Pages

Thursday, July 19, 2012

రాజ్యవర్ధనుడు... ఏడు కూజాలు...!

అనగనగా రాజ్యవర్ధనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడి రాజ్యంలో ఎలాంటి సమస్యలు లేకుండా, ఖజానా నిండా డబ్బులతో సుభిక్షంగా ఉండేది. పంటలు కూడా బాగా పండటం వల్ల రైతులు, రాజ్యం సుభిక్షంగా ఉండటంతో ప్రజలూ చాలా సంతృప్తితో జీవనం గడిపేవారు.

అయినప్పటికీ రాజు రాజ్యవర్ధనుడికి ఎదో తెలీని అసంతృప్తి. తాను ఇంకా ఏదో సాధించాలని, ఏదో కోల్పోతున్నానని భావిస్తూ ఎప్పుడూ అసంతృప్తితో రగిలిపోతుండేవాడు రాజు. అలా గడుస్తుండగా, ఒకరోజు ఆయన అడవికి వేటకు వెళ్లాడు. వేటలో జింకలు, బావురుపిల్లిలు, నెమళ్ళను వేటాడి, అలసిపోయి ఒక చెట్టు నీడన నిద్రించాడు. అప్పుడు ఆయన ఒక దివ్యమైన కల వస్తుంది.


ఆ కలలో ఒక పెద్దాయన కనపడి రాజా రాజ్యవర్ధనా....! "నేను నీకు ఎంతో అమూల్యమైన ధనం ఇస్తున్నాను. ఇకనైనా తృప్తిగా బ్రతకటం నేర్చుకో...!" అని అన్నాడు. దీంతో ఆశ్చర్యపోయిన రాజు... ఏదీ ఆ అమూల్యమైన ధనం... అంటూ చేతులు చాచాడు. ఆ... ఆ.... ఆగు ఆగు.... అయితే నువ్వు నేను పెట్టే ఓ షరతుకు ఒప్పుకుంటేనే ఆ ధనం నీకు సొంతమవుతుందని చెప్పాడా పెద్దాయన.

సరే మీ షరతును ఒప్పుకుంటున్నానని పెద్దాయనకు చెప్పాడు రాజు. అంతేగాకుండా ఆ కండీషన్ ఏమిటో చెప్పమన్నాడు. అప్పుడు పెద్దాయన ఇలా చెప్పాడు. "నేను నీకు ఏడు పెద్ద కూజాలు ఇస్తాను. వాటిలో ఆరు కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు అమూల్య రత్నాలు మొదలైనవి ఉంటాయి. ఏడవ కూజా మాత్రం సగం నిండి, సగం ఖాళీగా ఉంటుంది. కాబట్టి, నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ ఏడవ కూజా నింపితే ఆ తరువాత ఏడు కూజాలలోని ధనం, వజ్ర వైఢూర్యాలన్నీ నీవేనని చెబుతూ మాయమైపోతాడు.

వెంటనే సంభ్రమాశ్చర్యాలతో ధిగ్గున మేల్కొన్నాడు రాజ్యవర్ధనుడు. పక్కన పరికించి చూస్తే.... ధగ ధగా మెరిచే ఏడు కూజాలు కనిపించాయి. అంతేగాకుండా వాటిలో పెద్దాయన చెప్పినట్లుగానే ధనం, వజ్ర వైఢూర్యాలను చూసిన రాజుకి మతి పోయినంత పనైంది. వెంటనే తన పరివారాన్ని రప్పించిన రాజు ఆ ఏడు కూజాలను తన రాజ భవనానికి తరలించాడు.



తరువాత తీరికగా పెద్దాయన చెప్పినట్లుగా... ఏడవ కూజా సగ భాగానికి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు, నగలు, వజ్ర వైఢూర్యాలన్నింటినీ అందులో వేశాడు. అయినా కూజా నిండలేదు ఇంకా సగం భాగానే ఖాళీగానే ఉంది. దీంతో ఎటూ పాలుబోని ఆయనఆలోచనలో పడ్డాడు.

అటు తరువాత తన రాజ్యపు ఒక్కరోజు ఆదాయం మొత్తాన్ని కూజాలో వేసినా కూజాలోని సగం భాగం అలానే ఖాళీగా ఉంది. ఆపై వారం రోజుల ఆదాయాన్ని, ఆ తరువాత నెలరోజుల ఆదాయాన్ని కూజాలో వేసినా అలాగే ఖాళీగానే అది దర్శనమిస్తోంది. ఇంక ఇలాగ కాదు అనుకుంటూ రాజు ఒక సంవత్సరం ఆదాయం మొత్తాన్ని అందులో వేసినా ఖాళీ ఏమాత్రం తగ్గలేదు.

అంతే.... పూర్తిగా ఆగ్రహావేశాలకు లోనైన రాజ్యవర్థనుడు పౌరుషంతో, పట్టరాని అసహనంతో రాజ్యంలోని మొత్తం ఖజానాను అందులో వేసేందుకు సిద్ధపడ్డాడు. దీంతో పెద్దాయన రాజు కళ్లముందు ప్రత్యక్షమై ఇలా మాట్లాడాడు.

రాజ్యవర్ధనా...! నేను ఇచ్చిన ఏడో కూజా నీ మనసు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు. పూర్తిగా సుభిక్షంగా, ఎలాంటి లోటులేని రాజ్యానికి రాజువై ఉండి, ఎప్పుడూ అసంతృప్తితో జీవిస్తున్నావు నువ్వు. నీకు కళ్లు తెరిపించేందుకే నేను ఆ ఏడో కూజాను నీకిచ్చాను. ఇకమీదటైనా బుద్ధి తెచ్చుకుని సంతృప్తిగా బ్రతకడం నేర్చుకో...! అంటూ హితబోధ చేసి మాయమయ్యాడు పెద్దాయన.

అప్పటికీగానీ కళ్లు తెరచుకోని రాజ్యవర్ధనుడికి తాను చేసిన తప్పేమిటో అర్థమై.... ఇకమీదట తాను ఆవేశాన్ని తగ్గించుకుని సంతృప్తిగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి పిల్లలూ... మనకు లభించిన దానితో పూర్తిగా సంతృప్తికరమైన జీవితాన్ని గడపటం నేర్చుకోవాలని రాజ్యవర్ధనుడి కథ చదివితే మీకు అర్థమైంది కదూ...!

No comments:

Post a Comment