Pages

Thursday, September 6, 2012

ఋణవిముక్తి


ఒక గ్రామంలో రంగనాథం అనే పరమ లోభి ఒకడు ఉండేవాడు. అతను తన ఇంటి మీద పిచ్చుక వాలినా సహించలేక పోయేవాడు ; బోలెడంత కూడబెట్టి కూడా కటిక దరిద్రుడిలా బతికేవాడు. రంగనాధం భార్య చచ్చిపోయింది. తెలివి తేటలు లేని కొడుకు ఒకడు ఉన్నాడు.

రంగనాధం వాడికి గంజినీళ్ళు మాత్రమే పెట్టేవాడు. వాడు తిండికి ముఖం వాచి , కానీ దొరికితే చాలు , మిఠాయి దుకాణానికి పోయి , ఏదో ఒకటి కొనుక్కుతినేవాడు. డబ్బు కూడబెట్టటానికి రంగనాధం ఒక ఉపాయ చేశాడు. అతను తన ఇంట్లో ఒక మూల గొయ్యితీసి , అందులో ఒక బిందె పాతిపెట్టి , దాని మీద పెట్టిన మూతలో డబ్బులు పట్టేటంత సందు ఉంచి , ఆ సందు తప్ప , పైకి బిందెజాడ ఏమీ కనబడకుండా చేశాడు. అతను తనకు వచ్చే డబ్బులో స్వల్పంగా ఖర్చుకు ఉంచుకుని , మిగిలినది బిందెలోకి జారవిడిచేవాడు.

తండ్రి ఇలా చెయ్యటం కొడుకు ఒకనాడు చూశాడు గాని , డబ్బులను తండ్రి భూమిలో ఎందుకు వేస్తున్నదీ ఊహించలేకపోయాడు. వాడు తన తండ్రిని , ‘‘ అదేమిటి , నాన్నా ? ఇంకోపూటకు నూకలైనా కొనకుండా చిల్లర డబ్బులు భూమిలోకి అలా జారవిడుస్తున్నావు ?’’ అని అడిగాడు.

రంగనాధం వాడితో , ‘‘ చూడు , బాబూ , భూమిలో మనకు అప్పుపెట్టిన ఋణదాతలున్నారు. వారికి మనం చాలా ఇయ్యవలసి ఉంది. మనం పేదవాళ్ళం గనక ఒక్కసారిగా అంతా ఇచ్చుకోలేం. అందుకే రోజూ కొంచెం కొంచెంగా వారికి ముట్ట జెప్పుతున్నాను. నేను వేసే ప్రతి చిల్లిగవ్వా వారికి ముట్టుతుంది ,’’ అన్నాడు.

ఈ మాట కొడుకు నమ్మేసి , తన తండ్రి లోభిగా బతకటం ఇందుకే కాబోలుననుకున్నాడు. వాడికి ఋణదాతల మీద పట్టరాని కోపం కూడా కలిగింది. వాడు తండ్రితో , ‘‘ వాళ్ళమూలాన్నేగదా మనం ఇలా రోజూ  కడుపు కట్టుకుంటున్నాం ? వాళ్ళకు ఇవ్వటం మానేసి మనం రెండు పూటలా కావలసినంత కడుపు నిండా తింటే సరి ,’’ అన్నాడు.

కొడుకు ధోరణి చూస్తే వాడు తన ప్రయత్నానికి అడ్డంతగిలేటట్టు కనిపించేసరికి , వాణ్ణి బెదరగొట్టటానికి రంగనాధం , ‘‘ చూడు , బాబూ! వాళ్ళు సామాన్యులు కారు. ఒక్క రోజు మనం డబ్బులు వెయ్యటం మానితే , పెద్దపెద్ద కత్తులతో వాళ్ళు మనని నరకటానికి వస్తారు ,’’ అన్నాడు.

రంగనాధం కొడుకు బురల్రో ఈ మాటలు నాటుకున్నాయి. చలికాలంలో ఒక రాత్రి భోజనాలవేళ ఒక బైరాగి , ‘‘ ధర్మదాతలు , పట్టెడు అన్నం పెట్టించండి ,’’ అంటూ తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు. అది చూసి రంగనాధానికి పట్టరాని ఆగ్రహం వచ్చి , ‘‘ ఇది మీ తాత కట్టించిన ధర్మసత్రం కాదు ,’’ అని అరిచాడు. బైరాగి బిత్తరపోయి , ‘‘ అయ్యా , భోజనం సంగతి దేవుడెరుగు. ఈ రాత్రికి నన్నీ వసారాలో పడుకోనివ్వండి ,’’ అని ప్రాధేయపడ్డాడు.

రంగనాధం మరింత మండిపడి , ‘‘ చెప్పుతూంటే మనిషివి కాదూ ? నీకు పరిచర్యలు చెయ్యటానికి నేనేమన్నా బాకీ ఉన్నానా ? వెళ్ళు! ’’ అంటూ ఆ బైరాగిని మెడపట్టి బయటికి గెంటాడు. ‘‘ నాకు కాకపోతే మరెవరికో బాకీ ఉండటం మూలాన్నే ఇలా పస్తులుంటూ కూడబెట్టుతున్నావు. నువ్వు సంపాదించినదంతా మరెవడికో దక్కుతుంది. దాన్ని అనుభవించే అర్హత నీకుండదు ,’’ అన్నాడు బైరాగి. ‘‘ నీలాటి పాపిష్ఠి ముఖాలను ఇంట్లోకి రానిస్తే అదే జరగవచ్చు.

ఈ రాత్రి బయట చలిలో అఘోరించావంటే నీకూ తెలుస్తుంది అనుభవం ,’’ అన్నాడు రంగనాధం కసిగా. ‘‘ సమయం వస్తే నీకూ అదేగతి పట్టుతుంది మిడిసిపడకు! ’’ అన్నాడు బైరాగి. ‘‘ లంకంత ఇల్లు ఉండగా నా కెందుకు అలా జరుగుతుందిరా ? వీధులన్నీ ఉన్నవి నీలాంటి వెధవల కోసమేరా! ’’ అంటూ రంగనాధం దభీమని తలుపు మూశాడు. కొన్నాళ్ళ అనంతరం రంగనాధానికి అనుకోకుండా ప్రయాణం తగిలింది. అతను తన కొడుకుతో , ‘‘ ఒరేయ్ , ఇల్లు జాగ్రత్త. రోజూ వచ్చిన డబ్బులు భూమిలో వేస్తూ ఉండు. నేను రెండు , మూడు రోజుల్లో తిరిగి వస్తాను ,’’ అని చెప్పి వెళ్ళిపోయాడు.

  రంగనాధం కొడుకు , చేతికి అందిన చిల్లరడబ్బులు భూమిలో వెయ్యటం ఇష్టంలేక , దానితో మిఠాయి కొనుక్కు తినసాగాడు. రెండు రోజులు గడిచాయి. మూడో రోజు రాత్రి ఒక చిత్రం జరిగింది. అర్ధరాత్రివేళ ఎవరో తలుపుకొట్టారు. రంగనాధం కొడుకు నిద్రమొహంతో లేచి వెళ్ళి తలుపుతీశాడు. ముగ్గురు దొంగలు కత్తులూ , కటార్లతో లోపలికి వచ్చారు. కురవ్రాడికి వాళ్ళను చూడగానే తండ్రి ఎప్పుడో చెప్పిన మాట గుర్తుకొచ్చింది.

వాళ్ళు తప్పక ఋణదాతలై ఉంటారనుకున్నాడు వాడు. తాను రెండు రోజులుగా వాళ్ళకు డబ్బువెయ్యలేదు! వాడు వాళ్ళతో , ‘‘ అయ్యా , ఋణదాతలూ! మన్నించండి! డబ్బు చేతికి రానందున రెండు రోజులుగా భూమిలో డబ్బు వెయ్యనిమాట నిజమే. మా నాన్న గనక ఇంట్లో ఉంటే మీ డబ్బు ఎంతో కొంత వెయ్యకుండా నిద్రపోయేవాడు కాడు. ఆయన ఊళ్ళోలేడు. నాకు ఆ పని చెయ్యటం చేతకాలేదు. రేపు మీ డబ్బు మొత్తం అంతా ఎలాగైనా సరే అందులో వేస్తాను.

ఈ సారికి నన్ను వదిలి వెయ్యండి! ’’ అన్నాడు. వాడు ఏ మంటున్నదీ వాళ్ళకు అర్థంకాలేదు. కాని డబ్బు ఎక్కడో తమకోసం వేస్తున్నట్టు వాళ్ళకు స్పష్టమయింది. వారిలో ఒకడు కురవ్రాడితో , ‘‘ ఏదీ ? మీ నాన్న డబ్బు ఎక్కడ వేస్తున్నాడు ? చాలాకాలంగా మాకు డబ్బు చేరలేదు ?’’ అన్నాడు. రంగనాధం కొడుకు అక్కడవున్న మంచం పక్కకు నెట్టి , బిందె పాతినచోటు దొంగలకు చూపాడు. దొంగలు అక్కడ తవ్వి , బిందెను పైకి తీశారు. దాని నిండా మొయ్యలేనంత చిల్లర ఉన్నది.

దొంగలు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మర్నాడు రంగనాధం ఊరు నుంచి తిరిగి వచ్చి , బిందె ఉండవలిసిన చోట గొయ్యి చూసి , లబో దిబో మన్నాడు. ‘‘ నా బిందె! నా డబ్బు! ’’ అంటూ బావురుమని ఏడుస్తూ , జుట్టు పీక్కున్నాడు.

తండ్రి ప్రవర్తన చూసి కొడుకు , ‘‘ అదేమిటి , నాన్నా , మన సొమ్మంతా దొంగ లెత్తుకుపోయినట్టు బాధ పడుతున్నావూ ?’’ అని అడిగాడు. ‘‘ అయితే , తీసి దాచావా ?’’ అని రంగనాధం కొడుకును అడిగాడు ఆశగా. ‘‘ నువ్వేమీ కంగారు పడకు. అది వాళ్ళసొమ్మే గనక వాళ్ళను తీసుకు పోనిచ్చాను ,’’ అన్నాడు కొడుకు.

రంగనాధానికి ఒళ్ళు మండిపోయింది. అతను తన కొడుకు గొంతు పట్టుకుని , ‘‘ ఎవర్రా వాళ్ళు ? నా సొమ్ము వాళ్ళదెలా అవుతుంది ?’’ అని అరిచాడు. ‘‘ అదే , నాన్నా! ఆనాడు నువ్వు చెప్పావు చూడూ , ఆ ఋణదాతలే వచ్చారు ,’’ అంటూ కొడుకు రంగనాధానికి జరిగినదంతా వివరించాడు. ‘‘ ఒరేయ్ , బుద్ధి గడ్డి తిని నీతో అలా చెప్పాను! ఆ వచ్చింది పచ్చి దొంగలురా! ముక్కూ మొహమూ తెలియని వాళ్ళు వచ్చి అర్ధరాత్రి తలుపు కొట్టితే , బుద్ధి ఉన్నవాడివైతే తలుపులు తీస్తావుట్రా ?’’ అన్నాడు రంగనాధం. అవును!

తనవల్ల పొరపాటే జరిగింది. ఇంకెప్పుడూ అలా చెయ్యరాదని నిర్ణయించుకున్నాడు రంగనాధం కొడుకు.
తనకు జరిగిన అన్యాయం గురించి న్యాయస్థానానికి ఫిర్యాదు చేసినట్టయితే తన డబ్బు గురించి అందరికి తెలిసిపోతుందని , రంగనాధం రాత్రివేళ దొంగలను అన్వేషిస్తూ చుట్టుపట్ల గ్రామాలు తిరగసాగాడు. అతను ఒకరోజు అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చి తలుపు కొట్టాడు. ఎంతగా గొంతు చించుకుని అరిచినా ప్రయోజనం లేకపోయింది. తన కొడుకు మతిమాలిన వాడయినందుకు విచారిస్తూ , రంగనాధం వీధి తలుపుకు చేరగిల బడ్డాడు.

చలికి ఒళ్ళు కొంకర్లు పోయింది. తెల్లవార్లూ చలికి బిగిసి , తెల్లవారగట్ల రంగనాధం కునుకు తీశాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న బైరాగి రంగనాధాన్ని తట్టిలేపి , ‘‘ అయ్యా , లంకంత ఇల్లు ఉండగా , ఈ చలిలో ఇలా వీధిలో పడుకున్నావేం ?’’ అని అడిగాడు. ‘‘ ఏం చెప్పమంటావు ? ఆనాడు నువ్వన్న మాటలు శాపంలా తగిలాయి.

ఒకడికి పెట్టకుండా , నేను తినకుండా కూడబెట్టినదంతా దొంగలు దోచుకున్నారు ,’’ అన్నాడు రంగనాధం.
‘‘ అలా అనుకోవద్దు. వాళ్ళు దొంగలుకారు , ఋణదాతలు , ఋణవిముక్తి అయినందుకు సంతోషించండి ,’’ అంటూ బైరాగి సాగిపోయాడు. ఆ నాటి నుంచీ రంగనాధం మారిపోయి , తాను తింటూ , ఇతరులకు ఇంత పెట్టుతూ , సుఖంగా చాలాకాలం జీవించాడు.



No comments:

Post a Comment