Pages

Wednesday, August 15, 2012

మూర్ఖులకు హితవు...

ఒక అరణ్యంలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో ఆ అరణ్యంలోని చెరువులు, నీటికాలువలు పూర్తిగా ఎండిపోయాయి. కోతులకు విపరీతమైన దాహం వేసింది. అవి నీటికోసం వెతకటం మొదలుపెట్టాయి. అలా... అలా వెతుకుతూ అవి అరణ్యాన్ని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఏండమావులు మెరుస్తూ కనిపించాయి.

వాటిని నీటిగా భావించిన కోతులు మూకుమ్మడిగా అటు వైపు పరుగెత్తాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు లేవు సరికదా మరి కొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి. ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి. దాహంతో కోతుల నాలుక పిడచగట్టుకుపోసాగింది. ఎండవేడికి తలలు మాడిపోయి, కాళ్ళు బొబ్బలెక్కాయి. ఇక నడవడం చేతకాక కోతులు ఒక చెట్టు క్రింద కూలబడిపోయాయి.

"నీళ్ళతో గొంతు తడుపుకోకపోతే నా ప్రాణం పోయేలా ఉంది." దీనంగా అంది ఒక కోతి.

"ఏం చేద్దాం... నీళ్ళు కనబడుతున్నాయి కాని చేతికి అందటం లేదు. ఇదేమి మాయో..." అంది మరొక కోతి.

ఆ చెట్టు పక్కన ఉన్న పొదలో నివసించే కుందేలు జరిగినదంతా చూసింది. కోతులకు సహాయం చేయాలన్న మంచి అభిప్రాయంతో వచ్చి వాటి ముందు నిలబడింది.

"మీ తెలివితేటలు మండిపోను.. ఎండమావులను చూసి నీళ్ళని భ్రమ పడ్డారు. ఎండమావుల్లో ఎక్కడైనా నీళ్ళు ఉంటాయా? ఇటు వైపు ఒక కోసు దూరంలో చెరువు ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి" అని చెప్పింది.

కుందేలు మాటలు విని కోతులకు చాలా కోపం వచ్చింది.

"ఓహో... నువ్వే తెలివైన దానివా? మేము తెలివితక్కువ వాళ్ళమా?" అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దాని మెడ పట్టుకుంది.

"అయ్యో నేను చెప్పేది నిజం. నా మాటలు నమ్మండి" భయంగా అరిచింది కుందేలు.

ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో కీచుగా అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది.

ఆ తరువాత కోతులు కుందేలు చెప్పిన చెరువు వద్దకు వెళ్ళి దాహం తీర్చుకున్నాయి.

No comments:

Post a Comment