Pages

Thursday, September 6, 2012

అద్దంలో యుద్ధం


పదహారేళ్ళ వయసువాడైన శంకరయ్య ఒట్టి అమాయకుడు. అతడు పుట్టిన మూడేళ్ళకు తల్లి చనిపోవడంతో తండ్రి సాంబయ్య, నూకాలమ్మ అనే ఆమెను రెండో పెళ్ళి చేసుకున్నాడు. క్రమంగా నూకాలమ్మకు ఇద్దరు మగ పిల్లలు కలిగారు. ఆమె తన బిడ్డలను గారాబంగా చూసుకుంటూ, వాళ్ళను గ్రామంలోని పాఠశాలకు పంపుతూండేది. శంకరయ్యతో మాత్రం ఇంటిపనులతో పాటు, పొలం పనులు కూడా చేయిస్తూండేది.

ఇలా కొంత కాలం గడిచింది. ఉన్నట్టుండి సాంబయ్య అంతుబట్టని వ్యాధితో మంచాన పడ్డాడు. అతడు భార్యాబిడ్డలను దగ్గరకు పిలిచి, అమాయకుడైన శంకరయ్యను భార్యకు అప్పగిస్తూ, అతడి బాగోగులు చూసుకోమని మరీమరీ చెప్పికన్నుమూశాడు.

అయితే, నూకాలమ్మ, శంకరయ్యను ఇంట్లోంచి పంపేయాలనుకుని, ఒకనాడు అతడితో, ‘‘నాయనా! రాత్రి మీ నాన్న నాకు కలలో కనిపించి, ఈ అద్దం ఇచ్చాడు. ఇది ఎంతో మహిమకలదట! దీన్ని నీకివ్వమనీ, ఇదే తన ఆస్తిలో నీ భాగమనీ చెప్పాడు,’’ అని, చుట్టూరా నగిషీలు చెక్కిన అద్దాన్ని అతడికిచ్చింది.

ఆ అద్దం, నూకాలమ్మకు ఇంకా పెళ్ళికాక ముందు, పొలం పని చేసి మధ్యాహ్నం వేళ ఇంటికి తిరిగివస్తూండగా, ఏనాడో శిథిలమై పోయిన ఒక సాధువు ఆశ్రమం రాళ్ళగుట్టలో మెరుస్తూ కనిపించింది. ఆ సాధువు గొప్ప మహిమలుకలవాడని జనం చెప్పుకునేవారు. ఆ అద్దాన్ని పెళ్లయ్యాక ఆమె భర్త సాంబయ్యకు ఇచ్చింది. శంకరయ్య, నూకాలమ్మ చెప్పిందంతా విని అద్దం తీసుకుని, ‘‘అమ్మా! నేనిప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోవాలా?’’ అంటూ అమాయకంగా అడిగాడు.

‘‘అంతేగదా, నాయనా! మీ నాన్న తన ఆస్తిలో నీ భాగంగా, ఈ అద్దం ఇచ్చేయమన్నాడంటే, నిన్ను బయటికి పోయి, నీ బతుకు నిన్ను బతకమనే కదా,’’ అన్నది నూకాలమ్మ, శంకరయ్య చేతిలో నాలుగు రూపాయలు పెడుతూ.


ఆరోజే  శంకరయ్య, ఒక చిరుగుల సంచీలో రెండు జతల బట్టలు పెట్టుకుని, వాటి మధ్య భద్రంగా అద్దాన్నుంచి, ఇంటి నుంచి బయలుదేరి, చీకటి పడుతూండగా రాజుగారి కోట సమీపంలో వున్న సత్రాన్ని చేరాడు. సత్రంలో ఒక అర్ధ రూపాయి ఇచ్చి భోజనం చేసి, సత్రం వాళ్ళు చూపిన గదిలో చాప మీద కూర్చుని, సంచీలో వున్న అద్దాన్ని బయటకు తీశాడు.

అద్దం చూడ ముచ్చటగావున్నది. శంకరయ్య దానిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, ‘‘నాన్నా, ఈ అద్దం చాలా మహిమగలదని అమ్మ చెప్పింది. ఆ మహిమను ఎలా తెలుసుకోవాలో మాత్రం చెప్పలేదు. నువ్వు ఆ సంగతి అమ్మకు చెప్పివుండవు,’’ అనుకుంటూ అద్దాన్ని గుండెల మీద పెట్టుకుని అలాగే నిద్రపోసాగాడు.

సరిగ్గా అర్ధరాత్రి సమయంలో, సత్రంలో పెద్ద కలకలం లేచింది. రాజైన మిత్రవర్మ మీదికి వ్యాఘ్రకేతుడనే పొరుగు రాజు సైన్యంతో వచ్చి హఠాత్తుగా కోటను ముట్టడించాడు. కోట రక్షణలో వున్న సైనికులు శత్రువులను ఎదిరించారు. ఆ సమ…యంలో మిత్రవర్మ కోటలోని తన శయనాగారంలో నిద్రపోతున్నాడు. ఆ…యన ప్రజారంజకంగా పరిపాలన చేసే మంచి రాజుగా అందరూ కీర్తించేవారు.

సత్రం యజమాని, సత్రంలో బసచేసిన వారికి, వ్యాఘ్రకేతుడు ఎలాంటి దుష్టుడో చెప్పి, ‘‘ధర్మాత్ముడైన మన మిత్రవర్మ రాజు …యుద్ధానికి సిద్ధంగా వున్నాడో లేడో తెలి…యదు. ఆ…యన జయించాలని ప్రార్థిద్దాం,’’ అన్నాడు.

ఆ మాటలు వింటూనే శంకర…య్య, తన చేతిలో వున్న మహిమగల అద్దంలోకి చూస్తూ, ‘‘ధర్మాత్ముడైన రాజు మిత్రవర్మ జయిస్తే ఎంత మేలు!’’ అన్నాడు.
అంతే! ఆమరుక్షణం అద్దంలో ఒక మెరుపు మెరిసింది. అద్దంలోంచి కందిరీగంత సైనికులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి, అంతలోనే దృఢకాయులైన సైనికుల్లా మారిపోయి, శరవేగంతో వెళ్ళి వ్యాఘ్రకేతు సైనికులపై కలియబడ్డారు. ఈ భయంకర పరిణామం చూసి వ్యాఘ్రకేతు నివ్వెర పోతున్నంతలో, అతడి సైనికులు ఒక్కొక్కరుగా నేలకొరగ సాగారు.


ఇంతలో, అద్దంలోంచి పొడవాటి తాడు ఒకటి వేగంగా దూసుకు వెళ్ళి, వ్యాఘ్రకేతును చుట్టివేసి బంధించింది. ఆ సరికి నిద్ర లేచి కోటదిగి వచ్చిన మిత్రవర్మ, అద్దంలోంచి వచ్చిన సైనికులు శత్రువులతో …యుద్ధం చేయడం, వ్యాఘ్రకేతు బంధితుడు కావడం తెలుసుకుని, స్వయంగా సత్రానికి వచ్చి శంకరయ్యను చూసి, ‘‘నీ మహిమగల అద్దం వల్ల రాజ్యం రక్షంచబడింది! ఇంతకూ నీ పేరేమిటి? ఏ ప్రాంతం వాడివి?’’ అని అడిగాడు.

శంకరయ్య తన పేరూ, ఎక్కడి నుంచి వచ్చిందీ, తండ్రి మరణించినప్పటి నుంచి జరిగిందంతా రాజుకు వివరంగా చెప్పి, ‘‘అసలు ఈ అద్దం నాకేం మేలు చేస్తుందో నాకు తెలియదు. ధర్మాత్ములైన మీరు జయించాలని కోరుకున్నాను. అద్దంలోంచి వచ్చిన సైనికులు, శత్రువులను ఓడించారు,’’ అన్నాడు సంతోషంగా.

రాజు అంతా విని ఎక్కడలేని ఆశ్చర్యంతో, ‘‘నీ సవతి తల్లి ఏం ఆశించి, ఈ అద్దం నీ కిచ్చిందో కానీ, రాజ్యానికి గొప్ప ఉపకారం జరిగింది. నిన్ను ఈ రోజే గురుకులంలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తాను. అది పూర్తయ్యాక ఆస్థానంలో మంచి పదవి ఇస్తాను, ఇష్టమేనా?’’ అని అడిగాడు.

శంకరయ్య సంతోషంగా ఇష్టమేనంటూ  తల ఊపేంతలో, అద్దం అతడి చేతి నుంచి ఐదారడుగులు గాలిలోకి లేచి, ఫెళ్ళు మంటూ పెద్ద ధ్వనితో పగిలి ముక్కలు ముక్కలై పోయింది.
ఇది చూసి శంకర…య్య దిగాలు పడి, పగిలిన అద్దం ముక్కలకేసి చూశాడు. రాజు అతడి భుజం మీద చేయివేసి చిన్నగా నవ్వి, ‘‘అద్దం పగిలి పోయిందని బాధ పడకు. మహిమలు, మంత్రాలు మనిషి అభివృద్ధికి ఎంతో కాలం సాయపడవు. మనిషి ఆత్మవిశ్వాసంతో, ధైర్యసాహసాలతో తన అభివృద్ధిని తానే సాధించుకోవాలి. ఇక రా!’’ అంటూ అక్కణ్ణించి కదిలాడు. శంకర…య్య నవ్వు ముఖంతో, చుట్టూవున్న వారికేసి ఒకసారి చూసి, రాజును అనుసరించి నడిచాడు.


No comments:

Post a Comment