Pages

Thursday, September 6, 2012

లంచగొండి 2


ఒకానొక జమీందారు దగ్గర శ్రీకాంతుడనే దివానువుండేవాడు. ఆయనకింద పన్నులూ అవీ వసూలు చేసేందుకు కొందరు ఉద్యోగులుండేవారు. వాళ్ళల్లో శోభనాద్రి అనేవాడు పెద్ద లంచగొండి అని దివానుకు తెలిసింది. ఆయన, అతణ్ణి పిలిచి విచారించాడు. కాని, శోభనాద్రి తను నిర్దోషిననీ, గిట్టనివాళ్ళు తనపై నిందలు మోపుతున్నారనీ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. అయితే, దివానుకు వాస్తవమేమిటో తెలుసు! ఆయన, శోభనాద్రిని గట్టిగా హెచ్చరించి, చాలా దూర గ్రామానికి బదిలీ చేశాడు.

అక్కడా శోభనాద్రి చిన్న చిన్న రైతుల నుంచీ, వ్యాపారుల నుంచీ లంచాలువసూలు చేయసాగాడు. ఆ పరిస్థితిలో గ్రామస్థుల్లో ఒకడికి, తన తమ్ముడి పొలం పట్టా మంజూరు చేయించుకునే సమస్య ఎదురైంది.  అతడు, ఒకనాటి ఉదయం శోభనాద్రి కచేరీ గదిలోకి వెళ్ళి, అక్కడ బల్ల మీద ఒక బంగారు నాణెంపెట్టాడు. తర్వాత, శోభనాద్రి కచేరీకి వస్తూండగా కలుసుకుని, తన తమ్ముడి సమస్య చెప్పి, ‘‘వాడిప్పటివరకూ కచేరీలో కూర్చుని, అవసరమైన పని మీద ఇంటికి వెళ్ళాడు,’’ అన్నాడు. శోభనాద్రి కచేరీ గదిలోకి పోతూనే, బల్లమీదవున్న బంగారు నాణాన్ని తీసి జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత వారం జరిగినా, పట్టా మంజూరు జరగక పోవడంతో, గ్రామస్థుడు, శోభనాద్రిని కలుసుకుని, ‘‘ఆ పట్టా మంజూరు విషయం అట్లాగే వుండి పోయింది,’’ అన్నాడు. దానికి శోభనాద్రి చిరుకోపంగా, ‘‘మీ తమ్ముడికి ఆ విషయం పట్టినట్లేలేదు. వారం కిందట వచ్చి పోయినట్లు, తరచూవచ్చి పోతూండాలిగదా!’’ అన్నాడు.
‘‘వాడు దివాను దగ్గర కొలువులో చేరడం వల్ల రాలేదు. పట్టా మంజూరుకు ఏంకావాలో, ఎంతకావాలో కనుక్కోమన్నాడు,’’ అన్నాడు గ్రామస్థుడు.

ఆ మాటతో గతుక్కుమన్న శోభనాద్రి, ‘‘మీ తమ్ముడి పట్టా ఎప్పుడో సిద్ధమయింది. తీసుకెళ్ళు,’’ అంటూ అప్పటికప్పుడే పత్రాలను తీసి ఇచ్చాడు.

No comments:

Post a Comment