందుకు వీలుగా బాణపు మొనలకు విషం పూసి తీసుకెళ్లాడు వేటగాడు.

జంతు సంచారం ఎక్కువగా ఉండే ఓ ప్రాంతానికి వెళ్లిన వేటగాడు అక్కడ మాటువేశాడు. కాసేపట్లోనే అక్కడికి పెద్ద లేళ్ళ గుంపు ఒకటి వచ్చింది. వెంటనే తన బాణాన్ని ఓ లేడిపిల్లకేసి గురిచూశాడు వేటగాడు. అయితే ఆ బాణం గురితప్పి పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టుకు గుచ్చుకుంది. విషపూరితమైన ఆ బాణపు తాకిడి అంతటి చెట్టు కూడా ఒక్కసారిగా కంపించిపోయింది.

విషమంతా చెట్టు వేర్లనుండి కొమ్మలదాకా వ్యాపించడంతో కాసేపట్లోనే ఆ చెట్టు ఆకులు, కాయలు అన్నీ రాలిపోయి ఆ వెంటనే చెట్టంతా ఎండిపోయింది. ఆ ఎండిపోయిన చెట్టు తొర్రలోనే ఎప్పటినుంచో ఒక చిలుక కాపురం ఉంటుంది. అది అక్కడే పుట్టి, అక్కడే పెరిగి ఉంటుంది. అందుచేత ఆ చెట్టుమీద దానికి చాలా ప్రేమ. అంతకుమించిన భక్తీ ఉన్నాయి. పాపం విషం దెబ్బకు ఆ చెట్టు ఎండిపోయినప్పటికీ చిలుక అక్కడినుంచి వెళ్లిపోలేదు.

చెట్టు పచ్చగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఉండి, ఆ తరువాత ఎటూ వెళ్ళకుండా, చెట్టు కష్టాలలో పడినప్పటికీ అది మళ్లీ బాగుపడితే బాగుండునని దేవున్ని ప్రార్థిస్తూ అక్కడే ఉండిపోతుంది చిలుక. చెట్టు మళ్ళీ బాగుపడాలన్న దీక్షతో దేవుణ్ణి ప్రార్థిస్తున్న చిలుక దేవేంద్రుడి దృష్టిని ఆకర్షించింది.



ఒకరోజున అటువైపుగా వెళ్తోన్న దేవేంద్రుడు ఆ చిలుకను చూసి ఒక విప్రుడి వేషంలో వచ్చి దాన్ని పలుకరించాడు. చెట్టు ఎలాగూ నాశమైపోయింది కదా...! నీవు ఇక్కడినుంచి వెళ్లిపోయి ఏదైనా మరో పచ్చని చెట్టులో నివాసం ఏర్పరచుకోవచ్చుకదా...! అని అన్నాడు.

అప్పుడు దేవేంద్రుడిని తనకున్న దైవభక్తితో గుర్తుపట్టిన చిలుక... ఓ దేవేంద్రుడా నేను ఈ చెట్టుమీదనే పుట్టానయ్యా...! ఈ చెట్టుపైనే ఆడుకుంటూ పెరిగాను కూడా. ఈ చెట్టునుండి ఎన్ని మంచి విషయాలు తెలుసుకున్నానో అలాగే ఈ చెట్టు కూడా నన్ను కన్నబిడ్డలా కాపాడిందయ్యా...! అందుకే నాకు ఈ చెట్టంటే అంత భక్తి, ప్రేమ అని చెప్పింది.

నన్ను ఇంతలా ఆదరించిన ఈ చెట్టుకు ఇప్పుడేదో కష్టకాలం వచ్చిందని నేను దీన్ని వదలిపెట్టి వెళితే కృతఘ్నతా పాపం చుట్టుకోదా...? అందుకే ఏమి జరిగినా నేను ఈ చెట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నానని దేవేంద్రుడికి చెప్పింది చిలుక. దేవేంద్రుడంతటివాడికి చిలుక చెప్పిన మాటలు మనసును ద్రవింపజేశాయి.

చిలుక మంచితనాన్ని మెచ్చుకున్న దేవేంద్రుడు ఏదైనా వరం కోరుకోమని అడుగగా... ఆ చెట్టు మళ్ళీ పచ్చపచ్చగా, ఆకులతో, పువ్వులతో, కాయలతో, పండ్లతో కలకాలం వర్ధిల్లేలా అనుగ్రహించమని కోరింది. చిలుక నిస్వార్ధబుద్ధికి దేవేంద్రుడు ఆనందపరవశుడై ఆ చెట్టుమీద అమృతాన్ని వర్షింపజేశాడు. మోడైన చెట్టు మళ్ళీ చిలుక కోరుకున్నట్లుగా పచ్చపచ్చగా కళకళలాడింది.

కాబట్టి పిల్లలూ....! మిత్రుడంటే సుఖాలలో ఉన్నప్పుడు మాత్రమే అంటిపెట్టుకునేవాడు కాదని, కష్టకాలంలో కూడా తోడూ నీడగా ఉంటాడని, అలాంటి వాడే ఉత్తమ మిత్రుడని ఈ కథ ద్వారా అర్థమైంది కదూ...!

No comments:

Post a Comment