Pages

Friday, September 7, 2012

బాధ ఒక్కటే!


గంగాధరం అనే కూరగా…యల వ్యాపారి దగ్గర, సత్యరాజనే యువకుడు కొత్తగా పనిలోచేరాడు. సత్యరాజు ఎంతోనిజాయితీగా, చురుగ్గా పనిచేస్తూ, అతితక్కువ కాలంలోనే యజమాని మెప్పుపొందాడు. అయితే, సత్యరాజుకు కాస్తకోపం ఎక్కువ. కూరగాయలు కొనడానికి వచ్చినవాళ్ళు ఎక్కువగా బేరమాడుతూ విసిగిస్తే, ‘‘వెళ్ళండి, వెళ్ళండి! మీరేంకొంటారు,'' అంటూ కసురుకునేవాడు.
 
ఇందుకు ముఖ్యకారణాల్లో ఒకటి, ఏ రకం కూరగాయలు ఏ ధరకు అమ్మాలో ముందుగానే నిర్ణయించివుండడం. అయినా, ఈ కసురుకోవడం కోప్పడడంలాంటివి మానుకోమని, గంగాధరం ఎంతగానో చెప్పిచూశాడు. కానీ, సత్యరాజు ఇవేమీ వినిపించుకోలేదు.
 
ఒకరోజు, ఆ ఊరిపెద్ద వీరభద్రయ్య ఇంట్లో పనిచేసే మనిషి మీద సత్యరాజు దురుసుగా మాట్లాడడంతో, వీరభద్రయ్య స్వయంగా వచ్చి గంగాధరాన్ని నానా మాటలూ అనిపోయాడు. ఇక ఊరుకుని లాభంలేదని గంగాధరం, సత్యరాజును పనిలోంచి తీసివేశాడు.
 
దిగాలుపడిపోయిన సత్యరాజు రెండురోజుల తర్వాత తిరిగి గంగాధరం వద్దకు వచ్చి, తనను పనిలోకి తీసుకోమని బతిమాలడం మొదలు పెట్టాడు. అయితే, గంగాధరం, అతడు చెప్పేది వినిపించుకోకుండా గొంతుపెద్దది చేసి, ‘‘ఏయ్, చెప్తూంటే మనిషివికాదూ వెళ్ళు, పో!'' అంటూ అరిచాడు.
 
గంగాధరం తనను కుక్కను అదిలించినట్లుగా కరకుగా మాట్లాడడంతో, సత్యరాజు మనసు కలుక్కుమన్నది. అతడు కళ్ళల్లోనీళ్ళు తిరుగుతూండగా తలదించుకుని వెనక్కు తిరిగాడు. వెంటనే గంగాధరం అతణ్ణి, ‘‘ఒరేయ్, ఇలారా!'' అంటూ పిలిచాడు.
 
సత్యరాజు వెనక్కువచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు గంగాధరం, ‘‘ఇప్పుడు నీకు అర్థమయిందా? ఒక మనిషితో మరొకమనిషి మర్యాదగా, గౌరవంగా మాట్లాడకుండా కసురుకుంటే, ఆ మనిషి ఎంతగా బాధపడతాడో!'' అన్నాడు సౌమ్యంగా.
 
నిజంగానే సత్యరాజుకు ఆ బాధ అనుభవంలోకివచ్చింది. అతడు వినయంగా చేతులుజోడిస్తూ, ‘‘ఆబాధ ఎలావుంటుందో తెలిసివచ్చింది, బాబూ!'' అన్నాడు.
 
‘‘ఇప్పుడు నేను, నిన్ను నమ్మగలను. వెంటనే పనిలో చేరు,'' అన్నాడు గంగాధరం శాంతంగా. 

No comments:

Post a Comment