Pages

Friday, September 7, 2012

సుందరం కోరిక


రామాపురం రామాలయంలో అర్చకుడుగా పనిచేస్తున్నాడు రంగనాధం. అతడి భార్య జానకి. వాళ్ళకు పెళ్ళయిన పదేళ్ళకు కొడుకు పుట్టాడు. వాడికి సుందరం అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు.
 
సుందరానికి బాల్యం నుంచి తగని తిండి పిచ్చి. గుడినైవేద్యం-చక్రపొంగలి, పులిహోర, దద్ధోజనం లాంటివి, సగంపైగా తనే చెల్లువేసేవాడు. దానితో శరీరంతో పాటు బద్ధకం కూడా పెరిగి, ఏ పనీ చేసేవాడు కాదు. వాడికి గుడిలో పూజాది కార్యాలకు అవసరం అయిన మంత్రాలు నేర్పాలని, రంగనాధం ఎంతగానో ప్రయత్నించాడు. కాని, సుందరానికి నోరు తిరిగేది కాదు. క్రమంగా వాడు ఇరవై ఏళ్ళవాడయినా, శరీరమయితే లావెక్కిందిగాని, దానికి తగ్గ ధైర్యం వాడిలో కరువయింది. తన నీడను చూసి తనే భయపడేంత పరమ భయస్థుడుగా తయారయ్యాడు. ‘‘ఒరే, సుందరం! ఇలా అయితే, నా తర్వాత నువ్వు ఆలయ పూజారివి కాలేవు. నీ బతుకెలా సాగేను?'' అని వాపోయేవాడు రంగనాధం.
 
అలాంటి సమయాల్లో సుందరం, ‘‘నాన్నా, మన ఊళ్ళో మిఠాయి దుకాణం లేదు. మన ఇంటి వీధి అరుగు మీద అద్దాల మిఠాయి కొట్టు పెట్టించు. అందులో హాయిగా కాలు మీద కాలు వేసుకుని వ్యాపారం నడుపుతూ వందలు సంపాయించగలను,'' అనేవాడు.
 
ఒకసారి వాడు ఇలా అన్నప్పుడు, రంగనాధం చిరాకు పడుతూ, ‘‘ఒరే, నువ్వనే ఆ దిక్కుమాలిన మిఠాయి దుకాణానికి పెట్టుబడి కావాలి. నీ చిన్న మేనత్త పెళ్ళి బాధ్యత, నా నెత్తినవుంది. నా మాట విని ఇప్పటికైనా, మనసు పెట్టి నాలుగు మంత్రాలు నేర్చుకో. ఆ కోదండ రాముడే నీకింత కూడు పెడతాడు,'' అన్నాడు.
 
‘‘ ఆ మంత్రాలు వల్లెవేయడం, ఈ జన్మలో నాకు సాధ్యం కాదు. నేను పుట్టు భయస్థుణ్ణని, నువ్వు నేర్పచూసిన, హను మాన్‌ చాలీసా కంఠస్థం చేయడానికే, నాకు పదేళ్ళు పట్టింది,'' అన్నాడు సుందరం.

ఇలాంటి పరిస్థితుల్లో, రంగనాధం చెల్లెలి పెళ్ళి కుదిరింది. రంగనాధం పట్నం వెళ్ళి, చెల్లెలి పెళ్ళి కోసం పది చీరలు కొన్నాడు. అతడు చీరల మూటతో దుకాణం నుంచి బయటకు రాగానే, దారిన పోతున్న బంధువొకాయన రంగనాధానికి తమ దూరపు చుట్టపు చావుకబురు చెప్పాడు.
 
వెంటనే రంగనాధం చీరల మూటను దుకాణం యజమానికిచ్చి, ‘‘ఇప్పుడే బంధువొకాయన కాలం చేసిన కబురువిన్నాను. ఆయన కుటుంబాన్ని పరామర్శించి రావాలి. చీరల మూట తర్వాత తీసుకెళతాను,'' అని చెప్పి దాపులనున్న బంధువుల గ్రామానికి బయల్దేరాడు. అక్కడ శవయాత్రలో పాల్గొని, చీకటి పడుతూండగా ఇంటికి తిరిగి వచ్చిన రంగనాధానికి జ్వరం ముంచుకు వచ్చింది. అది మర్నాటికి కూడా తగ్గకపోయే సరికి ఆయన సుందరాన్ని పిలిచి సంగతి చెప్పి, ‘‘ఆ బట్టల మూట తీసుకుని చీకటి పడుకుండా ఇల్లు చేరు. దారిలో దొంగల భయం, జాగ్రత్త!'' అని హెచ్చరించి, బాడుగ బండి ఖర్చుకు వాడికి పాతిక రూపాయలిచ్చాడు.
 
సుందరం సాయంకాలానికల్లా పట్నం చేరి, బట్టల దుకాణం దగ్గరకు వెళ్ళాడు. దుకాణం యజమానివాణ్ణి చూస్తూనే చిన్నగా నవ్వి, ‘‘మీ నాన్న కొన్న చీరలమూట కోసం వచ్చావా?'' అంటూ మూటను సుందరానికిస్తూ, ‘‘అన్నీ ఖరీదైన చీరలు జాగ్రత్తగా తీసుకుపో,'' అంటూ హెచ్చరించాడు. సుందరం మూట తలమీద పెట్టుకుని బయల్దేరాడు. వాడికి వీధిలో ఒక పెద్ద మిఠాయి దుకాణం కనిపించడంతో వాడు, ‘‘బాడుగ బండివాడికి, ఏ ఇరవయ్యో, పాతికో డబ్బివ్వడం పరమ దండగ. ఆ డబ్బుతో రకరకాల మిఠాయిలు కొనుక్కుని తింటూ హాయిగా ఇల్లు చేరొచ్చు,'' అనుకున్నాడు. అనుకున్నట్టే వాడు మిఠాయిలు కొని తింటూ నడక సాగించాడు. కనుచీకటి వేళ వాడు అడవి దారి చేరేసరికి, గుబురు చింత చెట్లకింద కూర్చుని కబుర్లాడుకుంటున్న ఐదు ఆడదయ్యూలు చప్పున మానవ రూపాలు ధరించి, చప్పట్లు వేసి సుందరాన్ని పిలిచాయి.
 
సుందరం భయపడిపోతూ అటుకేసి చూసి, ‘‘దొంగలనుకున్నాను, కాదు. దొంగలంటే మగవాళ్ళేకదా? వీళ్ళు ఆడవాళ్లు,'' అనుకునేంతలో, దయ్యూలు అతణ్ణి సమీపించి, ‘‘మేం బంధువులింటి పెళ్ళికి పోతూ దారితప్పాం.

ఆ తల మీద మూట ఏమిటి?'' అని అడిగాయి. ‘‘ఇవి మా చినమేనత్త పెళ్ళి చీరలు,'' అన్నాడు సుందరం ధీమాగా.
 
‘‘అలాగా! చీరలు ఎంత అందంగా వున్నవో ఒకసారి చూడనీ,'' అంటూ దయ్యాలు, మూటను పట్టుకుని కిందికి దించాయి.
 
సుందరం చప్పున వంగి అందుబాటులో వున్న ఒక ఎండుకట్టెను తీసుకుని, ‘‘చూస్తూంటే మీరు ఆడదారి దొంగల్లావున్నారు, జాగ్రత్త!'' అంటూ కట్టెను పైకెత్తాడు.
 
అంతలో ఒక దయ్యం వాడికి చిన్న సంచీనిఇస్తూ, ‘‘ఇందులో నూటపదహారు బంగారు కాసులున్నాయి. పెళ్ళి చదివింపులకని తీసుకుపోతున్నాం. ఎలాగూ ముహూర్తానికి అక్కడికి చేరలేంగనక, వాటిని నువ్వే వుంచుకో. చీరలు ఎంచక్కావున్నవో ఒకసారి చూడనీ,'' అన్నది.
 
బంగారు కాసులనగానే సుందరం కళ్ళు మెరిశాయి. వాడు చప్పున నేల మీద కూర్చుని వాటిని లెక్కపెట్టసాగాడు. రెండు మూడు నిమిషాలు జరిగే సరికి, వాడికి దయ్యాల వింత నవ్వులు వినిపించాయి. వాడు తల ఎత్తి చూశాడు. దయ్యాలు మూట విప్పి చీరలను అటూ ఇటూ తిప్పి చూస్తూ, సింగారించుకోబోతున్నాయి.
 
సుందరానికి అప్పుడు ఒక అనుమానం వచ్చి, ఎక్కడలేని భయం కలిగింది. ఒక వేళ ఇవి దయ్యాలేమో అనుకుంటూవాడు పెద్దగా గొంతెత్తి, హనుమాన్‌ చాలీసా చదవడం ప్రారంభించాడు. అంతే! మరుక్షణం దయ్యాలు చీరలను అక్కడే వదిలి, కీచుకీచుమంటూ చింతచెట్ల మీదికి ఎగిరిపోయినై.
 
సుందరం నిబ్బరంగా హనుమాన్‌ చాలీసా చదువుతూనే చీరలన్నీ తిరిగి మూటగట్టి, దయ్యాలిచ్చిన బంగారు కాసులతో తెలతెలవారుతూండగా ఇంటికి తిరిగి వచ్చాడు.
 
ఈ విధంగా-పిశాచాల పుణ్యాన, సుందరం అత్త పెళ్ళి అనుకున్న దానికన్నా ఘనంగా జరిగిపోయింది. అంతేకాదు; రంగనాధం ఇంటి అరుగు మీద సుందరంకోసం అద్దాలతో అందమైన మిఠాయి దుకాణం కూడా వెలిసి వాడి కోరిక తీరింది.

No comments:

Post a Comment