Pages

Thursday, September 6, 2012

గోవర్థనుడి ఎన్నిక

రంగాపురంలో గోవర్థనుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయనకు నూరెకరాల పొలంతో పాటు, నాలుగు రకాల వ్యాపారాలు కూడావున్నాయి. ఇవన్నీ చూసుకునేందుకు ఆయన వద్ద చాలా మంది నౌకర్లు పనిచేస్తున్నారు. అయితే, తనను కనిపెట్టుకుని వుంటూ, తను చెప్పిన పనులు చేసే ఒక నమ్మకమైన మనిషి కోసం ఆయన చూస్తున్నాడు. ఆ విషయం తెలిసి, ఆయన వద్దకు సీతయ్య, భీమయ్య, రాజయ్య అనేవాళ్ళు వెళ్ళారు.
గోవర్థనుడు ముందుగా సీతయ్యను పిలిచి, అతడి గురించి చెప్పమన్నాడు. సీతయ్య వినయంగా, ‘‘నేను బాగా చదువుకున్నాను. కలిగిన కుటుంబంలో పుట్టాను. నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఇలా వచ్చాను. మీరేపని చెప్పినా శ్రద్ధగా చేస్తాను. ఎందుకంటే, జీవితంలో పైకి రావాలంటే మీ వంటి గొప్పవారి దగ్గరే కదా నేర్చుకోవాలి!’’ అన్నాడు.

‘‘అయితే, నీవు ఇప్పుడే మార్కాపురం వెళ్ళి రాములయ్యను కలుసుకో. నేను చెప్పానని ఆయన వద్ద కొన్ని రోజులుండి వంట చేయడం నేర్చుకుని రా!’’ అన్నాడు గోవర్థనుడు వెంటనే.

‘‘మీక్కావలసింది అన్ని విధాలా సహాయకుడుగా వుండే మనిషి కదా! మీరు వంట గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా వుంది,’’ అన్నాడు సీతయ్య.

‘‘ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నేను ఇంటి వంటలే తప్ప బయటితిళ్ళు తినను. సొంత వ్యవహారాల మీద మనం బయట తిరుగుతున్నప్పుడు, నా భార్య నాతో పాటు వుండదు కదా! భోజనం వేళకు ఇల్లు చేరకపోతే, నువ్వే నాకు ఇంత ఉడకేసి పెట్టాలి,’’ అన్నాడు గోవర్థనుడు.

‘‘నాకు వంట చేయడం రాదు. కానీ ఏదైనా క్షణాల మీద నేర్చుకోగలను. వంట కోసం మార్కాపురం వెళ్ళడమెందుకు? మా అమ్మ ఎంతో రుచిగా వంట చేస్తుంది.


 ఆమె దగ్గర నేర్చుకుని వస్తాను,’’ అన్నాడు సీతయ్య. ‘‘ఎవరెంత రుచిగా వండినా, నాకు రాములయ్య వంటలే ఇష్టం. రాములయ్య దగ్గర నేర్చుకోవలసిన ఇంకో విశేషముంది. చుట్టు పక్కల మనకు ఏవి లభ్యమైతే వాటి నుంచే రకరకాల తినుబండారాలు చేయగలడు. నీళ్ళు, నిప్పు, ఉప్పు లేకుండా కూడా వంటలు చేయగలడు. రాములయ్య దగ్గర శిక్షణ పొందినవారు నడిసముద్రంలో చిక్కుకున్నా ఎడారిలో దారి తప్పినా, చిట్టడవిలో ఇరుక్కు పోయినా సరే - తిండికి మాత్రం ఇబ్బంది పడరు. అందుకే, నిన్ను రాములయ్య వద్దకు పంపాలనుకుంటున్నాను,’’ అన్నాడు గోవర్థనుడు. ఈ మాటలకు సీతయ్య నిరుత్సాహ పడి, ‘‘అయ్యా! తమరివద్ద రకరకాల పనులు నేర్చుకుని, గొప్ప వ్యవహారవేత్తను కావాలనుకున్నాను. కానీ, తమరిక్కావలసింది వంటవాడు; నా వంటి వాడుకాదు,’’ అన్నాడు.

‘‘నేను నిన్ను వ్యవహారవేత్తను చేయాలని పిలవలేదు!’’ అని గోవర్థనుడు, సీతయ్యను పంపేసి భీమయ్యను పిలిచాడు. భీమయ్య తన గురించి చెబుతూ, ‘‘నేను బాగా చదువుకున్నాను. ఎంతటి కష్టమైన పనైనా సులభంగా చేయగలనని, నా గురించి అంతా అంటారు. నాలుగైదు ఊళ్ళనుంచి కొందరు భాగ్యవంతులు, నాకు పని ఇస్తామని కబురుపెట్టారు. కానీ మీ గురించి గొప్పగా వినడం వల్ల, మీ వద్దనే పని చేయాలని ఆశపడి ఇలా వచ్చాను,’’ అన్నాడు.

 అప్పుడు గోవర్థనుడు, భీమయ్యకు, సీతయ్యకు చెప్పినట్లే రాములయ్య గురించి చెప్పాడు. భీమయ్య ఎంతో ఉత్సాహ పడి, ‘‘ఇప్పటికే నాకు వంట బాగా వచ్చు. మా ఇంట్లో అమ్మకు నలతగావుంటే నేనే వంట చేసేవాణ్ణి. తమరి పుణ్యమా అని రాములయ్య దగ్గర, నా పాకశాస్త్ర ప్రావీణ్యానికి మరిన్ని మెరుగులు దిద్దుకోగలను,’’ అన్నాడు.

గోవర్థనుడు పెదవి విరిచి, ‘‘అయ్యో! రాములయ్య బొత్తిగా వంటరానివారికి మాత్రమే శిక్షణ ఇస్తాడు. నీకాయన వంట నేర్పడు,’’ అన్నాడు. భీమయ్య వెంటనే, ‘‘అ…య్యా! నాకు వంట వచ్చిన విషయం రాములయ్యకు చెప్పను. నాకు బొత్తిగా వంటరాదని ఆయనకు చెప్పి శిక్షణ తీసుకుని వస్తాను,’’ అన్నాడు. ‘‘అసలు విష…ుం నీకు అర్థం కాలేదు. ఎంతో కొంత వంటచే…ుడం వచ్చిన వారికి నేర్చుకుందామన్నా రాములయ్య పాకప్రావీణ్యం అబ్బదు.


  కాబట్టి నువ్వు నాకు పనికి రావు,’’ అన్నాడు  గోవర్థనుడు. భీమయ్య దీనంగా, ‘‘అయ్యా! గొప్పకు పోయి అబద్ధం చెప్పాను. నా చదువు కూడా అంతంత మాత్రం. నాకు తమరు పనియిస్తే, తమవద్ద నమ్మకంగా పడివుంటాను,’’ అన్నాడు. గోవర్థనుడు తల అడ్డంగా వూపి, ‘‘నీవు నాకు అబద్ధాలు చెప్పావని ముందే ఊహించాను. నీవు మొదట నీ గురించి అన్నీ నిజాలు చెప్పివుంటే, నేను తప్పక పనికి తీసుకునేవాణ్ణి.

నీవిక వెళ్ళవచ్చు,’’ అని భీమయ్యను పంపేశాడు. తర్వాత రాజయ్య ఆయన్ను కలుసుకుని, ‘‘అయ్యా! నేను పేదవాణ్ణి. పని శ్రద్ధగా చేస్తే మళ్ళీమళ్ళీ చెబుతారని నిర్లక్ష్యంగా చేయడం వల్ల, ఎవరూ నాకేపనీ చెప్పేవారు కాదు. ఇంట్లో అమ్మానాన్నల పెత్తనం పోయి, అన్నావదినెల పెత్తనం వచ్చింది. నాకాళ్ళ మీద నన్ను నిలబడమని నన్ను ఇంట్లోంచి గెంటేశారు. అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి కడుపు నింపు కుందామనిచూస్తే, నిజం తొందరగానే బయటపడి, అంతా నన్ను నమ్మడం మానేశారు. చివరకు దొంగతనాలకు దిగాను. రెండుసార్లు పట్టుబడలేదు కానీ, మూడోసరి దొరికిపోయాను. ఏడాది పాటు కారాగారంలో వుండి కఠినశిక్షలలు అనుభవించాను.

శిక్షలతో పాటే వంటతో సహా బోలెడు పనులు నేర్చుకున్నాను. నా ప్రవర్తనకు మెచ్చి నన్ను కాస్త ముందుగా కారాగారం నుంచి విడుదల చేశారు. అయితే, బయటకు వచ్చాక, నేను దొంగనని ఎవరూ నాకు పని ఇవ్వడంలేదు. తమరు దయార్ద్రహృదయులని తెలిసి ఇలా వచ్చాను. తమరు నాకు అవకాశమిస్తే, మిమ్మల్ని మెప్పించగలననే నా నమ్మకం,’’ అని తన గురించిన వివరాలు చెప్పాడు.

అంతావిన్న గోవర్థనుడు, అతడికి రాములయ్య గురించి చెప్పి, ‘‘నీకు ఇప్పటికే వంట వచ్చు కాబట్టి రాములయ్య నీకు శిక్షణ ఇవ్వడు. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు పడదు. నేను నమ్మకస్థుడి కోసం వెతుకుతున్నాను. కానీ నీవు దొంగతనాలు చేసి కారాగారంలో శిక్షననుభవించి వచ్చావు. నీవు నాకు తగిన మనిషివనిపించడంలేదు. నువ్వేమంటావు?’’ అని ప్రశ్నించాడు. దీనికి బదులుగా రాజయ్య, ‘‘అయ్యా! తమరికి రాములయ్య వంట తెలుసు, నా వంట తెలియదు. నేను కూడా రాములయ్య లాగే వండుతానేమో! తమరు నావంట రుచి చూసి నచ్చకపోతే పనిలోకి తీసుకోకండి. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే తమకు సరిపడదన్నారు. నన్ను కొన్నాళ్ళు పనిలో వుంచుకుని, ఒక్క అబద్ధపుమాట నా నోటివెంటవస్తే, అప్పుడు పనిలోంచి తీసేయండి. మీబోటివారి వద్ద పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటే, ఇతరులు కూడా నన్ను మెచ్చుకుని, నాకు పనియిస్తామని అంటారు. తమరు నాకు ఒక అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను,’’ అన్నాడు. గోవర్థనుడు కాసేపాలోచించి రాజయ్యను పనిలోకి తీసుకున్నాడు.

ఇది తెలిసిన గోవర్థనుడిభార్య కలవర పడుతూ, ‘‘కలిగినింటివాడైన సీతయ్యనూ, సచ్ఛరిత్ర కలిగిన భీమయ్యనూ వదిలి, అబద్ధాల పుట్టా, మోసగాడూ, దొంగా అయిన రాజయ్యను పనిలోకి తీసుకున్నారు. దీనివల్ల మనకు కీడుజరుగుతుందని, నాకు భయంగా వుంది!’’ అన్నది.

గోవర్థనుడు, భార్యను సముదాయ పరుస్తూ, ‘‘సీతయ్య కలిగినవాడు. నా దగ్గర అన్నీ నేర్చుకుని స్వతంత్రంగా బ్రతకడానికి వెళ్ళిపోతాడు. భీమయ్య తన అవసరం కోసం అబద్ధాలాడే తరహా మనిషి. అతడి అబద్ధాలకు శిక్షపడాలి. అప్పుడే అతడికి తన తప్పు తెలుస్తుంది. అందుకే నేనతణ్ణి పని ఇవ్వనని పంపేశాను.

ఇక రాజయ్య విషయానికొస్తే - అతడు చాలా తప్పులు చేసి, వాటికి శిక్షననుభవించాడు. వాడిలో మంచి మార్పు వచ్చిందని కారాగారపు అధికారులు కూడా తెలుసుకున్నారు. మీదుమిక్కిలి రాజయ్య తన గురించి ఏ చిన్న విషయమూ దాచకుండా తన నిజాయితీని ఋజువు చేసుకున్నాడు. కారాగారంలో మారిన తన ప్రవర్తన, నేర్చిన పనుల సహాయంతో నన్ను మెప్పించగలనన్న నమ్మకంతోవున్నాడు.

ఆ నమ్మకానికి ప్రాణం పోయడం మానవత్వమనిపించుకుంటుంది. అదీ కాక, మనం పనిలోంచి మానిపిస్తే, అదివరకే దొంగగా పేరుపడ్డ రాజయ్యకు వేరెవ్వరూ పని ఇవ్వరుకాబట్టి, అతడు మనల్నే అంటి పెట్టుకుని వుండే ప్రయత్నం చేస్తాడు,’’ అన్నాడు.

ఆయన నిర్ణయాన్ని భార్య మెచ్చుకున్నది. తర్వాత రాజయ్య, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

No comments:

Post a Comment