Pages

Wednesday, August 15, 2012

మూడు చేపలు

మంచిని ఎవరు చెప్పినా వినాలి. అలాకాక అజ్ఞానంతో, మూర్ఖత్వంతో ఆ మంచిమాటలను పెడచెవిన పెడితే అందుకు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఇతరులందరూ అబద్దాలు చెప్పేవాళ్ళు అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు. అలాంటి పొరపాటులు ఒక్కొక్కసారి ప్రాణాలకే ముప్పు తెస్తాయి అది ఎలాగో ఈ మూడు చేపల కధ ద్వారా తెలుసుకుందాం.

అంబాపురం సమీపంలో ఒక చిన్న చెరువు ఉంది. ఆ చెరువు నీటి గడ్డితోను నాచుతోను నిండి ఉండేది. ఆ చెరువులో ప్రభవ, విభవ, ఆశ్లేష అనే మూడు చేపలు ఎంతో స్నేహంగా ఉండేవి. ప్రభవ మంచి తెలివి కలది ఏ విషయం ఇతరులతో చెప్పించికోకుండా ఇట్టే పసికట్టి సమయానికి తగ్గట్టుగా మసలుకునేది. విభవ కొంచెం మందబుద్ధి ఏవిషయం అయినా నిదానంగా ఆలోచించి నడుచుకునేది. ఆశ్లేష అహంకారి అన్నీ తనకే తెలుసునని మిగిలిన రెండు చేపలకంటే తానే తెలివైన దానిననీ విర్రవీగుతూండేది.

ఈ ముడు చేపల మధ్య గుణగణాలలో తేడాలు ఉన్నా ఒకే జాతికి చెందిన చేపలు కావటం వల్ల వాటి మధ్య స్నేహం ఏర్పడింది. ఒకనాడు కొందరు జాలరులు వచ్చి చెరువును పరిశీలిస్తూ మట్లాడుకోవడం ప్రభవ విన్నది. వెంటనే తన మిత్రులైన విభవ, ఆశ్లేష దగ్గరకు వచ్చి 'మిత్రులారా! ఇప్పుడే ఇద్దరు జాలరులు మాట్లాడుకోవడం విన్నాను...' రెండు, మూడు రోజులలలో వచ్చి ఈ చెరువులో నీళ్ళు తోడి చేపలు పట్టుకుందాం అనుకుంటున్నారు. అందుకే మనం తొందరగా ఇక్కడికి దగ్గరలో ఉన్న మరో చెరువులోకి వెళ్ళిపోదాం ' అంటూ చెప్పింది. దాని మాటలకు ఆశ్లేష పగలబడి నవ్వి 'నువ్వు పిరికిపందవు' అంటూ ఎగతాళి చేసింది. విభవ మాత్రం 'ఇంకా రెండు మూడు రోజులు ఆగి కదా! అప్పుడు ఆలోచిద్దాం' అంది. ప్రభవ మాత్రం ఆ రాత్రికే వేరే చెరువుకు వలస వెళ్ళిపోయింది. రెండు రోజుల తరువాత వద్దామనుకున్న జాలరులు మర్నాడు ఉదయమే ఆ చెరువులో చేపలు పట్టుకునేందుకు వచ్చారు. చెరువులో కొంతభాగం బురుదమట్టితో గోడగా కట్టి ఇందులో నీళ్ళను తోడి అవతలకు పోసి ఆ తరువాత మిగిలిన కొద్దినీళ్ళల్లోకి వలలు వేసారు. దానితో చెరువులోని చేపలన్నీ వలలోకి చిక్కాయి.

'అయ్యో! మిత్రుడు చెప్పిన మాటలు వినకుండా ఈ జాలరులకు చిక్కామే' అంటూ విభవ, ఆశ్లేష భాధపడ్డాయి. ఆ సమయంలో విభవకు ఒక ఉపాయం తట్టింది. అది ఆశ్లేషకు చెబితే తనని ఎక్కడ ఎగతాళి చేస్తుందో అని చెప్పకుండా ఆ ఉపాయంతో తాను మాత్రమే జాలరుల నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. జాలరులు వలలోంచి ఒక్కొక్క చేపను తీసి బ్రతికున్నదా లేదా అని పరీక్షించి బుట్టలో వేసుకుంటున్నారు. అది గమనించిన విభవ జాలరి తనని వలలోంచి బయటకు తీసి పరీక్షిస్తున్నప్పుడు ఊపిరిబిగపట్టి చనిపోయినట్లు నటించింది. అది నిజంగా చచ్చిపోయింది అనుకున్న జాలరి దానిని చెరువు గట్టు మీదే వదిలేసి వెళ్ళిపోయాడు. జాలరి కనుమరుగు కాగానే విభవ మళ్ళీ చెరువులోని నీళ్ళలోకి గెంతి తన ప్రాణాలను కాపాడుకుంది. అహంకారంతోను, మూర్ఖత్వంతోను విర్రవీగిన ఆశ్లేష మాత్రం జాలరుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంది.

అందుకే పిల్లలు! మంచి మాటని ఎవరు చెప్పినా వినాలి. దాన్ని తప్పకుండా ఆచరించాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు పెద్దలకో... మనకంటే తెలివైన వారికో చెప్పి ఆ నిర్ణయం మంచిదో, చెడ్డదో తేల్చుకోవాలి.       

No comments:

Post a Comment