Pages

Monday, August 13, 2012

ప్రాణాలు తీసిన స్వార్ధం

ఒక ఊరిలో ఒక జమీందారుండేవాడు. ఒక నాటి రాత్రి ఇద్దరు దొంగలు జమీందారు ఇంట్లో తమకు దొరికినంత బంగారాన్ని, ధనాన్ని దోచుకుని ఆడవిలోకి జారుకున్నారు, ఆ బంగారాన్ని మరసటి రోజు తమ పక్క ఊరిలో అమ్మాలని ముందే నిర్ణయించుకున్నారు, అప్పటివరకు ఆ ధనాన్ని ఎక్కడైనా దాచేయాలని అనుకున్నారు.

ఒక చెట్టు బోదెలో బంగారాన్ని దాచారు. కాని అది భద్రంగా ఉంటుందని వారికి నమ్మకం కలగలేదు, అందువల్ల వారిద్దరూ ఆచెట్టు బోదెవైపు ఒక కన్ను వేయాలని ఎవరికివారు అనుకున్నారు.

కొద్దిసేపటి తర్వాత ఇద్దరికీ ఆకలివేసింది. కాని అంత ధనాన్ని వదిలి వారిద్దరూ తినడానికి ఎలా వెళ్లగలరు? కాబట్టి భోజన వసతలు ఏర్పాటుచేయడానికి కూడా వాళ్లు వంతులు వేసుకోవాలనుకున్నారు వారిలో మొదటి వాడు రెండవాడితో "లంబూ, నీవు ఈ బంగారానికి రక్షణగా ఉండు. నేను ఊర్లోకి వెళ్లి మనకు కావలసిన భోజనం తీసుకువస్తాను" అన్నాడు.

"సరేరా జంబూ! కాని త్వరగా వచ్చెయ్" అని లంబూ బదులిచ్చాడు.

జంబూ ఊర్లోకి వెళ్లాడు ఆ లోపల లంబూ 'నేను ఈ దొంగిలించిన ధనాన్ని జంబూతో పంచుకోవడమెందుకు?" అని ఆలోచించి ఒక పన్నాగం పన్నాడు.

జంబూ భోజనం తీసుకురాగానే అతణ్ణి చంపి మొత్తం ధనాన్ని బంగారాన్ని తానే సొంతం చేసుకోవాలనుకున్నాడు.

ఊర్లోకి వెళ్లిన జంబూకు కూడా అచ్చం ఇలాంటి ఆలోచనే వచ్చింది. అతను భోజనం చేసి లంబూకు తీసుకువచ్చే ఆహారంలో విషం కలిపాడు. కొద్దిసేపటి తర్వాత, జంబూ అడవిలోని ఆ చెట్టు వద్దకు చేరుకున్నాడు. చెట్టు పక్కన దాక్కున్న లంబూ ఒక పెద్ద రాయితో జంబూ తలపై బలంగా మోదడంతో జంబూ విలవిల్లాడుతూ కిండపడి ప్రాణం విడిచాడు. సంతోషంగా విషం కలిపిన ఆహారం తిన్న లంబూ నురగలు కక్కుతూ మరణించాడు,

అంత ధనం, బంగారం వారిద్దరిలో ఎవరికీ దక్కకుండా పోయింది.

పిల్లలు! అతి స్వార్ధం అనర్ధాలకు దారి తీస్తుందని పెద్దలెందుకంటారో అర్ధమయిందా?!

No comments:

Post a Comment