Pages

Saturday, September 15, 2012

తెలివిగల వదినె


శివన్‌ ఉన్నత కుటుంబంలో పుట్టాడు. అన్నయ్య శంకరన్‌ పుట్టిన పదేళ్ళ తరవాత అతడు తల్లిదండ్రులకు రెండవ బిడ్డగా కలిగాడు. శివన్‌ పసివాడుగా ఉన్నప్పుడే అతడి తల్లి తీరని వ్యాధికి గురయింది. పడకపై నుంచి లేవలేని స్థితికి చేరుకున్నది. ఆమె ఒకనాడు భర్తనూ, పిల్లలనూ దగ్గరికి పిలిచి, పెద్ద కొడుకుతో, ‘‘నాయనా శంకరన్‌. నువ్వు నీ తమ్ముణ్ణి తండ్రిలాగా చూసుకోవాలి.
 
ఇదే నా చివరి కోరిక,'' అని చెప్పి శివన్‌ చేతిని శంకరన్‌ చేతిలో పెట్టి కన్నుమూసింది. శంకరన్‌ యుక్తవయస్కుడయ్యూక, అతని తండ్రి మంచి సంప్రదాయ కుటుంబానికి చెందిన పార్వతి అనే యువతితో అతని పెళ్ళి జరిపించాడు. ఆమె భర్తకు అనురాగవతి అయిన భార్యగా, మామగారికి బాధ్యతగల కూతురులా, పసివాడైన శివన్‌కు వాత్సల్యంగల తల్లిగా మసలుకుంటూ అచిరకాలంలోనే అందరి ఆదరాభిమానాలకూ పాత్రమయింది.
 
పార్వతి పసివాడి పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబరచేది. రోజూ అతడి అవసరాలు చూసుకుంటూ బడికి పంపేది. బడి నుంచి రాగానే అతనికి కావలసిన ఫలహారాలు చేసి పెట్టేది. భర్త గాని, మామగారు గాని శివన్‌ గురించి ఏమాత్రం విచారం చెందకుండా జాగ్రత్తపడేది. శివన్‌ అందమైన యువకుడుగా పెరిగిపెద్దవాడయ్యూడు.
 
చదువు పూర్తయ్యూక శివన్‌ను ఉద్యోగానికి పంపడానికి ఆమె ఇష్టపడలేదు. మామగారు ఏవో పనుల మీద రాజుగారినీ, అధికారులనూ కలుసుకోవడానికి తరచూ రాజధానికి వెళుతూ ఉంటాడు. భర్త ఆస్తిపాస్తులను చూసుకుంటూ అద్దెలు వసూలు చేయడంలో తలమునకలుగా ఉంటాడు.

అందువల్ల శివన్‌కు పెళ్ళి చేస్తే ఇంట్లో తన పనిపాటులు పంచుకోవడానికి ఒక ఆడతోడు లభిస్తుందని ఆశించింది పార్వతి. ఒకనాడామె శివన్‌తో ఆ విషయం ప్రస్తావించినప్పుడు - తను గౌరి అనే అమ్మాయిని గుడిలో చూసి ఇష్టపడ్డానని అతడు చెప్పాడు. పార్వతి కూడా గౌరిని అంతకు ముందే చూసింది. చాలా అందమైన పిల్ల. సంప్రదాయ బద్ధమైన ధనికకుటుంబానికి చెందినది.
 
అందువల్ల శివన్‌కు ఈడూ జోడూగా ఉంటుందని సంతోషించింది. వెంటనే గౌరిని చూసి తన మనసులోని మాటను చెప్పమని శివన్‌కు సలహా ఇచ్చింది. మరునాడే శివన్‌ గౌరి ఇంటికి వెళ్ళాడు. గౌరిని చూసి ఆమెను పెళ్ళాడాలన్న తన కోరికను తెలియజేశాడు. ఆ మాటవిని ఆమె ఆశ్చర్యపడలేదు. అతణ్ణి అంతకు ముందే చూసి ఉండడంవల్లా, అతడు ఉన్నత కుటుంబానికి చెందిన విద్యావంతుడని తెలియడం వల్లా, అతణ్ణి పెళ్ళాడడానికి గౌరికి సంతోషంగా ఉంది.
 
అయినా అతని ప్రతిపాదనను వెంటనే అంగీకరించకుండా కొంత బెట్టుచేయూలని అనుకున్నది. ‘‘నీకొక పరీక్షపెడతాను. అందుకు నీకు అభ్యంతరం లేదుకదా?'' అని అడిగింది గౌరి. ‘‘లేదు,'' అన్నాడు శివన్‌. ఆమె ఇంట్లోకి వెళ్ళి ఒక పాత్రను తీసుకువచ్చి, ‘‘ఇందులో ఆవాలు, నువ్వులు కలిసి ఉన్నాయి. వాటిని వేరు చేసి రేపు ఉదయం నువ్వులు మాత్రం తీసుకు రా,'' అన్నది. శివన్‌ ఆ పాత్రను తీసుకుని ‘‘ఏమిటీ అల్ప పరీక్ష,'' అనుకుంటూ ఇంటి కేసి బయలుదేరాడు.
 
ఇంటి గుమ్మంలోనే అతన్ని చూసిన పార్వతి, ‘‘ఏమయింది శివన్‌? గౌరిని చూశావా? ఏమిటా పాత్ర?'' అని అడిగింది. శివన్‌ గౌరిని చూసిన విషయం చెప్పి, ‘‘ఆమెనన్ను పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడుతోంది ఒప్పోల్‌ (అక్కయ్యూ). అయినా నాకొక పరీక్ష పెడతానంటూ ఈ పాత్ర ఇచ్చింది. ఇందులో ఆవాలు, నువ్వులు ఉన్నాయి.
 
వీటిని తెల్లవారే సరికల్లా వేరు చేసి, నువ్వులు తీసుకురమ్మన్నది. రాత్రంతా మేలుకుంటే తప్ప అది అంత సులభంగా కనిపించడం లేదు,'' అన్నాడు. గౌరి చాలా తెలివైన అమ్మాయి అని పార్వతి వెంటనే గ్రహించింది. ఆమె నవ్వుతూ, ‘‘నువ్వేం విచార పడకు.

అది తెల్లవారే సరికి సద్ధంగా ఉంటుంది,'' అంటూ పాత్రను తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. ఒక నౌకరును పిలిచి, చెట్టు నుంచి ఒక చీమలగూడును తెమ్మని చెప్పింది. కొన్నిరకాల చీమలు ఆకులతో కొమ్మల మధ్య గూళ్ళు కట్టి వాటిలో నివసిస్తాయి. నౌకరు గూటిని తీసుకురాగానే పార్వతి చీమలను పాత్రలో వదిలి, పాత్రను అక్కడే పెట్టి వచ్చింది. మరునాడు తెల్లవారేసరికి చీమలు ఆవాలన్నిటినీ తినేశాయి.
 
నువ్వులు మాత్రం మిగిలి ఉన్నాయి. చీమలు వాటిని తినవు. పార్వతి శివన్‌ను పిలిచి పాత్రను చేతికిచ్చింది. తన వదినె, గౌరికన్న చాలా తెలివైనదని శివన్‌ గ్రహించాడు. అతడు వేగంగా వెళ్ళి ఆ పాత్రను గౌరికి ఇచ్చాడు. ఆమె చిన్నగా నవ్వి, ఇంట్లోకి వెళ్ళి మరో ఖాళీ పాత్రను తెచ్చి శివన్‌కు ఇస్తూ, ‘‘దీని నిండా మంచు నింపుకుని తెల్లవారేసరికి రాగలవా?'' అన్నది. శివన్‌ దాన్ని అందుకుని నిరుత్సాహంతో వెనుదిరిగాడు.
 
‘‘ఆవాలు, నువ్వులు వేరు చేయడం సులభం. తెల్లవారేసరికి ఈ పాత్రనెలా మంచుతో నింపడం? బహుశా వదినె దీనికేదైనా మార్గం చూపగలదు,'' అనుకుంటూ నడవసాగాడు. మరో పాత్రతో శివన్‌ నిరుత్సాహంగా నడిచిరావడం చూసి పార్వతి తెల్లబోయింది. ‘‘మళ్ళీ పరీక్షా?'' అని అడిగింది. ‘‘అవును,'' అంటూ శివన్‌ జరిగినదంతా వివరించాడు. ‘‘ఫరవాలేదు. విచారించకు (అనియూ) తమ్ముడూ! దానికీ ఏదో ఒక ఉపాయం కనుగొందాం,'' అన్నది పార్వతి.
 
ఆమె స్థానికులైన రజకులను పిలిపించి, ‘‘మీరు నాకొక సాయం చేయూలి. మీ దగ్గరున్న బట్టలన్నిటినీ రాత్రి తెల్లవార్లూ మంచులో ఆరబెట్టండి. తెల్లవారు జామున బట్టలలో చేరిన మంచును బానలోకి పిండి తీసుకురండి,'' అన్నది. సరేనని వాళ్ళు వెళ్ళారు. మరునాడు చెప్పినట్టే బానలో మంచునీళ్ళు తీసుకువచ్చారు. పార్వతి దాన్ని శివన్‌ తెచ్చిన పాత్రలో నింపి, గౌరికి పంపింది. శివన్‌ దాన్ని తీసుకుపోయి గౌరికి ఇచ్చి, ‘‘ఇప్పుడు నీకు సంతోషం అనుకుంటాను,'' అన్నాడు.

పాత్రలో స్ఫటికంలా తేటగా ఉన్న నీటిని చూసి గౌరి చిన్నగా నవ్వుతూ, ‘‘చాలా సంతోషం. అయితే నీకు మరో పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. నాకు వంద లేత తమలపాకులు కావాలి. వాటిని తాజాగా కోసుకురావాలి. అయితే, అలా ఆకులు తుంచడానికి చేతినిగానీ, కత్తినిగానీ ఉపయోగించకూడదు,'' అన్నది. ‘‘చేతినీ, కత్తినీ ఉపయోగించకుండా లేత తమలపాకులను కోయడం ఎలాగా? అసాధ్యం!'' అనుకుంటూ విచారంతో ఇల్లు చేరిన శివన్‌ వాలకం చూసి, ‘‘ఈ రోజు ఎలాంటి పరీక్ష పెట్టిందేమిటి?'' అని అడిగింది పార్వతి.
 
శివన్‌ చెప్పిన విషయం విని, ‘‘ఆమెకు తృప్తి కలిగించడానికి ఏదైనా ఉపాయం ఆలోచిస్తాను. పరీక్షలు ఇంతటితో అయిపోయూయూ? ఇంకా ఉన్నాయూ? అని తెలుసుకోవడానికి నేను రేపు నీతోపాటు అక్కడికి వస్తాను,'' అన్నది ఆమె. పార్వతి తీవ్రంగా ఆలోచించడంతో ఆమెకో ఆలోచన మెరుపులా తోచింది. ఆమె ఒక చిలుకను పెంచుతున్నది. ఆమె ఆ చిలుకను పెరట్లో వున్న తమలపాకుల తోటలోకి తీసుకు వెళ్ళి వదిలిపెట్టింది. చిలుక అటు ఇటూ ఎగురుతూ ముక్కుతో తమలపాకులను తుంచసాగింది.
 
పార్వతి ఆకులను సేకరించి, వాటి నుంచి వంద లేత తమలపాకులను విడిగా తీసి పెట్టింది. ఆ తరవాత చిలుకను బోనులోకి పంపింది. ఆ మరునాడు పార్వతి శివన్‌తో కలిసి గౌరి ఇంటికి బయలుదేరింది. ఆమెను చూడగానే గౌరి-శివన్‌ను అన్ని పరీక్షలకు గురి చేసినందుకు ఇబ్బందిగా తలదించుకున్నది. ‘‘చేచీ (అక్కయ్యూ), నన్ను అపార్థం చేసుకోకండి. మీ అనియన్‌ ఈ పరీక్షల్లో నెగ్గక పోయినా, నేను అతణ్ణే పెళ్ళాడి ఉండేదాన్ని.
 
నేను అతనిలాంటి వ్యక్తిని వేరెవర్నీ చూడలేదు; నన్ను క్షమించండి,'' అన్నది. పార్వతి ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుని, ‘‘నేను మాత్రం అతడు వేరే అమ్మాయిని పెళ్ళాడడానికి అనుమతించేదాన్ననుకున్నావా?'' అన్నది. గౌరి తల్లిదండ్రులతో మాట్లాడాక శివన్‌-గౌరిపెళ్ళి ఘనంగా జరిగింది. పార్వతి తెలివితేటలనూ, శివన్‌ పట్ల ఆమెకున్న శ్రద్ధనూ భర్త శంకరన్‌, మామగారు ఎంతగానో మెచ్చుకున్నారు.

No comments:

Post a Comment