Pages

Monday, August 13, 2012

ప్రాణం తీసిన దురాశ

సంస్కృత భాషలో అద్భుతమైన నీతి కథలను, నీతి చంద్రిక, పంచతంత్రము, హితోపదేశము మొదలైన పేర్లతో లోకానుభవంతో పండిన మహానుభావులు రచించారు. హితోపదేశం - మిత్రలాభంలో నారాయణకవి చెప్పిన గొప్ప నీతి వున్న చిన్న కథ ఒకటి ఉంది.

వింధ్యారణ్య ప్రాంతంలో భైరవుడు అనే పేరుగల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహారపదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరకనిదేముంది? ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం ఇలా ఎన్నో లభిస్తాయి. కాని, ఈ శాఖాహారం కంటే కుందేలు, జింక, అడవి పంది వంటి జంతువుల మాంసాహారమే ఈ వేటగాళ్ళు ఇష్టపడతారు. భైరవుడు ఒకనాడు ఒక బలసిన జింకను వేటాడి చంపాడు. ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చుననుకుంటూ, దానిని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది కనిపించింది.

భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకున్నాడు. పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. అడవి పందులకు కోపం మొండితనం ఎక్కువ. వేటగాడి బాణం వెనుదిరిగి వచ్చిందా అన్నట్లు, అది అతి వేగంగా వచ్చి, భైరవుని పొట్టను కోరలతో చీల్చి చంపింది. తర్వాత, అదీ చచ్చింది. వీరి తొక్కిసలాటలో ఆటుగా వచ్చిన పాము కూడా, ప్రాణాలు విడిచింది.

ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెదకుతూ అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేవు. పులి, సింహం లాంటి జంతువులు చంపి తిని వదలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తి పడతాయి. అందుకే ఒకేసారి నాలుగు శవాలు కనిపించే సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది. నక్క ఇలా ఆలోచించింది "ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాని ధనుస్సుకు కట్టివున్న కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది."

క్షుద్రబుద్ధి వింటిని సమీపించి, లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే! పదునైన వింటి కోపు దాని శరీరంలో గుచ్చుకుని, తన దురాశకు చింతిస్తూ క్షుద్రబుద్ధి ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ ఐదు శవాలు పడి ఉన్నాయి.

భైరవుడు ఒక మృగము చాలదని మరో దాన్ని వేటాడబోయి చచ్చాడు. క్షుద్రబుద్ధిఎటువంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిండి దొరికించుకుని కూడా పేరుకు తగినట్లు పిసినారి తనంతో వింటినారిని కొరికి, తానూ శవంగా మారింది. అందుకే అత్యాశ మంచిది కాదు. మానవుడు ఆశాజీవి. కానీ దురాశకు పోతే దుఃఖమే మిగులుతుంది.        

No comments:

Post a Comment