Pages

Thursday, July 19, 2012

కుందేలు ఉపాయం...

పిల్లలూ..! తెలివితేటలు, ఆలోచన, సమయస్ఫూర్తి ఉంటే శత్రువును ముప్పతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు త్రాగించవచ్చని నిరూపించే ఓ చిన్న కుందేలు కథను ఇప్పుడు మనం చదువుకుందాం...!

ఒకానొక కాలంలో పెద్ద కీకారణ్యంలో రకరకాల జంతువులన్నీ అన్యోన్యంగా ఉంటూ కలసిమెలసి జీవనం సాగించేవి. ఆ అడవికి, జంతువులన్నింటికి రారాజు సింహం. చాలా పౌరుషం కలిగిన ఆ సింహం ఎప్పుడూ తన పంతం చెల్లాలనే పట్టుదల... చాలా క్రూర స్వభావం కలిగి ఉంటుంది.


దీంతో ఆ సింహం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతుంటుంది. అది ఇష్టము వచ్చినట్లుగా అడవిలోని జంతువులను వేటాడి, చంపి తినేసేది. సింహం వేటకు బయలుదేరిదంటే చాలు... అడవిలోని జంతువులన్నీ భయంతో, ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీసేవి.

ఇలా లాభం లేదనుకున్న జంతువులన్నీ ఒకరోజు సమావేశమై... రోజుకొకరు చొప్పున సింహానికి ఆహారంగా వెళ్లాలని తీర్మానించుకున్నాయి. అన్నీ కలసి సింహం దగ్గరకు వెళ్లి తమ నిర్ణయాన్ని తెలియజేశాయి. ఎలాగైతేనేం తన ఆహారానికి డోకా లేదనుకున్న సింహం జంతువుల ప్రతిపాదనకు ఒప్పుకుంది.

ఎలాంటి కష్టం లేకుండా పడుకున్న చోటికే ఆహారం రావడంతో సింహం చాలా సంతోషంగా వాటిని ఆరగిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం జంతువులు తమ వంతు ప్రకారం సింహానికి ఆహారంగా వెళుతుంటాయి. ఇలా జరుగుతుండగా.. ఒకరోజు చిన్న కుందేలు వంతు వచ్చింది.

చాలా చిన్నదాన్నయిన తనకు అప్పుడే నిండు నూరేళ్లు నిండనున్నాయా అంటూ ఏడ్చింది కుందేలు. అయితే ఎలాగైనా సరే సింహం బారి నుండి తప్పించుకోవాలని ఆలోచించి ఒక ఉపాయం పన్నింది. తాను అనుకున్నది గనుక జరిగితే తనకే కాదు, అడవిలోని జంతువులన్నింటికీ స్వేచ్ఛ దొరికినట్లవుతుందని ఆలోచిస్తూ... సింహం దగ్గరకు కాస్తంత ఆలస్యంగా వెళ్ళింది.



అప్పటికే కుందేలు ఆలస్యానికి మండిపడుతూ వేచిచూస్తున్న సింహం... కుందేలును చూడగానే మండిపడుతూ... ఇంత ఆలస్యం ఎందుకైంది? అని ప్రశ్నించింది.

అప్పుడు కుందేలు వినయం, భయం, భక్తితో సింహానికి నమస్కరిస్తూ... "మహారాజా! నేను మామూలు వేళకు బయలు దేరాను దారిలో మరో సింహం కనిపించి నన్ను నిలదీసి గర్జించింది. తానే ఈ అడవికి మహారాజునని, మరొకడు రాజు కాలేడు కాబట్టి, నేనే నిన్ను ఆహారంగా తినేస్తానని అంది. అయితే నేను దాని మాటలను ఒప్పుకోక, ఎలాగోలా తప్పించుకుని మీ దగ్గరికి చేరుకునేసరికి ఆలస్యమైంది ప్రభూ...!" అని చెప్పింది.

అంతేగాకుండా... ఆ సింహం మిమ్మల్ని ఎంతగానో తిట్టిందని, మీకు పౌరుషం లేదని వెక్కిరించిందని కుందేలు రాజు సింహానికి చెప్పింది. ఇవన్నీ విన్న సింహం కోపంతో ఊగిపోతూ... "నేనేఈ అడవికి రాజునని, అసలు అదెక్కడుందో చూపించు దానిని నా పంజాతో కొట్టి చంపి పారేస్తాను" అని అంది.

అలాగే ప్రభూ...! రండి చూపిస్తానంటూ సింహాన్ని తీసుకుని ఓ పాడుబడ్డ బావిదగ్గరకు తీసుకొస్తుంది కుందేలు. సింహం తన శత్రువు కోసం వెదక సాగింది. ఎక్కడా కనిపించలేదు. దీంతో... " మిమ్మల్ని వెక్కిరించి, దూషించిన సింహం ఆ బావిలో ఉంది. వెళ్ళి చంపండి" అని చెప్పింది కుందేలు.

కుందేలు మాటలకి గర్జించిన సింహం నూతి గట్టుపైకి దూకి లోపలి చూసింది... ఈ సింహం గర్జించగానే ఆ సింహం గర్జించింది. ఈ సింహం పంజా పై కెత్తగానే ఆ సింహం పంజా పైకెత్తింది ఈ సింహం ఏంచేస్తే అది అలాగే చేయసాగింది. సింహానికి కోపం ఎక్కువై నూతి గట్టు మీద నుండి ఒక్కసారిగా బావిలోకి దూకింది. అంతే... బాగా పైనుంచి నీటిలో పడటంతో సింహం ఊపిరాడక చచ్చిపోయింది.

చూశారా.. పిల్లలూ...! తెలివితక్కువదైన సింహం, బావిలోని నీటిలో పడిన తన నీడనే మరో సింహంగా భావించి దూకేసి ఎలా చావును కొనితెచ్చుకుందో...! చిన్నదైనప్పటికీ.. కుందేలు "అపాయానికి తగిన ఉపాయం" పన్ని తన ప్రాణాలను కాపాడుకుంది. అంతేగాకుండా, అడవిలోని జంతువులన్నీ భయంలేకుండా బ్రతికే అవకాశం కల్పించింది.

No comments:

Post a Comment