Pages

Friday, September 7, 2012

దొరలు-దొంగలు


ఒక ఊళ్ళో భూషయ్య అనే భూస్వామికి విరూపుడనే పెళ్ళీడు వచ్చిన కొడుకు ఉండేవాడు. అతను రాత్రివేళ తమ ఇంటి వెనక రావిచెట్టు కింద నిద్రపోయేవాడు. తెల్లవారి లేస్తూనే చెట్టు మీది పక్షులను చూసి ఆనందించేవాడు. ఒకరోజు ఉదయం విరూపుడు నిద్ర లేస్తూనే చెట్టుకేసి చూసి, కెవ్వున అరిచి, స్పృహ తప్పి పడిపోయాడు. ఆ కేకకు భూషయ్య ఇంట్లో నుంచి వచ్చి, కట్టెలా పడిఉన్న కొడుకును నౌకర్ల చేత ఇంట్లోకి చేర్పించాడు.
 
కొద్దిసేపటికి విరూపుడికి స్పృహ వచ్చింది గాని అతను పిచ్చిచూపులు చూస్తూ, మతితప్పినవాడిలా మాట్లాడ సాగాడు. విరూపుడి స్థితిచూసి భూషయ్య కంగారుపడటానికి మరో కారణం ఏమంటే, ఆ రోజే ఎవరో అతన్ని పెళ్ళిచూపులు చూడవస్తున్నారు. భూషయ్య వాళ్ళకు ఒకవారం తరవాత రమ్మని కబురు చేసి, పక్కింటి వైద్యుడు కరటయ్యను పిలిపించాడు. కరటయ్య పిల్లవాణ్ణి పరీక్షించి, ‘‘అనారోగ్యం ఏమీలేదు, ఏ పిశాచమన్నా పట్టుకున్నదేమో? లేక ఏ దయ్యాన్నో, భూతాన్నో చూసి దడుచుకున్నాడో? మఠంలోకి కొత్తగా వచ్చిన సాధువును చూద్దాం పదండి,'' అన్నాడు భూషయ్యతో.
 
ఇద్దరూ మఠానికి వెళ్ళారు. ఆ సమయూనికి దయ్యంపట్టినవాడొకడు సాధువు చుట్టూ గిరికీలు కొడుతున్నాడు. సాధువు వాణ్ణి తన చేతిబెత్తంతో తల మీద మూడు సార్లు తాటించాడు. వెంటనే దయ్యం దిగిపోయింది. భూషయ్యకు సాధువు మీద గురి కుదిరి, ఆయనకు తాను వచ్చినపని చెప్పాడు.
 
సాధువు అంతావిని కళ్ళుమూసుకుని తెరిచి, ‘‘నీ కొడుక్కు ఏ దయ్యమూ, భూతమూ పట్టలేదు. ఎవరో గిట్టనివాళ్ళు చేతబడి చేయించారు. మీ ఊళ్ళో ఎంత మంది మంత్రగాళ్ళున్నారు?'' అని అడిగాడు.
 
‘‘ఇద్దరే, స్వామీ! శరభయ్యా, సాంబయ్యా!'' అన్నాడు భూషయ్య.

‘‘వారిలో ఒకరు ఈ పని చేసి ఉండాలి. నీ కొడుక్కు చికిత్స చెయ్యమని ఇద్దర్నీ అడుగు. ఎవరు వైద్యం చెయ్యటానికి ఒప్పుకుంటే వాడి పేరు నాకు వచ్చి చెప్పు,'' అన్నాడు సాధువు.
 
భూషయ్యా, కరటయ్యా ఇంటికి తిరిగి వచ్చి, భూతవైద్యులిద్దరినీ పిలిపించారు. శరభయ్య విరూపుణ్ణి చూడగానే పెదవి విరిచి, ‘‘ఈ చికిత్స నా వల్ల కాదు, నాకంత శక్తి లేదు,'' అన్నాడు. అతను వెళ్ళాక సాంబయ్య, ‘‘నేను చికిత్స చేస్తాను. ఇది ఎవడి పనో, ఈ రాత్రి అంజనం వేసి నేను కనుక్కుంటాను.
 
శరభయ్య డబ్బుకు గడ్డి తింటాడు. ఈ పాడుపని వాడిదే అని నా అనుమానం. అందుకే తన వల్ల కాదని చెప్పి, చల్లగా జారుకున్నాడు. ఈ దెబ్బతో వాడి అంతు తేల్చుతాను,'' అన్నాడు. సాంబయ్యను పంపించి, భూషయ్య సాధువు వద్దకువెళ్ళి, చికిత్స చెయ్యటానికి సాంబయ్య ఒప్పుకోవటమే గాక, ఇది శరభయ్య పనే అని శంకిస్తున్నట్టు కూడా తెలిపాడు. సాధువు తల అడ్డంగాతిప్పి, ‘‘నువ్వూ శరభయ్యనే శంకిస్తున్నావు. కాని నా దివ్య దృష్టితో చూస్తే నీ కొడుక్కు చేతబడి చేసినది సాంబయ్యే అని తెలిసిపోతున్నది. ఈ రాత్రికి అంజనం వేసే సాకుతో నీ కొడుకు ప్రాణాలు తీసే ప్రయత్నం చెయ్యబోతాడు. నా మాట విని, నీ కొడుకును దక్కించుకో!'' అన్నాడు.
 
అందుకు ఏం చెయ్యాలో భూషయ్య సాధువు వల్ల తెలుసుకున్నాడు. ఆ రాత్రి భూషయ్యా, పక్కింటి వైద్యుడు కరటయ్యా, మరో ఇద్దరు మనుషులూ సాంబయ్య ఇంటి వైపువెళ్ళి, సమీపంలో మాటువేశారు.
 
అర్ధరాత్రి దాటాక సాంబయ్య నట్టింట ముగ్గులు వేసి, ముగ్గుల మధ్య చచ్చిన పామును తెచ్చి చుట్టగా చుట్టిపెట్టి, దాని మీద ఒక పుర్రెను ఉంచి, పుర్రె పైన ఒక నిమ్మకాయను నిలబెట్టాడు. తరవాత ఇల్లంతా కమ్ముకునేటట్టు ధూపంవేసి, తన వేలు, కోసుకుని, తన రక్తంతో పుర్రెకు బొట్లు పెట్టాడు. ఇది పూర్తి అయ్యాక సాంబయ్య ముగ్గు ముందు కూర్చోబోతూండగా, దాగి ఉన్న నలుగురు మనుషులూ లోపలికి జొరబడి, సాంబయ్యను కట్టేసి, చావబాది, సాధువు దగ్గిరికి లాక్కువెళ్ళారు.
 
చేసిన తప్పు ఒప్పుకోమని వాళ్ళు నిర్బంధించేసరికి సాంబయ్య, ‘‘మహా ప్రభో! దేవుడి తోడు, నే నేమీ చెయ్యలేదు.

ఈ పాపిష్ఠి ప్రయోగం ఎవరు చేశారో కూడా నాకు తెలీదు. అది తెలుసుకునేందుకే అంజనం వెయ్యబోతూండగా వీళ్ళు నన్ను చావగొట్టి లాక్కొచ్చారు,'' అని ఏడ్చాడు.
 
భూషయ్య మనుషులు సాంబయ్యను మళ్ళీ కొట్టబోతూండగా, ‘‘ఆగండి!'' అంటూ శరభయ్య విరూపుణ్ణి వెంటబెట్టుకుని అక్కడికి వచ్చి, ‘‘కొట్టవలసింది సాంబయ్యను కాదు, నిజంగా చేతబడి చేసి, సాధువు వేషంలో ఉన్న ఈ పొరుగూరి మంత్రగాణ్ణి! దుర్మార్గం చేసింది చాలక, అందులో నన్నూ, సాంబయ్యనూ ఇరికించాలని చూశాడు,'' అన్నాడు.
 
సాధువు మెల్లిగా జారుకోబోయాడు. కాని శరభయ్యా, విరూపుడూ వాణ్ణి పట్టుకుని, నాలుగు తగిలించారు. వాడు మొర్రోమంటూ, ‘‘అయ్యూ, బుద్ధి గడ్డితిని ఆ పాడుపని చేసింది నేనే గాని, నా చేత ఆ పని చేయించిన పెద్దమనిషి ఇక్కడే ఉన్నాడు,'' అని కరటయ్యను చూపించాడు. కరటయ్య మొహం నల్లగా అయింది. భూషయ్య అతని కేసి అసహ్యంగా చూస్తూ, ‘‘ఇదంతా చివరకు నీ పనా? ఎందుకు చేయించావీ ముదనష్టపు పని?'' అని అడిగాడు. ఆ ప్రశ్నకు విరూపుడు సమాధానం చెబుతూ ఇలా అన్నాడు:
 
‘‘కరటయ్య పిసినిగొట్టుతనం అందరికీ తెలిసినదే. తన ఒక్క కూతురినీ నా కియ్యూలనుకున్నాడు. పెళ్ళి అన్నాక చాలా ఖర్చు అవుతుంది. దమ్మిడీ ఖర్చు కాకుండా నన్ను అల్లుణ్ణి చేసుకోవటానికి ఈ సాధువు చేత ప్రయోగం చేయించాడు. నేను పిచ్చివాణ్ణి అంటే సంబంధాలు రావు. దమ్మిడీ ఖర్చుకాకుండా నాకూ, తన కూతురికీ పెళ్ళి చేసేసి, తరవాత నన్ను మామూలు మనిషి చేసుకుందామని కరటయ్య దురాశపడ్డాడు. నాకు మతిపోయింది చెట్టు మీద కనిపించిన దిష్టి బొమ్మను చూసి! శరభయ్య ధర్మమా అంటూ నేను మళ్ళీ మామూలుమనిషిని అయ్యూను.''
 
కరటయ్య తాను చేసిన పనికి సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ అవమానంతో అతనికి బుద్ధి వచ్చింది. తరవాత పెట్టవలసిన ఖర్చేదోపెట్టి కరటయ్య తన కూతుర్ని విరూపుడికే ఇచ్చి వైభవంగా పెళ్ళిచేశాడు.

No comments:

Post a Comment