Pages

Friday, January 11, 2013

జ్ఞానోదయం

సింహపురి గ్రామంలో శివయ్య అనే పేద రైతుండేవాడు. అతని భార్య సావిత్ర. వాళ్ళిద్దరూ కూలి పని చేస్తూ జీవించేవారు. వారి కొడుకు రంగడు. తాము తిన్నా తినకపోయినా వాడినెప్పుడూ పస్తుపెట్టకుండా చదివించి, ఆ గ్రామ పెద్ద సహకారంతో చిన్న ఉద్యోగం కూడా సంపాదించి పెట్టారు. రంగడు తల్లిదండ్రుల పట్ల వినవిధేయలతో ఉండేవాడు. చెప్పినట్లు వినేవాడు. ఉద్యోగంలో మొదటిసారి జీతం తీసుకున్నవెంటనే వాళ్లను కూలి పని మానిపించి, కుటుంబ భాద్యత తనే వహించాడు. కొడుక్కి తమ పట్ల గల ప్రేమకు సావిత్రి, శివయ్య ఎంతగానో పొంగిపోయేవారు. ఊళ్ళో నలుగురికీ వాడి గురించి ఎంతోగొప్పగా చెప్పుకుని మురిసిపోయేవారు.

కొంతకాలం తర్వాత రంగడికి విమల అనే అమ్మాయితో పెళ్ళయింది. కన్నవారు ధనవంతులు కావడంతో రంగడికి కట్నకానుకలు కాస్త ఎక్కువగానే ముట్టజెప్పారు. అయితే, విమల బాగా గడుసు మనిషి ఆమె నోరు చాలా చెడ్డది. పైగా డబ్బు పిచ్చి ఎక్కువ. అత్తామామలు ఊరికే కూర్చుని తినడం, ఆ ఇంట్లో ఉండటం ఆమెకు ఎంతమాత్రం ఇష్టం లేదు. రంగడు ఇంటికి రావడమే ఆలస్యంగా వాళ్ళమీద లేని పోని చాడీలు చెబుతుండేది. చెప్పుడు మాటలు విషం లాంటివి. ఎంత మంచివారైనా వాటి ప్రభావంలో పడిపోతారు. భార్య ఎక్కించే విషంతో రంగడిలో విచక్షణా జ్ఞానం పూర్తిగా నశించింది.

తల్లిదండ్రులు బారంగా తోచారు... ఎక్కడికైనా పంపుదామన్నా వాళ్ళు వెళ్లరు. కాబట్టి మొత్తంగా ఈ లోకం నుంచే పంపించేయాలని నిశ్ఛయించుకున్నాడు. ఒక రోజు సంచి ఒకటి భుజాన తగిలించుకొని, పతంగిపురంలో జరుగుతున్న తలుపులమ్మ తల్లి తీర్థానికి వెళదామని చెప్పి. వాళ్లను బయలుదేరమన్నాడు. వాళ్ళు కోడల్ని కూడా రమ్మన్నారు. కానీ ఏదో వంక పెట్టి తప్పించుకుంది విమల. పతంగిపురం వెళ్లడానికి కొంత దూరం అడవి మార్గాన ప్రయాణించాలి. అడవి మద్యకు రాగానే రంగడు విశ్రాంతి మిషతో ఓ చెట్టు నీడన తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టాడు. ఇప్పడే వస్తానని చెప్పి, వెళ్ళి సంచిలో ఉన్న సామాగ్రితో దొంగోడి వేషం వేసుకున్నాడు.

ధృఢంగా ఉన్న ఓ చెట్టు కొమ్మను విరిచి పట్టుకుని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. దానితో కొట్టి తల్లిదండ్రులను చంపాలని కర్రను పైకెత్తాడు. మారువేషంలో ఉన్న కొడుకుని గుర్తుపట్టలేదు వాళ్ళు. ‘‘ ఒరే రంగా  ఎవడో మమ్మల్ని కొట్టిచంపబోతున్నాడు. ఎక్కడున్నావో గాని నువ్వు ఇటు రావద్దు. వెంటనే పారిపోయి నీ ప్రాణాలు దక్కించుకో’’ అంటే అదే పనిగి అరవసాగారు. రంగడి చేతిలోని చెట్టు కొమ్మ అసంకల్పితంగా కిందికి జారిపోయింది విమల ఎక్కించిన విషం విరిగి, వాడికి జ్ఞానోదయమైంది.తల్లిదండ్రులకు తమ పిల్లల మీదుండే ప్రేమ అమృతం లాంటిదని, అనంతమైనదని అర్థమైంది. కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగుతూండగా మారువేషం తీసేశాడు. తల్లిదండ్రుల కాళ్ళమీద పడి క్షమించమని వేడుకున్నాడు.

 వాళ్లను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రోజు నుండి రంగడు బార్యను అదుపులో పెట్టి, తల్లిదండ్రుల్ని ఎప్పటిలా ఆదరంగా, ఆప్యాయంగా చూసుకోసాగాడు.   

No comments:

Post a Comment