Pages

Friday, January 11, 2013

ఎవరు తిండిపోతు ?

ఒక సారి బీర్బల్ బజారు వెంటవెళ్తూ ఉంటే దారిలో రేగుపళ్లు అమ్మేవాడు కనిపించాడు. నిగనిగలాడుతున్న ఆ రేగుపళ్లని చూడగే బీర్బల్ కి తినాలనిపించింది. తీరా ఆ రుగుపళ్లని కొన్నాక అంతటి మంచి రేగుపళ్లని అక్బర్ పాదుషాకి కూడా తినిపించాలని అనిపించింది. వెంటనే రేగుపళ్లు తీసుకుని వెళ్లాడు.

 ఏంటీ బీర్బల్, హఠాత్తుగా ఇలా వచ్చావ్ ? అని అడిగాడు అక్బర్. మీరు తింటారని మంచి రేగుపళ్లు తెచ్చాను ప్రభూ అని అన్నాడు బీర్బల్. ఓ రేగుపళ్లా ? మా రాణిగారికి రేగుపళ్లంటే చాలా ఇష్టం. మన ముగ్గురం రేగుపళ్లు తిందా?! అని రాణి గార్ని కూడా అక్బర్ అక్కడికి పిలిపించాడు. ఒక పెద్ద పళ్ళెంలో రేగుపళ్లు పోసి ముగ్గురూ దాని చుట్టూ కూర్చుని రేగుపళ్లు తినడం మొదలుపెట్టారు. రేగుపళ్లు చాలా రుచిగా ఉన్నాయ్. ముగ్గురికీ అవి ఎంతోగానో నచ్చాయ్.

 అక్బర్ పాదుషాకైతే మరిమరీ నచ్చాయ్. అవి తింటున్నపుడు అక్బర్ కి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. రాణిగారిని ఒక తిండిపోతుగా చిత్రించి సర్దాగా ఆట పట్టిద్దాం అని అనుకున్నాడు. అందుచేత తాను తిన్న రేగుపళ్లు గింజలను రాణిగారివైపు ఆమె గమనించకుండా మెల్లగా చెయ్యసాగాడు. కానీ అక్బర్ చేస్తున్న పనిని గమనిస్తూనే ఉన్నాడు. అక్బర్ మనసులో ఏముందో గ్రహించిన బీర్బల్ నవ్వుకున్నాడు. ముగ్గురు రేగుపళ్లు తినేశారు. అక్బర్ పక్కన కేవలం అయిదారు రేగు గింజలు మాత్రం ఉన్నాయ్.

బీర్బల్ పక్కన కొన్ని గింజలు ఉన్నాయ్. కానీ రాణిగారి పక్కన బోలెడన్ని గింజలు ఉన్నాయ్ అవును మరి, వాటిలో సగానికి పైగా అక్బర్ పాదుషా తిన్న రేగుపళ్లగింజలే. రాణి వైపు ఉన్న గింజల్ని చూపిస్తూ.. చూశావా బీర్బల్! మీ మహారాణి ఎంత తిండిపోతో? ఆ గింజల్ని చూస్తేనే తెలుస్తుంది ఆమె ఎన్ని రేగుపళ్లు తినిందో ? అన్నాడు అక్బర్ నవ్వుతూ.

 అందుకు బీర్బల్ ‘‘ కాని రాణివారికంటే ప్రభువులే ఎక్కువ తిండిపోతని నా అభిప్రాయం ఎందుకంటే రాణివారు పళ్లతిని, గింజల్ని వదిలేశారు. తమరు ఆ గింజల్ని కూడా వదలకుండా తినేశారు’. అన్నాడు బీర్బల్ కొంటెగా. బీర్బల్ తన పక్షాన మాట్లాడినందుకు మహారాణి ఎంతో సంతోషించింది. అక్బర్ మాత్రం ‘‘ అబ్బో, ఈ బీర్బల్ ఉండగా తన ఆటలు సాగవు’’ అనుకుంటూ సిగ్గుతో తలవంచుకున్నాడు.  

No comments:

Post a Comment