Pages

Monday, August 13, 2012

ప్రాణం తీసిన దొంగతనం

కోటయ్యకు చిల్లర దొంగతనాలు చేయడం అలవాటు. తన దొంగతనాలకు బాగా ఉపయోగపడుతుందని తోచి, ఓ కోతిని తీసుకు వచ్చాడు. తన దొంగ విద్యలన్నిటినీ ఆ కోతికి బాగా నేర్పాడు. ఆ కోతి అలికిడి కాకుండా దొడ్డి గోడలు ఎక్కి, లోపల వున్న విలువైన వస్తువులను తీసుకువచ్చి ఇస్తూవుండేది. ఆ వస్తువులను అమ్మి కోటయ్య సొమ్ము చేసుకొంటూ వుండేవాడు.

ఇలా ఉండగా ఊరిలోని దేవాలయంలో వున్న కొబ్బరి చెట్ల మీద కోటయ్య కన్ను పడింది. ఆ కొబ్బరి చెట్లు చాలా పొడుగైనవి. ఆకాశంలో మబ్బులను అందుకొనేటంత ఎత్తయిన ఆ చెట్ల కాయలను కోయడానికి ఎవరికీ ధైర్యం చాలదు. అందుచేత ఎవ్వరూ ఆ చెట్లను ఎక్కరు. కోసే వారు లేకపోవడంవల్ల, గుత్తులు గుత్తులుగా కాయలతో కొబ్బరి గెలలు వేలాడుతూ వుంటాయి.

కోటయ్య కొబ్బరిచెట్టు దగ్గరకు కోతిని తీసుకువచ్చి సంజ్ఞ చేశాడు. చర చరా చెట్టు ఎక్కి మొవ్వులో కూర్చుని, కోతి ఒక్కొక్క కాయనే తుంచి కింద పడవేయడం మొదలు పెట్టింది. కిందపడిన కాయలను ఆదరాబాదరా ఏరుకొంటూ, పోగుచేస్తూ, కోటయ్య, తల పైకెత్తి చూడటం మరిచి పోయాడు. అంతలో రెండు కొబ్బరి కాయలు అతని నడి నెత్తి మీద పడ్డాయి. ఎంతో ఎత్తు నుండి పడినందువల్ల, ఆ దెబ్బకు తల పగిలి రక్తం కక్కుకొంటూ, గిలగిల తన్నుకొని, కోటయ్య కన్ను మూశాడు!

కొబ్బరికాయలు పడుతున్న చప్పుడు విని పూజారి గబగబా వచ్చాడు. కొబ్బరి చెట్టు కింద కోటయ్యను, పైన కోతి చూసి ఆశ్చర్యపోయాడు!"తాను దొంగతనాలు చేయడమే గాక, కోతికి కూడా ఆ విద్య నేర్పాడు దురలవాటు నేర్వడం, నేర్పటం సుళువే కాని, ఒక్కొక్కప్పుడు ఆ దురలవాటు ప్రాణాలు తీస్తుంది కదా" అనుకొంటూ నిలబడి పోయాడు ఆ పూజారి నిశ్చేష్టుడై...!        

No comments:

Post a Comment