Pages

Thursday, September 6, 2012

దేవుడి ఉనికి


రామదేవుడి గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్న అనేక మంది విద్యార్థులలో, చైతన్యుడు చురుకైనవాడు. ప్రతి విషయాన్ని తరచి చూసి, పరిశోధించి తెలుసుకునేవాడు. అతడి కుశాగ్ర బుద్ధికి రామదేవుడు చాలా సంతోషించాడు. తనకువున్న పాండిత్యాన్ని సంపూర్ణంగా ప్రియశిష్యుడికి అందించాడు. ఇప్పుడు చైతన్యుడు పద్ధెనిమిదేళ్ళవాడు.

ఇకవాడు గురుకులంలో వుండి నేర్వదగినది ఏమీలేదన్న నిర్ణయానికి వచ్చిన రామదేవుడు, ‘‘నా…యనా! నీ చదువు పూర్తయింది. దానికి తగిన సంస్కారం, వినయసంపద కూడా, నీకు మెండుగావున్నాయి. ఇక ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రుల్ని సేవించు. ఆ దైవం నీకు ఎల్లప్పుడూ అండగావుంటాడు!’’ అన్నాడు.

చైతన్యుడు, గురువుగారికి తలవంచి నమస్కరించి, ‘‘గురువర్యా! మీరు నాకు ఎన్నో విద్యలు నేర్పారు. కానీ, ఇప్పుడుచెప్పిన ఆ దేవుడిని మాత్రం ఏనాడూ నాకు చూపించ లేదు. ఎక్కడా కనిపించని ఆ దేవుడు, నాకు అండగా వుంటాడంటే నమ్మకం కుదరడం లేదు,’’ అన్నాడు.

చైతన్యుడు హేతువాది. ప్రత్యక్షంగా కనిపించేది మాత్రమే నిజం అనే యదార్థవాది.రామదేవుడు ఒక్క నిమిషం ఆలోచించి, ‘‘చైతన్యా! నీ ప్రశ్నకు జవాబు తరవాత చెబుతాను. ముందుగా ఒకపని చెయ్యి. ఇక్కడికి ఉత్తర దిక్కునవున్న అడవిని దాటితే సుశాంతం అనే నగరం వస్తుంది.

అక్కడికి ఆమడ దూరానవున్న భవానీపురం  అనే గ్రామంలో, నా సోదరుడు నివసిస్తున్నాడు. నువ్వు అతడి వద్దకు వెళ్ళి క్షేమ సమాచారాలు తెలుసుకునిరాగలవా?’’ అని అడిగాడు.ఇందుకు సరేనన్న చైతన్యుడు, మర్నాడు వేకువజామునే బయల్దేరాడు. గురుపత్ని అతడికి రెండు రోజులకు సరిపోయే రొట్టెలనూ, ఇతర తినుబండారాలనూ ఒక సంచీలో పెట్టియిచ్చింది.చైతన్యుడు కాస్త వేగంగా నడుస్తూ, మిట్ట మధ్యాహ్నంవేళకు అడవిలో కొంతదూరం వెళ్ళాడు.


 దాహం వేయడంతో, ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని అతడు పరిసరాలను పరికించి చూస్తున్నంతలో, ఒక గుడ్డి ముసలివాడు - అడవిచెట్ల ఆకులను తడిమి చూస్తూ, వాసన పీలుస్తూవుండడం కంటబడింది.చైతన్యుడు, ఆ గుడ్డి ముసలివాణ్ణి సమీపించి, ‘‘ఏం, తాతా! దేనికోసమో వెతుకుతున్నట్టున్నావే!’’ అన్నాడు.‘‘నాయనా, ఏదీ పోలేదు. నేను దాపులనున్న కోయగూడెంవాడిని; అందరూ నన్ను మందులతాత అని పిలుస్తారు. మందుగా వాడేందుకు పనికివచ్చే ఆకుల్ని ముట్టుకుని, వాసన చూసి కోసుకుపోతున్నాను. పుట్టు గుడ్డినిగదా మరి!’’ అన్నాడు తాత.

‘‘అలాగా! అయితే, నీ చేతిలోవున్న ఆ తీగ దేనికి పనికివస్తుంది?’’ అని అడిగాడు చైతన్యుడు.‘‘ఇదా! ఇది విషహారిణి, నాయనా! పాము కాటుకు ఇది తిరుగులేని మందు. పాముకాటు తిన్న మనిషి నోట్లో, ఈ తీగ పసరు పిండితే, క్షణాల్లో విషం విరిగిపోయి, పోయే ప్రాణం తిరిగి వస్తుంది. కావాలంటే వుంచు. అడవిలో తిరుగుతున్నావు, అవసరం కలగవచ్చు,’’ అంటూ తీగను కొంత తుంచి, చైతన్యుడికిచ్చాడు తాత.చైతన్యుడు ఆ తీగను దుస్తుల్లో భద్రపరచుకుని, తాతను, ‘‘ఈ దగ్గర్లో ఎక్కడైనా నీరు దొరుకుతుందా?’’ అని అడిగాడు.

‘‘ఈ దరిదాపుల్లోనే మంచినీళ్ళ బావివుంది. కాస్త వెతికి చూడు,’’ అన్నాడు తాత.చైతన్యుడు కొంచెం ముందుకు నడిచి నలువైపులా పరీక్షగా చూశాడు. అతడికి ఒక మద్దిచెట్టు పక్కన బావి కనిపించింది. అతడు అక్కడ భోజనం చేసి, చెట్టుకింద విశ్రమించాడు. అంతలో కునుకుపట్టింది. హఠాత్తుగా తన మీద ఏదో పడినట్లయి అతడు కళ్ళు తెరిచాడు. దూరంగా పరిగెడుతున్న కుందేలు అతడి కంట బడింది. అంతలో చెట్టు కొమ్మ ఒకటి  పెద్ద ధ్వనితో విరిగి పడింది.

చెతన్యుడు చటుక్కున పక్కకు తప్పుకున్నాడు. కుందేలు అలికిడి లేకపోతే, తను కునుకు పాటులో వున్న సమయంలో కొమ్మ అతడి మీద పడివుండేది. ఎవరో ఆ కొమ్మను వంట చెరుకు కోసం సగం నరికి వదిలిపోయారు!చైతన్యుడు తిరిగి నడక సాగించాడు. అతడు అడవి దాటి నగర పొలిమేర ప్రాంతాలు చేరే సరికి అక్కడ ఒక పేదవాడు, అతడి భార్యాపిల్లలు డొక్కలు ఎండిపోయి ఆకలితో అలమ టిస్తూ, అతిదీనంగా ముష్టి ఎత్తుకోవడం కనిపించింది.


వెంటనే చైతన్యుడు, గురుపత్ని తనకు తిరుగు ప్రయాణానిక్కూడా సరిపోయేటట్లు కట్టియిచ్చిన ఆహారాన్ని పేదవాడి చేతుల్లో పెట్టి ముందుకు సాగాడు. అతడు నగరం చేరే సరికి బాగా చీకటి పడింది. ఆ రాత్రికి తలదాచుకునేందుకు ఒక సత్రం చేరి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో చుట్టూ కలకలం ప్రారంభమయ్యే సరికి, చైతన్యుడు లేచికూర్చున్నాడు. ఎవరో బాటసారి సత్రం వసారాలో నురగలు కక్కుతూ గిలగిలా కొట్టుకోవడం అతడికి కనిపించింది. అంతలో గోడవారగా చరచరా పాకిపోతున్న నల్లత్రాచు కంటబడింది.
వెంటనే, ఆ బాటసారిని కాటు వేసిందని గ్రహించిన చైతన్యుడు, తన దగ్గరవున్న విషహారిణి తీగపసరు అతడి నోటిలో పిండాడు. క్షణాల్లో అతడి శరీరం నీలి రంగు నుంచి, సహజమైన ఛాయలోకి మారింది. నెమ్మదిగా కళ్ళు తెరిచిన  ఆ బాటసారి ఎవరో కాదు; సుశాంతనగర మంత్రి. ప్రజల సాధక బాధకాలు తెలుసుకునేందుకు మారువేషంలో నగర సంచారం చేస్తూ, సత్రంలో పాముకాటుకు గురయ్యాడు.ఆయన చైతన్యుణ్ణి పరిపరి విధాల మెచ్చుకుని, ‘‘నా ప్రాణాలు కాపాడావు. ప్రత్యుపకారంగా, నేనేం చేసినా ఋణం తీరదు. అయినా, నాకు తోచిన సాయం చేయదలచాను.

 రాజాస్థానంలో నీకు మంచి పదవి ఇప్పిస్తాను. ఏ మంటావు?’’ అని అడిగాడు.చైతన్యుడు, మంత్రికి కృతజ్ఞత చెప్పుకుని, తాను అత్యవసరం అయిన పని మీద దాపుల నున్న భవానీపురం వెళుతున్నాననీ, తర్వాత వచ్చి దర్శనం చేసుకుంటాననీ చెప్పి, తెల్లవారగానే బయల్దేరి భవానీపురంలోని గురువుగారి సోదరుడి ఇల్లు చేరి, క్షేమ సమాచారాలు తెలుసుకుని, వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు.


అతడు సూర్యాస్తమయ సమయానికి గురుకులానికి చేరి, గురువుకుతన ప్రయాణ విశేషాలన్నీ ఒక్కపొల్లు కూడా పోకుండా చెప్పాడు.గురువు సంతోషించి, ‘‘నాయనా, చైతన్యా! నువ్వు అడిగిన ప్రశ్న - దేవుడిని చూపమని కదా? నా అవసరం లేకుండానే, నువ్వే చూడగలిగావు దేవుణ్ణి!’’ అన్నాడు.‘‘నేనా! నాకే దేవుడూ కనిపించలేదు!’’ అంటూ ఆశ్చర్యపోయాడు చైతన్యుడు.

ఆ జవాబుకు రామదేవుడు చిరునవ్వు నవ్వి, ‘‘ఇక్కడా అక్కడా అని లేకుండా, అప్పుడు ఇప్పుడు అని కాక, ఎక్కడ బడితే అక్కడ - ఏ ఒక్క రూపానికో పరిమితంకాకుండా కనిపిస్తాడు, ఆ సర్వాంతర్వామి. గమనించే విజ్ఞత వుంటే చాలు!’’ అన్నాడు.చైతన్యుడు అర్థంకాలేదన్నట్టు విస్తు పోతూ, గురువుకేసి చూశాడు. అప్పుడు రామదేవుడు, ‘‘విను! నీకు విషహారిణి తీగగురించి తెలియజెప్పిన, గుడ్డి ముసలి కోయవాడు దేవుడు. అడవిలో కూడా అవసరం కలుగుతుందేమో అని, బావి తవ్వించిన వ్యక్తి కూడా దేవుడే.

నీ ప్రాణం కాపాడిందే, ఆ అల్పజీవి కుందేలు కూడా దైవాంశమే. పాముకాటుకు గురై ప్రాణాపదలోవున్న మంత్రిని కాపాడిన నీలో కూడా, నీకు తెలియకుండానే, ఆ దేవుడున్నాడు. చూశావా! ఇన్ని రూపాలతో ప్రత్యక్షమైన, ఆ దేవుడికి - ఇంత చూసినా, ఉనికిలేదనే అంటావా?’’ అని అడిగాడు. దానితో జ్ఞానోదయమైంది చైతన్యుడికి.

జాలి, దయ గల మనసులోనే దేవుడు కొలువుంటాడని గ్రహించి, గురువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు.ఆ తర్వాత చైతన్యుడు, గురువు వద్ద వీడ్కోలు తీసుకుని, తల్లిదండ్రులను వెంట బెట్టుకుని సుశాంతనగరం చేరి, మంత్రి దర్శనం చేసుకున్నాడు. ఆయన సహాయం వల్ల, చైతన్యుడికి ఆస్థానంలో మంచి పదవి లభించింది.



No comments:

Post a Comment