Pages

Monday, August 13, 2012

పరోపకారి

ఒక ఊరిలో రామారావు అనే ఒక ధనవంతుడుండేవాడు. ఆయన చాలా ఉదారస్వభావంగలవాడు. అనేక విద్యాసంస్థలకు, అనాధ శరణాలయాలకు విరివిరిగా దానధర్మాలు చేసిన మనసున్న మనిషి. రామరావు తన దానగుణం వల్ల ఎంతో పేరు గడించాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా అవడం వలన ఆయన గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు.

రామారావు దగ్గర చాలాకాలం నుండి పని చేస్తున్నాడు దానయ్య. ఒకరోజు దానయ్య రామరావును "అయ్యా! తమకు ఏమి తక్కువ? ఇన్ని సంపదలుండి మీరు విలాసవంతమైన జివితాన్ని కోరుకోరు. ఉదయం, సాయంత్రం పనివాళ్ళతో కలిసి పనిచేస్తారు. సరైన బట్టలు కూడా వేసుకోరు. అనుభవించడానికేగా ఈ సంపదంతా" అని అడిగాడు. దానికాయన ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

కొంతకాలం తర్వాత వ్యాపారాల్లో నష్టాలు సంభవించాయి. ఆయన మంచిగుణం వలన ఇల్లు మాత్రమే మిగిలింది. అయినా ఆయన దిగాలుపడకుండా సంతోషంగానే ఉండసాగాడు. అప్పుడు దానయ్య "అయ్యా! ఇన్నాళ్ళు అంత ధనవంతుడిగా ఉండి మీరు ఇంత పేదవాడిగా కూడా ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు?" అని అడిగాడు.

చిరునవ్వుతో రామరావు "దానయ్య! నేను ధనవంతుడిగా ఉన్నా బీదవాడిగానే జివించాను, సుఖం అనేది శాశ్వతం కాదు, ఒక చుట్టం వంటిది. ధనమున్నదని విలాసవంతమైన జీవితానికి అలవాటుపడితే, ధనంలేని రోజు బ్రతుకు నరకంలా ఉంటుంది. నా స్థితి బాగున్న సమయంలో ఎందరికో సాయం చేసాను, వారిలో కొందరు నాకు ఈ స్థితి లో సహాయం చేస్తున్నారు" అన్నాడు. ఆ తర్వాత మిత్రులు, శ్రేయోభిలాషుల సహాయంతో వ్యాపారంలో ప్రవేశిఇంచి ఆయన మంచిగుణం వలన త్వరలోనే పూర్ణస్థితికి చేరుకున్నాడు. రామారావు వ్యక్తిత్వం, కీర్తిప్రతిష్టలు ఆయన్ని ఈ స్థితికి చేరుకునేలా చేశాయి.

No comments:

Post a Comment