Pages

Thursday, September 6, 2012

విదురయ్య కోడళ్ళు

ఊబలంక అనే గ్రామంలో విదురయ్య, ధర్మయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు. ఇద్దరూ మధ్యతరగతి వ్యవసాయదారులు. విదురయ్యకు గోపన్న, సోమన్న అని ఇద్దరు కొడుకులు. ధర్మయ్యకు పిల్లలు లేరు.

ధర్మయ్య ఒక రోజున విదురయ్యతో, ‘‘విదురయ్యా! నువ్వు గమనించావో లేదో, మనిద్దరం యాభైయవ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాము. నీ కొడుకులిద్దరూ ప్రయోజకులయ్యారు. పెళ్ళిళ్ళు చేసేశావంటే, మనవలూ, మనవరాళ్ళూ పుట్టుకొస్తారు. నీ వార్థక్య జీవితంలో సుఖంగా  వుంటావు. నేనూ, నా భార్యా పిల్లాజెల్లాలేని ఒంటరివాళ్ళం. ఏ పిల్లవాడినైనా పెంపుడు తెచ్చుకుందామని ప్రయత్నిస్తే, వాళ్ళ తల్లిదండ్రులు ముందు నా ఆస్తిపాస్తుల గురించిన ఆరాలు అడుగుతున్నారు, ’’ అన్నాడు బాధగా.

విదురయ్య, ధర్మయ్య భుజం మీద చేయివేసి, ‘‘మనిషికి తప్ప ఏ ఇతర ప్రాణిలోనూ ముసలితనంలో ఆదుకునేందుకు వారసులంటూ వుండరు. ఇప్పటి వరకూ నేనూ, నా భార్యా సుఖంగానే వున్నాం. కోడళ్ళు వచ్చాక ఏమౌతుందో చెప్పలేం. ఒక సంగతి గుర్తుపెట్టుకో, ఏది ఎలా జరిగినా మనం అన్నదమ్ముల్లా కలిసివుందాం,’’ అన్నాడు. ‘‘ఏదో మాటవరసకన్నాను. నీ కొడుకులు బంగారంలాంటి వాళ్ళు. వాళ్ళకు అంత బుద్ధిమంతులైన భార్యలు వస్తారని, నా నమ్మకం,’’ అన్నాడు ధర్మయ్య.

గోపన్న, సోమన్న చెవులలో తండ్రీ, ఆయన స్నేహితుడు ధర్మయ్యా మాట్లాడుకున్న మాటలు పడ్డాయి. వాళ్ళిద్దరూ కూడ బలుక్కుని, వాళ్ళున్న చోటుకు వచ్చారు. గోపన్న, ధర్మయ్యతో, ‘‘బాబాయ్! నేనూ, తమ్ముడూ, మిమ్మల్ని ఎప్పుడూ మానాన్నకు తమ్ముడుగా భావించి, చిన్నాన్నగా అభిమానం పెంచుకున్నాం. మమ్మల్ని మీ కొడుకులుగా భావించండి,’’ అన్నాడు


ధర్మయ్య ఆనందబాష్పాలు రాలుస్తూ, ‘‘మీ ఇద్దరి గుణం నాకు తెలుసు. మీ నాన్నకు మంచికోడళ్ళు దొరికితే, నేనూ, మీ పిన్నీ మీ నీడలో హాయిగా బ్రతికేస్తాం!’’ అన్నాడు.
సోమన్న తృప్తిగా తలాడించి, ‘‘కోడళ్ళ మంచితనం గురించి బాగా గుర్తు చేశావు, బాబాయ్! నేనూ, తమ్ముడూ మా భార్యలు అక్కచెల్లెళ్ళయితే కలుపుగోలుగా వుంటారనుకుంటున్నాం,’’ అన్నాడు.

కొడుకు మాటలకు విదురయ్య చిన్నగా నవ్వి, ‘‘ఒరే, మనం మంచి మాట్లాడుకుంటున్నప్పుడు, పైన తథాస్తు పలికే దేవతలుంటారని పెద్దలు చెప్పే మాట నిజం. మీకు చెప్పలేదు - ఆ మధ్య నారదకుండం గ్రామంనుంచి అలాంటిదే ఒక సంబంధం వచ్చింది. ఆ గ్రామ మునసబు విశ్వేశ్వరయ్యకు ఇద్దరూ కూతుళ్ళే. ఆయనతో మనకు కొంచెం దూరపు బంధుత్వం కూడా వుంది. ఆ అమ్మాయిల్ని మంచి రోజు చూసి చూడ్డానికి వెళ్ళండి. నచ్చితే, నాకభ్యంతరం లేదు. అంతా మీకే వదిలేస్తున్నాను,’’ అన్నాడు.

‘‘వాళ్ళను చూడడానికి మనం అందరం కలిసే వెళదాం,’’ అన్నారు సోమన్న, గోపన్నలు. ఒక మంచి రోజున, తను కుటుంబంతో, పిల్లలను చూసేందుకు వస్తున్నట్టు విదురయ్య, నారదకుండం గ్రామ మునసబు విశ్వేశ్వరయ్యకు కబురు పంపాడు. తమతో పాటు రావలసిందిగా ధర్మయ్య కుటుంబాన్ని కూడా ఒప్పించాడు.

అనుకున్న రోజున అందరూ ఒక బాడుగ బండిలో బయల్దేరారు. బండి తీరా విశ్వేశ్వరయ్య ఇంటి దాపులకు వచ్చేసమయంలో, విదురయ్యకు గుండెనొప్పి వచ్చింది. విశ్వేశ్వరయ్య వెంటనే అతణ్ణి ఇంటిలోపలికి తీసుకు పోయి మంచం మీద పడుకోబెట్టి వైద్యుడి కోసం మనిషిని పంపాడు. వైద్యుడు హుటాహుటిన వచ్చి విదురయ్యను పరీక్షంచి, ‘‘ఇదే మంత తీవ్రమైన గుండెపోటులా కనిపించడం లేదు. ఏమైనా చిన్న పామునైనా పెద్ద కరత్రో కొట్టమన్నారు. నేనిచ్చే మందులు వాడుతూ, కదలకుండా వారం రోజులు మంచంమీద వుండాలి,’’ అని చెప్పాడు.


అప్పుడు ధర్మయ్య, విశ్వేశ్వరయ్యతో, ‘‘ఇలా జరుగుతుందనుకోలేదు. మీరు గ్రామంలో ఏదైనా కాస్త మంచి ఇల్లు చూసి బాడుగకు ఇప్పించండి. అవసరం అయితే పది రోజులు కాదు, ఇరవై రోజులైనా అక్కడవుండి విదురయ్య వైద్యం చేయించుకుంటాడు,’’ అన్నాడు.

విశ్వేశ్వరయ్య ఏదో చెప్పబోయేంతలో, ఆయన కూతుళ్ళిద్దరూ సైగ చేసి ఆయన్ను పక్కగదిలోకి పిలిచారు. ఇద్దరిలో పెద్దదైన రాగిణి, తండ్రితో, ‘‘నాన్నా! వాళ్ళు మన ఇంటికి పెళ్ళిచూపులకు వచ్చిన వాళ్ళు. విదురయ్యగారికి వైద్య సహాయం అవసరం అయినన్నాళ్ళూ, మన ఇంటిలోనే వుంచుకోవడం ధర్మం,’’ అన్నది.

చిన్న కూతురు మోహిని, అక్కమాటలకు తలవూపి, తండ్రితో, ‘‘అక్క చెప్పినట్టు చెయ్యి, నాన్నా! పెళ్ళిచూపులకు ముందే, మామగారు అనారోగ్యం పాలయ్యారనే అపవాదు మాకు రాకూడదు. సంబంధం కలిసినా కలవకపోయినా, వాళ్ళు సంతృప్తిగా మన ఇంటి నుంచి వీడ్కోలు తీసుకోవాలి. విదురయ్యగారు మన ఇంట్లోనే వుండి వైద్యం చేయించుకోవడం అన్ని విధాలా మంచిది,’’ అన్నది.

కూతుళ్ళు చెప్పినదంతా విన్న విశ్వేశ్వరయ్య, పక్కనే నిలబడి మౌనంగా చూస్తున్న భార్యకేసి తలతిప్పాడు. ఆమె, కూతుళ్ళ కేసి మెచ్చుకోలుగా చూసి, ‘‘అమ్మాయిలు చెప్పినట్లే చేయండి. వచ్చిన బంధువులందర్నీ వేరే ఇంట్లో వుంచడం మర్యాద అనిపించుకోదు. తర్వాత మీ ఇష్టం,’’ అన్నది.

ఈ సంభాషణ అంతా పక్కగదిలోని మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుని వున్న విదురయ్యకు కాస్త స్పష్టాస్పష్టంగా వినబడుతూనే వున్నది. ప్రయాణ బడలికవల్ల కలిగిన కొద్దిపాటి అనారోగ్యం తను, విశ్వేశ్వరయ్య కుటుంబీకుల స్వభావాలను తెలుసుకునేందుకు చక్కగా ఉపయోగించిందని, ఆయన చాలా సంతోషించాడు. విశ్వేశ్వరయ్య, తన భార్య, కూతుళ్ళు చెప్పినదాన్ని గురించి బాగా ఆలోచించి, చివరకు విదురయ్య, ధర్మయ్య కుటుంబాలకు, గ్రామంలో మంచి సదుపాయాలుగల ఒక ఇంటిలో వసతి ఏర్పాటు చేశాడు.

ఆ ఇంట ధర్మయ్య కుటుంబానికీ, విదురయ్య కుటుంబానికీ పది రోజులు హాయిగా గడిచి పోయినై. ఇంత త్వరలో కోలుకున్నందుకు విదురయ్యను, వైద్యుడు తెగమెచ్చుకున్నాడు. ఇక అక్కడి నుంచి బయల్దేరదామనుకుంటుండగా ధర్మయ్య, విదురయ్యతో, ‘‘మనం విశ్వేశ్వరయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్ళిపోదాం. నువ్వు విన్న దాన్ని బట్టి, భార్య, కూతుళ్ళు చెప్పినా విశ్వేశ్వరయ్య నిన్ను వేరే ఇంటికి మార్చాడు,’’ అన్నాడు చిరుకోపంగా.

ఆ మాటలకు విదురయ్య నవ్వి, ‘‘ధర్మయ్యా, విశ్వేశ్వరయ్య భార్యా, కూతుళ్ళు జాలిగుణంతో పాటు మంచీ మర్యాదా ఎరిగినవాళ్ళు. ఇక విశ్వేశ్వరయ్య అంటావు; ఆయన వాటితో పాటు మంచి వ్యవహార జ్ఞానం కలవాడు. నన్నాయన వాళ్ళ ఇంట్లో వుంచుకుంటే, ఆడ పిల్లలను అంటగట్టడానికి పన్నాగం పన్నాడంటారు! అందుకే ఆయన నన్ను వేరే ఇంట్లో వుంచి అవసరమైన  వైద్యం చేయించాడు. ఆయన అంగీకరిస్తే రాగిణి, మోహినిలు, నా కోడళ్ళవుతారు. గోపన్న, సోమన్నలకు వాళ్ళిద్దరూ అన్ని విధాలా నచ్చారు,’’ అన్నాడు.

ఆ మర్నాడు లాంఛనంగా పెళ్ళిచూపులు జరిగినై. తల్లిదండ్రులతో పాటు, విశ్వేశ్వరయ్య కూతుళ్ళూ, విదురయ్య కొడుకులూ ఇష్టపడడంతో నిశ్చితార్థం, ఆ తర్వాత నెల రోజులు గడవకుండానే వాళ్ళ వివాహాలూ జరిగిపోయినై. కాలక్రమంలో విదురయ్య, ధర్మయ్య ఆశించినట్టు, కోడళ్ళిద్దరూ వాళ్ళపట్ల ఎంతో గౌరవాదరాలతో ప్రవర్తించి, వాళ్ళకు ఎంతో సంతోషం కలిగించారు.


No comments:

Post a Comment