Pages

Thursday, September 6, 2012

కరుణా హృదయుడు కొచ్చుణ్ణి!

షర్‌వూడ్‌ అడవుల్లోని రాబిన్‌హూడ్‌ సాహసకృత్యాల గురించి మీకు తెలుసు. అవునా? వందలాది సంవత్సరాలకు పూర్వం ఇంగ్లాండులో జీవించిన రాబిన్‌హూడ్‌ ధనికులను దోచి పేదలకు పంచిపెట్టేవాడు. దాదాపు అదే పద్ధతిలో కేరళ ప్రాంతంలో కొచ్చుణ్ణి కొన్నేళ్ళ క్రితం ధనికులకు సింహస్వప్నంగా ఉండేవాడు. ముఖ్యంగా పేదలను దోచుకునే వారన్నా, వేధించే వారన్నా కొచ్చుణ్ణికి అసలు గిట్టదు. అతడు ధనికుల నుంచి దొంగతనాలు చేసిన మాట వాస్తవమే. అయితే, అలా దొంగిలించిన దానిలో చిల్లిగవ్వ కూడా తన సొంతానికి ఉపయోగించుకోలేదు. అంతా పేదలకు ఇచ్చేసేవాడు. ఆ రోజుల్లో ‘కాయాంకుళం కొచ్చుణ్ణి’ పేరు చెబితే చాలు, డబ్బున్న వారి గుండెలు దడదడలాడేవి. దక్షణ కేరళలోని కాయాంకుళం పరిసర ప్రాంతంలో అతడు ఉండేవాడు.

 అదే ప్రాంతంలో ఒక భూస్వామి ఉండేవాడు. అతడు వ్యవసాయంతో పాటు వడ్డీవ్యాపారం కూడా చేసేవాడు. నగలు తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీలకు అప్పులిచ్చేవాడు. వడ్డీ డబ్బులతో అచిరకాలంలోనే అతడు గొప్ప ధనవంతుడయ్యాడు. అప్పు తీర్చే శక్తిలేక కొందరు తాకట్టు పెట్టిన నగలను విడిపించుకోలేక అలాగే వదిలేసేవారు. అలాంటి నగలు కూడా అతని సొంతమైపోయేవి.

ఇలా కూడబెట్టిన ధనంతో అతడొక ఇల్లు కట్టాడు. ఇల్లు అంటే మామూలు ఇల్లు కాదు. చిన్నకోటలాంటి భవంతి. ఇంటి గోడలు మరీ దృఢంగా ఉండేలా కట్టించాడు. ఇంటి మీద అంత డబ్బు ఎందుకు వెచ్చిస్తున్నావని మిత్రులు అడిగితే, ‘‘కొచ్చుణ్ణి గురించి మీకు తెలియదా? ఆ దుర్మార్గుడు ఇంటికి కన్నం వేయడానికి ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసు?


ప్రజలు తాకట్టు పెట్టిన నగలను కాపాడే బాధ్యత నాకున్నదికదా? అందుకే దృఢమైన గోడలు కట్టిస్తున్నాను. ఒక్కడు కాదు; పదిమంది కొచ్చుణ్ణిలు వచ్చినా లోపలికి రాలేరు,’’ అనేవాడు గొప్పగా.  భూస్వామి చెప్పుకునే గొప్పలు ఆ నోటా ఈ నోటా పడి కొచ్చుణ్ణి చెవిన పడ్డాయి. భూస్వామికి తగిన గుణపాఠం నేర్పడానికి సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు.

ఒకరోజు కొచ్చుణ్ణి బాగా ఆలోచించి భూస్వామి దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు అప్పు అడిగాడు. భూస్వామి మారు మాట్లాడకుండా అడిగినంత డబ్బు ఇచ్చేశాడు. కొచ్చుణ్ణి ఇక చేసేది లేక భూస్వామి ఇంటిని పరిశీలనగా చూసి తిరిగి వచ్చాడు. కొన్నాళ్ళ తరవాత, కృష్ణన్‌ నాయర్‌ అనే వ్యక్తి నగలు తాకట్టుపెట్టి, భూస్వామి దగ్గర వెయ్యి రూపాయలు అప్పుపుచ్చుకున్నాడు. ఇది కొచ్చుణ్ణికి తెలియవచ్చింది. ఒకనాడు చీకటి పడుతూండగా,  కొచ్చుణ్ణి భూస్వామి ఇంటిని సమీపించాడు.

ఆ సమయంలో భూస్వామి శరీరానికి నూనె పట్టించుకుని స్నానం కోసం పెరట్లోవున్న చిన్న కొలను దగ్గరికి వెళుతున్నాడు. దానిని చూసిన కొచ్చుణ్ణి చకచకా ఇంటి గుమ్మం  సమీపించి, ‘‘ఇలా చూడు, కృష్ణన్‌ నాయర్ అప్పు చెల్లించడానికి వచ్చాడు.  డబ్బు తీసుకుని, పట్టు సంచీలో వున్న అతని నగల్ని తెచ్చి ఇవ్వు,’’ అన్నాడు భూస్వామి కంఠస్వరంతో భార్యను ఆజ్ఞాపిస్తున్నట్టు.  భూస్వామిభార్య ఇంటిలో నుంచి గుమ్మంలోకి వచ్చింది.

 అక్కడ నిలబడ్డ మనిషిని చూసి, అతడు ఇచ్చిన డబ్బు సంచీని తీసుకుపోయి లోపల పెట్టి, పట్టుసంచీలో ఉన్న నగలను తెచ్చి ఆ మనిషి చేతికిచ్చింది.  మనిషి వచ్చినదారినే హడావుడిగా వెళ్ళిపోయాడు.  ఇదంతా జరుగుతున్నప్పుడు భూస్వామి పెరటి కొలనులో హాయిగా స్నానం చేస్తున్నాడు. కాబట్టి అతనికి ఏమీ తెలియదు. కొన్నాళ్ళు గడిచింది. గడువు సమీపించడంతో, కృష్ణన్‌ నాయర్‌, వడ్డీతో సహా అప్పు తిరిగి చెల్లించి నగలు తెచ్చుకోవడానికి భూస్వామి దగ్గరికి వెళ్ళాడు. డబ్బులు తీసి జాగ్రత్తగా లెక్కపెట్టిన తరవాత భూస్వామి, ఇంటి లోపలికివెళ్ళి పెట్టె తెరిచి చూసి దిగ్భ్రాంతి చెందాడు. కృష్ణన్‌ నాయర్‌ నగలతో ఇచ్చిన పట్టు సంచీ అక్కడ కనిపించలేదు!


 భూస్వామి భార్యను పిలిచి సంచీని గురించి అడిగాడు. ‘‘అప్పుడే మరిచి పోయారా? బావుంది. ఇంత మతిమరుపయితే వ్యాపారం చేసినట్లే. నిన్నగాక మొన్ననే కదా మీరు కృష్ణన్‌ నాయర్‌ డబ్బు తెచ్చాడు. డబ్బు తీసుకుని అతనికి నగలు ఇచ్చి పంపించు, అని చెప్పారు?’’ అన్నది భార్య.

‘‘అలాగా మరి డబ్బు ఎక్కడ?’’ అని అడిగాడు భూస్వామి ఏమి జరిగిందో అంతుబట్టక. ‘‘పెట్టెలోనే వుంది. ఎరబ్రట్టలో మూటగా కట్టివుంది. నెమ్మదిగా చూడండి,’’ అన్నది భార్య. భూస్వామి ఎర్ర మూటను విప్పి చూశాడు. అందులో డబ్బులేదు. ఎందుకూ పనికిరాని రాగి, సత్తు నాణాలు ఉన్నాయి. భూస్వామి మౌనంగా గుమ్మంలోకి వచ్చాడు. కృష్ణన్‌ నాయర్‌కి జరిగిన సంగతి వివరించి క్షమాపణలు చెప్పుకున్నాడు.  నగలు ఎంత ఖరీదువో అతని నుంచి తెలుసుకుని, ఆ మొత్తాన్ని చెల్లించాడు. కృష్ణన్‌ నాయర్‌ దానిని పుచ్చుకుని తృప్తిగా వెళ్ళిపోయాడు. జరిగిన మోసానికి, భూస్వామీ అతని భార్యా తెగబాధ పడిపోయారు, పట్టరాని విచారంతో. తమను ఇంతగా మోసగించినవాడు ఎవడై ఉంటాడా, అని ఆలోచించారు. ‘‘ఆ రోజు సాయంకాలం వచ్చిన వాడి ముఖం నీకు గుర్తుందా!’’ అని అడిగాడు భూస్వామి ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ. ‘‘నాకెలా గుర్తుంటుంది? డబ్బు పుచ్చుకుని  నగలు ఇవ్వమని నన్ను పురమాయించింది సాక్షాత్తు మీరు. వచ్చినవాడే కృష్ణన్‌ నాయర్ అనుకున్నాను,’’ అన్నది భార్య.

‘‘ఆ రోజు వచ్చినవాడు కొచ్చుణ్ణి అయివుంటాడా? నా కంఠస్వరంతో మాట్లాడి, నా భార్యనే మోసగించినవాడు మరెన్ని ఘోరాలు చేస్తాడో ఏమో!’’ అనుకుంటూ భూస్వామి విచారంతో కుమిలిపోసాగాడు. కొంత సేపటికి, ‘‘ఏమయింది? ఆలుమగలు విచారంతో తెగబాధపడి పోతున్నారు?’’ అంటూ కొచ్చుణ్ణి అక్కడికి వచ్చాడు. భూస్వామి నోరు తెరవలేకపో…ూడు. అతని భార్య జరిగిందంతా పూసగుచ్చినట్టు కొచ్చుణ్ణికి వివరించింది. కొచ్చుణ్ణి చిన్నగా నవ్వుతూ, బట్టల్లో దాచిన పట్టు సంచీని తీసి భూస్వామి చేతికి ఇస్తూ, ‘‘నగలన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకుని, కృష్ణన్‌ నాయర్‌కు కబురు చేసి రమ్మని, అతని నగలు అతనికి అప్పగించి, నీ డబ్బు  నువ్వు తిరిగి పుచ్చుకో. ఏదో నీ కోటలోకి నేను అడుగుపెట్టలేనని నువ్వు ప్రగల్భాలు పలికావని విన్నాను.


అందుకే ఈ చిట్కా ప్రయోగించాను,’’ అన్నాడు. భూస్వామి చేతులు జోడించి కొచ్చుణ్ణికి క్షమాపణలు చెప్పుకున్నాడు. కొచ్చుణ్ణి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఆ తరవాత భూస్వామి పేదల నుంచి అధిక వడ్డీలు గుంజకుండా, వేధించకుండా తన పద్ధతులను మార్చుకున్నాడు. ఆ సంగతి తెలిసి సంతోషించిన కొచ్చుణ్ణి మరెప్పుడూ భూస్వామి జోలికి పోలేదు. భూస్వామి కూడా కొచ్చుణ్ణి  పట్ల గౌరవమర్యాదలు చూపేవాడు. అదే ప్రాంతంలో క్రైస్తవుడైన ఒక ఎండు కొబ్బరి వ్యాపారి ఉండేవాడు.
అతనికి ఎంత ప్రయత్నించినా వ్యాపారం కలిసిరాలేదు. తరచూ అందిన చోట అధిక వడ్డీలకు అప్పులు చేసేవాడు. వీలైప్పుడు అప్పులు వడ్డీలతో సహా తీర్చేవాడు. వీలుకానప్పుడు చేసిన అప్పులు తీర్చడానికి వేరొక చోట అప్పులు చేసేవాడు.
అయినా మునుముందు వ్యాపారం బాగా నడిచి, లాభాలు ఆర్జించి అప్పులు లేని బతుకు సాగించకపోతామా అన్న గంపెడాశతో అతడు కాలం గడపసాగాడు. ఒకరోజు ఆ వ్యాపారి అలెప్పీకి వెళ్ళి సరుకు అమ్మి తిరుగు పడవలో ప్రయాణమయ్యాడు. వ్యాపారం లాభసాటిగా జరగలేదు. పడవలో విచారంగా తలవంచుకుని కూర్చుని ఈ పరిస్థితుల్లో ఎలా నెట్టుకు రావడమా అని తీవ్రంగా ఆలోచించ సాగాడు. సాయంకాలం బాగా పొద్దు పోయింది. పడవ వెళుతోంది. ఉన్నట్టుండి వేగంగా వచ్చే పడవ తెడ్ల శబ్దం వినిపించింది.

 ఆ పడవ దగ్గరికి రాగానే అందులో నుంచి ఒక మనిషి, వ్యాపారి వెళుతూన్న పడవలోకి దూకాడు. అతన్ని చూడగానే వ్యాపారి భయంతో గడగడా వణకసాగాడు. అతడు కొచ్చుణ్ణి. ‘‘ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు?’’ అని గద్దించి అడిగాడు కొచ్చుణ్ణి. ‘‘కొబ్బరి వ్యాపారిని. అలెప్పీ నుంచి వస్తున్నాను,’’ అన్నాడు వ్యాపారి భయంభయంగా. ‘‘అలాగా! అలెప్పీలో మంచి లాభాలే సంపాయించావు కదా? నీ దగ్గరున్నదంతా మర్యాదగా ఇలా ఇవ్వు!’’ అని గద్దించాడు కొచ్చుణ్ణి. ‘‘బాబూ, నేను నిరుపేద వ్యాపారిని. నన్నేం చేయకు, నీకు పుణ్యముంటుంది,’’ అని వేడుకున్నాడు వ్యాపారి. ‘‘నేను కొచ్చుణ్ణిని. నేను చెప్పింది చేయకపోతే, ఏం జరుగుతుందో తెలుసుకదా?’’ అని హెచ్చరించాడు కొచ్చుణ్ణి. వ్యాపారి మరేం మాట్లాడకుండా, రొండిన దోపుకున్న డబ్బు దాచిన చిన్న గుడ్డసంచీ తీసి కొచ్చుణ్ణికి ఇచ్చాడు.

‘‘అందులో ఎంత ఉందేమిటి?’’ అని అడిగాడు కొచ్చుణ్ణి.


‘‘రెండు వందలా యాభై రూపాయలు. వ్యాపారంలో మరీ నష్టమొచ్చింది,’’ అన్నాడు వ్యాపారి క్షమించమనే ధోరణితో.
‘‘సరే, ఇక నువ్వు వెళ్ళవచ్చు,’’ అంటూ కొచ్చుణ్ణి మెరుపులా పక్కనున్న తన పడవలోకి దాటుకున్నాడు. క్షణాల్లో పడవ చీకట్లో కలిసిపోయింది.

వ్యాపారి గాఢంగా నిట్టూర్చి, పేరు మోసిన దొంగనుంచి ఎలాంటి హానీ లేకుండా తనను కాపాడినందుకు ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రార్థించాడు.

ఇంటికి చేరి భార్యను చూడగానే కళ్ళనీళ్ళ పర్యంతమైపోయాడు. ‘‘జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేయగలం? ఎక్కడికి వెళ్ళగలం. చేయగలిగిందల్లా ఒక్కటే. ఉన్న ఇల్లు అమ్ముకుని, వచ్చే డబ్బుతో కాలం గడుపుదాం,’’ అన్నది భార్య ఓదారుస్తూ. వ్యాపారికి భార్య సూచన సరైనది గానే తోచింది.
ఇల్లు కొనగలవారి కోసం వెతకసాగాడు.

కష్టాల్లో ఉన్నాడు. ఎటొచ్చీ అమ్మక తప్పదు అన్న సంగతి తెలిసి పోవడంవల్ల ఇంటికి మంచిధర ఇవ్వడానికి ఒక్కరూ ఇష్టపడలేదు. అంత చిన్నమొత్తానికి అమ్మినా తమ వ్యాపారం కొనసాగించలేనన్న అనుమానంకొద్దీ వ్యాపారి ఇల్లు అమ్మడానికి వెనుకాడుతూ తటపటాయించ సాగాడు. ఒకనాటి సాయంకాలం కొచ్చుణ్ణి అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. వ్యాపారి అతన్ని చూడగానే లేచి నిలబడ్డాడు. ‘‘భయపడకు. నిన్ను దోచుకోవడానికో, వేధించడానికో నేనిప్పుడు రాలేదు.

 నీ దగ్గరి నుంచి దోచిన డబ్బు తిరిగి ఇవ్వడానికే వచ్చాను. నువ్వు డబ్బుగల వ్యాపారివి కావని ఆ రోజే పసిగట్టాను. ఆ తరవాత నిన్ను గురించి ఆరాతీస్తే భాధల్లో ఉన్నావని తెలిసింది. ఆ రోజు డబ్బుకు మరీ అవసరమొచ్చి, నువ్వు కష్టపడి సంపాయించిన కొద్ది మొత్తాన్ని దోచుకు పోయాను. నన్ను క్షమించు. ఇదిగో నీ డబ్బు సంచీ. తీసుకో,’’ అంటూ సంచీని వ్యాపారి చేతిలో పెట్టి, తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు కొచ్చుణ్ణి. ఇది కలా? నిజమా అని తెలియనంతగా ఆశ్చర్యపోయాడు వ్యాపారి. సంచీ విప్పి చూశాడు.

అందులో కొచ్చుణ్ణి ఎత్తుకుపోయిన తన డబ్బుకు నాలుగింతల ఎక్కువ డబ్బున్నది. ఈ మొత్తంతో వ్యాపారం కొనసాగించడమే కాదు; ఇది తనకు ఊహించని పెద్ద పెట్టుబడి కూడా! వ్యాపారి ఆకాశంకేసి చేతులెత్తి, ‘‘ప్రభూ! కొచ్చుణ్ణిని ఆశీర్వదించు. అతడు కరుణాహృదయుడు!’’ అని మౌనంగా ప్రార్థించాడు.



No comments:

Post a Comment