Pages

Friday, September 7, 2012

ఉత్తమ రాజలక్షణం!


సువర్ణపురి రాజు సుబలదేవుడు పరాక్రమశాలి; రాజ్య కాంక్షాపరుడు. పొరుగున ఉన్న వ్రతశిలా రాజ్యంతో సువర్ణపురికి తరతరాలుగా పగ కొనసాగుతున్నది. ప్రస్తుత వ్రతశిలా రాజు సుధర్ముడు శాంతి ప్రియుడు. అయితే, మునుముందు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగగలదనే నమ్మకం సుబలదేవుడికి లేదు.
 
ఇప్పుడు తనవద్ద శక్తివంతమైన సేనలు ఉన్నాయి గనక, పొరుగురాజ్యంపై దండెత్తి వెళ్ళి శత్రుశేషం లేకుండా చే…యాలని ఆలోచించసాగాడు. ఇది సుబలదేవుడి రాణికి ఏమాత్రం నచ్చలేదు. ‘‘ప్రభూ! శాంతి వర్థిల్లుతున్నప్పుడు మనంగా దండెత్తి వెళ్ళడం భావ్యమవుతుందా? పైగా, వ్రతశిలారాజు ఇప్పుడు అనారోగ్యంతో బాధ పడుతున్నట్టూ, ఆ…యన మనమీద దాడి చేసే అవకాశం లవలేశం లేదనీ మన చారుల ద్వారా తెలియవచ్చింది కదా. మైత్రి పెంపొందించుకోవలసిన సమయంలో కయ్యానికి కాలుదువ్వడం సబబేనా? ప్రభువులు మరొక్కసారి ఆలోచించండి,'' అని తన అభ్యంతరాన్ని సున్నితంగా తెలియజేసింది.
 
రాణిగారి అభిప్రాయంతో ఏకీభవించిన మహామంత్రి, ‘‘అవును ప్రభూ. మునుపటి రాజు శత్రుభావంతో మనమీద కత్తికట్టిన మాట వాస్తవమే. అయితే, ప్రస్తుత పరిస్థితి దానికి పూర్తిగా భిన్నం. ఈనాటి రాజు సత్వ సంపన్నుడు; శాంతి ప్రియుడు. పైగా యుద్ధ ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించలేము. రాజు వ్యాధిగ్రస్తుడైవున్న మాట నిజమే. అయితే, ప్రజలు ఆయన పట్ల అపార గౌరవాభిమానాలు ప్రదర్శిస్తున్నారు. ఇంకా పసివాడైన యువరాజు సుశాంతుడంటే దేశ ప్రజలకు పంచప్రాణాలు. కాబట్టి ఒక వేళ మనం వాళ్ళ సేనలను ఓడించినప్పటికీ ప్రజలు తిరుగుబాటుచేయ గలరు.

అప్పుడు రాజ్యంలో శాంతి కరువవుతుంది,'' అన్నాడు. ‘‘ఇప్పటి రాజు మరణించాక, అంతగా ప్రజాభిమానం చూరగొన్నయువరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తే, మునుముందు మనమీదికి దండెత్తి రాడన్న నమ్మకం ఏమిటి? మనం బలంగా వున్నప్పుడే శత్రుశేషం లేకుండా చేయడం క్షాత్రధర్మం. ఇక ప్రజల తిరుగుబాటు అంటారా? ఉక్కుపాదంతో అణచివేద్దాం. అంతే!'' అన్నాడు రాజు.
 
ఆ తరవాత సువర్ణపురి సైన్యం, వ్రతశిలా రాజ్యం మీదికి దండెత్తి వెళ్ళింది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ వ్రతశిలారాజ్య రాజు సుధర్ముడు, స్వయంగా సైన్యాన్ని నడుపుతూ శత్రుసేనలను ఎదుర్కొన్నాడు.
 
సుబలదేవుణ్ణి తీవ్రంగా గాయపరచి, అతడితో పోరాడుతూ వీరమరణం పొందాడు. సుబలదేవుడు వాంఛించిన విధంగానే యుద్ధంలో విజ…యం సాధించాడు. సువర్ణపురితో వ్రతశిలా రాజ్యాన్ని కలుపుకున్నాడు. అయినా, తాను సాధించిన విజయం ఆయనకు ఆనందం కలిగించలేదు. యుద్ధంలో సుధర్ముడి ద్వారా కలిగిన గాయం ఎన్నివైద్యాలు చేసినా మానలేదు. దాంతో ఒకసంవత్సరం బాధపడి మరణించాడు. సుబలదేవుడికి ఉన్నది ఒక్కగానొక్కకుమార్తె. మగ సంతానం లేదు. సద్గుణ సంపన్నుడైన ఒక యువకుణ్ణి దత్తత తీసుకోవాలని మహారాణి ఆశించింది. అలాంటి…యువకుడి కోసం, మంత్రి ఆయన పరివారం, అన్వేషణ ప్రారంభించారు.
 
ఒకవారం గడిచింది. సుప్రసిద్ధ గురువు హేమచంద్రులు నడుపుతూన్న గురుకులాశ్రమానికి వెళ్ళి, అక్కడ విద్యనభ్యసిస్తూన్న యువకులను చూడడానికి మంత్రి, ఇద్దరు అనుచరులతో బయలుదేరాడు. ముగ్గురూ బాటసారుల్లా మారువేషాలు ధరించారు. వాళ్ళు గురుకులాశ్రమాన్ని సమీపించే సరికి సూర్యుడు పడమటి దిశకు చేరుకున్నాడు. బంగారం లాంటి లేతపసువు ఎండలో విద్యార్థులు ఆడుకుంటున్నారు. దాపులనున్న చిన్న గుట్ట మీదికి ఎక్కి మంత్రీ, ఆయన అనుచరులూ ఆడుకుంటూన్న విద్యార్థులను జాగ్రత్తగా పరిశీలించసాగారు.
 
ఆ విద్యార్థుల బృందంలో ఒకడు చూడడానికి చాలా ముచ్చటగా ఎంతో హుందాగా ఉన్నాడు. సహవిద్యార్థులు అతడి పట్ల ప్రేమాభిమానాలు కనబరుస్తున్నారు. వాళ్ళందరూ ఆడుకుంటూండగా, హఠాత్తుగా ఎక్కడినుంచో ఒకరాయి రివ్వునవచ్చి, అతడి నుదుటికి తగిలింది. బొటబొటా రక్తం కారసాగింది. వెంటనే కొందరువెళ్ళి ఏవో ఆకులు కోసుకువచ్చి, వాటి పసరును గాయంపై పిండి కట్టుగట్టారు. మరి కొందరు మిత్రులు, ఆ రాయి వచ్చిన దిశగా వెళ్ళి, పొదకు ఆవలినుంచి దాన్ని విసిరినవాణ్ణి పట్టుకు వచ్చి తమ మిత్రుడి ఎదుట నిలబెట్టారు.
 
‘‘ఇతన్ని తప్పక శిక్షంచాలి,'' అన్నాడు ఒక విద్యార్థి.

‘‘అవును. మనమూ రాళ్ళు విసిరి, అతని తలను గాయపరచాలి,'' అన్నాడు మరొక విద్యార్థి ఆవేశంగా.
 
అయితే, గాయపడిన వాళ్ళ నాయకుడు మాత్రం, అతనికేసి ప్రశాంతంగా చూస్తూ, ‘‘నువ్వు రాయిని ఎందుకు విసిరావు?'' అని అడిగాడు.
 
‘‘మరీ ఆకలి వేసింది. ఆ చెట్టుకొమ్మలో మాగిన జామపండు ఒకటి కనిపించింది. దానిని కొట్టడానికి రాయి విసిరాను,'' అన్నాడు వచ్చిన మనిషి.
 
‘‘జామపండు పడిందా?'' అని అడిగాడా విద్యార్థి నాయకుడు.
 
‘‘పడింది. దాన్ని అప్పుడే తినేశాను,'' అన్నాడా మనిషి.
 
‘‘ఆకలి తీరిందనుకుంటాను, అవునా,'' అని అడిగాడు విద్యార్థి.
 
ఆ పెద్దమనిషి కాస్సేపు అటూ ఇటూ చూసి, ‘‘ఎలా తీరుతుంది? ఎలాగైనా అడవికి దాపుల నున్న గ్రామాన్ని చేరుకుని గుడిప్రసాదం తిని ఆకలి తీర్చుకుంటాను. ఆ జామపండే గనక తినలేదనుకుంటే మాత్రం, ఇక్కడే శోషవచ్చి పడి పోయేవాణ్ణి,'' అన్నాడు.
 
‘‘మాతో రా, మా గురుకులాశ్రమంలో భోజనం పెడతాం. చీకటి పడుతోంది. అడివి మార్గంలో ఇప్పుడు ఒంటరిగా వెళ్ళడం క్షేమంకాదు. తెల్లవారాక వెళ్ళవచ్చు,'' అంటూ ఆ విద్యార్థి నాయకుడు ఆపెద్ద మనిషిని వెంట పెట్టుకుని గురుకులం వైపు నడవసాగాడు.
 
‘‘ఏమిటి మిత్రమా! నీ తలను గాయపరచిన వాడికి సాయపడడమా?'' అన్నాడు ఒక మిత్రుడు.
 
‘‘అవును మిత్రమా. అతడు చెట్టు మీదికి రాయి విసిరినప్పుడు చెట్టు ఏం చేసింది? తన ఫలాన్ని ఇచ్చింది కదా! ఒక చెట్టే అలా చేయగలిగినప్పుడు, మనిషినైన నేను అంతకన్నా మంచి పని చేయాలి కదా? చెట్టు పండునిచ్చింది. నేను భోజనం పెట్టి తీరాలి!'' అన్నాడు వాళ్ళ నాయకుడు మందహాసం చేస్తూ.
 
‘‘అద్భుతం! ఇదీ ఉత్తమమైన రాజలక్షణం! ఆ …యువకుడు ఎవరై ఉంటాడు?'' అని అడిగాడు వాళ్ళ సంభాషణ విన్న మంత్రి తన అనుచరులను. ఆ తరవాత మంత్రి గురుకులాశ్రమానికి వెళ్ళి గురువుకు తానెవరైనదీ చెప్పి ఆ యువకుడి వివరాలడిగాడు. అతడు వ్రతశిలా రాజ కుమారుడు సుశాంతుడని గురువు తెలియజేశాడు.
 
ఆ తరవాత మంత్రి, మహారాణి కోరిక ప్రకారం, వ్రతశిలా రాణిని దర్శించి సంగతి చెప్పాడు. ఇద్దరు రాణులూ కలుసుకున్నారు. సువర్ణపురి…యువరాణి సువర్చలాదేవిని వ్రతశిలా రాజకుమారుడు సుశాంతుడికిచ్చి ఘనంగా వివాహం జరిపారు. ఉభయ రాజ్యాలకూ రాజై, సుశాంతుడు ప్రజారంజకంగా చిరకాలం రాజ్యపాలన చేసి ఆదర్శ ప్రభువుగా కీర్తిగాంచాడు.

No comments:

Post a Comment