Pages

Saturday, September 8, 2012

రాకుమారి లవంగలత


తూర్పు సముద్రంలో ఉన్న స్వర్ణద్వీపపు రాజు ధీమాన్‌ కుమార్తె లవంగలత చాలా చక్కనిదే గాక నృత్యమూ, సంగీతమూ, చిత్రలేఖనమూ, ఇంద్రజాలమూ మొదలైన అనేక విద్యలలో ప్రవీణురాలు కూడానూ. ఆమెకు యుక్తవయసు వచ్చేసరికి ఆమె వివాహం ధీమాన్‌కు పెద్ద సమస్య అయి కూర్చున్నది.
 
ఆయన లవంగలతకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. దానికి అనేక దేశాల నుంచి రాజులూ, రాజకుమారులూ వచ్చారు గాని, లవంగలత వారిలో ఎవరినీ వరించలేదు. అది చూసి ధీమాన్‌ ఆశ్చర్యపడి, ‘‘ఇంతమందిలోనూ నీకు ఒక్కడూ నచ్చలేదా?'' అన్నాడు.
 
ఆమె సిగ్గుపడుతూ, ‘‘రత్నద్వీప రాజు శశాంకుడు చాలా అందగాడనీ, తెలివిగలవాడనీ, ధీరుడనీ చెబుతారు. నాకు అతనే తగిన భర్త అని భావిస్తున్నాను,'' అన్నది.
 
‘‘ఈ సంగతి ముందే చెప్పావు కావేం?'' అని రాజు తన మంత్రితో సంప్రతించాడు.
 
‘‘స్వర్ణద్వీపం నుంచి రత్నద్వీపానికి సముద్రం మీద వెళ్ళి రావటానికి మూడు నెలలు పట్టుతుంది. పెళ్ళి గురించి శశాంకుడి అభిప్రాయం తెలుసుకునేటందుకు మనం ఒక దూతను పంపుదాం. అతని వెంట లవంగలత చిత్తరువూ, టపా పావురాలూ పంపితే, శశాంకుడి అభిప్రాయం మనకు త్వరగా తెలుస్తుంది,'' అని మంత్రి సలహా ఇచ్చాడు.
 
మంత్రి చెప్పినట్టుగానే ధీమాన్‌ తరఫున ఒక మనిషి తగిన కానుకలతో సహా రత్నద్వీపానికి బయలుదేరి వెళ్ళాడు. అతను బయలుదేరిన యాభై రోజులకు పావురాలు వార్త తెచ్చాయి. ఆ వార్త ఏమంటే, శశాంకుడు రాచకార్యాలలో మునిగి తేలుతూ ఉండటంచేత అతను స్వర్ణద్వీపానికి రావటం సాధ్యంకాదు; అందుచేత, లవంగలతే రత్నద్వీపం వచ్చే పక్షంలో నిర్ణయం జరగవచ్చు.
 
వధువును పెళ్ళిచూపులకు పంపటం సంప్రదాయ విరుద్ధమే అయినప్పటికీ,  ధీమాన్‌ తన కుమార్తె కోసం అలా చెయ్యటానికి సిద్ధపడ్డాడు.

రాజవంశంలో అంత నల్లని మనుషులు పుట్టుతారంటే అతను నమ్మలేకపోయాడు. ఆమె ఎవరో మోసగత్తే అనుకుని ఆమెను అతను తిప్పి పంపేశాడు. లవంగలత నిస్పృహతో రజకస్త్రీ ఇంటికి తిరిగి వచ్చింది.
 
రజకస్త్రీ ఆమెకు ధైర్యం చెప్పింది. ఆ రజకస్త్రీకి మాలలుకట్టే మనిషి ఒకతె తెలుసు. ఆమె వద్ద జుట్టును శీఘ్రంగా పెంచే తైలం ఉన్నది. పదిహేను రోజులలో లవంగలత ఒంటి నలుపును పోగొట్టి, జుట్టు కూడా పెంచవచ్చు.
 
రాజభవనానికి మాలలు కట్టి పంపే సురమ అనే ఆ మనిషి లవంగలతకు పదిహేను రోజులపాటు పోషణచేసి, మామూలు మనిషిని చేసింది. కాని ఆమెను శశాంకుడి వద్దకు చేర్చేదెలా? అందుకు ఒక మార్గం లవంగలతే అవలంబించింది. ఆమెకు మాలలు కట్టడంలో నేర్పు ఉన్నది.
 
ఆమె శశాంకుడి కోసం ఒక మాల ప్రత్యేకంగా తయారు చేసి, సురమ ద్వారా పంపింది. దాన్ని చూసి శశాంకుడు ఆశ్చర్యపోయి, ‘‘ఇన్నేళ్ళూ నువ్వు ఏనాడూ ఇంత అందమైన మాల కట్టలేదు,'' అన్నాడు.
 
‘‘ఇది నేను కట్టినది కాదు. ఒక వ్యక్తి ప్రత్యేకంగా తమ కోసం కట్టినది,'' అన్నది సురమ.
 
నాలుగు రోజులపాటు లవంగలత రకరకాల మాలుల కట్టి శశాంకుడి వద్దకు పంపింది.
 
‘‘ఈ మాలలు కట్టే మనిషిని నా వద్దకు పంపగలవా? ఎలా కట్టేదీ చూడాలని ఉన్నది,'' అన్నాడు శశాంకుడు.
 
‘‘మహారాజా, మీకు ఆశాభంగం తప్పదు. ఆమె ఒక పళ్ళెంలో పూలు తీసుకుని, మీ పేరు చెప్పి, వాటి మీద ఊది, ఆ పూలను ఒక పాత్రలో పోసి, అందులో నుంచి మాలను పైకి తీస్తుంది. అలా తయారుచేసిన మాలలు కేవలమూ మీకేనట,'' అన్నది సురమ.
 
‘‘చిత్రం! చాలా చిత్రం! ఆమెను ఒక సారి చూసి తీరాలి. ఆమెను ఒకరోజు తీసుకురాలేవా?'' అన్నాడు శశాంకుడు. సురమ ఇంటికి వెళ్ళి లవంగలతతో,
 
‘‘పాచిక పారింది,'' అని చెప్పింది. లవంగలత కొన్ని జాజిపూలు తీసుకుని, అందులో సగంపూలతో సాధారణమైన దండ కట్టి, మిగిలినవి ఒక పళ్ళెంలో ఉంచింది.
 
తరవాత ఆమె తాను గుచ్చిన దండ ఎడమ అరచేతిలో ఉంచి, దాని మీద, దండ కనిపించకుండా, పూల పళ్ళెం పెట్టుకుని, రాజభవనానికి బయలు దేరింది.

తాను పల్లకీలో రాజభవనానికి వెళ్ళినప్పుడు ధరించిన దుస్తులే ఇప్పుడూ ధరించింది.
 
ఈసారి లవంగలత కేసి శశాంకుడు మెచ్చుకుంటున్నట్టు చూశాడు. ఆమె రాజ ఠీవిని కనబరుస్తూ అతన్ని పరామర్శ చేసింది. ‘‘మాలలు ఎలా తయారు చేస్తావో చూపించు,'' అన్నాడు శశాంకుడు.
 
‘‘మాలలు సృష్టించే శక్తి నాలో లేదు. నా కోసం దేవుడే మాలలను తయారు చేస్తాడు. అది కూడా నేను అమితంగా ప్రేమించే మనిషి కొరకు కోరితేనే!'' అన్నది లవంగలత.
 
‘‘నా కోసం ఒక మాల తయారు చేయలేవా?'' అని శశాంకుడి మంత్రి అడిగాడు.
 
‘‘క్షమించాలి, అది సాధ్యం కాదు. దేవుడికి నా మనసు తెలుసు. ఆయన నేను అధికంగా ప్రేమించే మనిషి కోసం తప్ప మాల సృష్టించడు,'' అన్నది లవంగలత.
 
‘‘అంటే, నన్ను అధికంగా ప్రేమిస్తున్నానంటావా?'' అన్నాడు శశాంకుడు.
 
‘‘అది దైవనిర్ణయం, తప్పుతుందా?'' అన్నది లవంగలత.
 
‘‘సరే, దైవనిర్ణయాన్ని రుజువు చెయ్యి,'' అన్నాడు శశాంకుడు.
 
లవంగలత తన ఎడమచేతిలో ఉన్న పూలపళ్ళెం అతనికి చూపింది. అందులో గుచ్చని జాజిపూలు మాత్రమే ఉండటం అతను చూశాడు.
 
లవంగలత శశాంకుణ్ణి అడిగి ఒక పెద్ద వెండిపాత్ర తెప్పించి, పళ్ళెంలో ఉన్న విడిపూలు అందులో పోస్తూ, పళ్ళెం అడుగున రహస్యంగా దాచిన మాల కూడా అందులోకి జారవిడిచింది.
 
తరవాత పాత్రలో విడిపూలతో బాటు దండ కూడా కనిపించింది. లవంగలత ఆ దండను పైకి తీసి, చప్పున శశాంకుడి మెడలో వేసింది. శశాంకుడు ఆమెను చూసి, ‘‘చిత్తరువులో కన్న ఎంత అందంగా ఉన్నది!'' అనుకున్నాడు.
 
‘‘ఆ మిగిలిన పూల గతి ఏమిటి?'' అని అతను అడిగాడు.
 
‘‘ఒక్క క్షణం ఆగితే నేను వాటిని దండగా గుచ్చుతాను,'' అన్నది సురమ.
 
ఆమె గుచ్చిన దండను శశాంకుడు లవంగలత మెడలో వేశాడు!

No comments:

Post a Comment