Pages

Thursday, September 6, 2012

పిశాచిసాయం


గౌరీపట్నంలో గంటమ్మ పూటకూళ్ళు నడుపుతూండేది. ఒక రోజున ఆమె అర్ధరాత్రిదాకా, వచ్చిన బాటసారులకు వడ్డన చేసింది. ఇక విశ్రాంతి తీసుకోవాలని ఆమె అనుకుంటూండగా, ఒక ముసలివాడు అక్కడికి వచ్చాడు.

గంటమ్మ, అతడితో, ‘‘వేళకాని వేళ! ఇది అర్ధరాత్రి అయినా, ఈ పూటకూళ్ళమ్మ ఎవరినీ ఆకలితో నిద్రపోనీయదు. క్షణాల మీద వంట చెయ్యగలను. భోజనం చేస్తావా?’’ అని అడిగింది. పండు ముసలి తన భుజాన్నుంచి వేళ్ళాడుతున్న జోలెను కిందికి దింపుతూ, ‘‘గంటమ్మా! భగవంతుడి ద…యవలన, నాకు ఆకలి దప్పులు లేవు. కాస్త ఈ పక్కనవున్న అరుగు మీద పడుకోనివ్వు,’’ అన్నాడు.

ఆ మాటలకు గంటమ్మ ఆశ్చర్యపోతూ, ‘‘ఆకలిదప్పులు లేకపోవడానికి నువ్వేమైనా యోగివా?’’ అని అడిగింది.
ముసలివాడు నవ్వి, ‘‘ఒక విధంగా యోగినే. నా పేరు రామేశం. నాదీ ఈ గౌరీపట్నమే. నేను యవ్వనంలో వుండగా, నా ఇంటికి అగ్నిప్రమాదం జరిగింది. తండ్రి, తల్లి, భార్య, చెల్లెలు - ఇలా నా కుటుంబమంతా అగ్నిలో దహనమై పోయింది. నేను విరక్తితో గ్రామం వదిలిపోయాను. అప్పట్లో మీ అమ్మ జోగమ్మ పూటకూళ్ళు నడిపేది. నువ్వు చిన్నపిల్లవు; నీ పేరు నాకు గుర్తుంది. నేను ఊరువదిలి తీర్థాలూ, పుణ్యక్షేత్రాలూ, నదీ నదాలూ దర్శిస్తూ, ఒక యోగికరుణవల్ల ఇచ్ఛాశక్తి, దివ్యదృష్టి సంపాయించాను. అందుచేత, నేను ఆకలిదప్పులను అదుపులో వుంచుకోగలను. ఎవరి భవిష్యత్తు ఎలా వుండబోతుందో చెప్పగలను,’’ అన్నాడు.

గంటమ్మ కుతూహలంగా, ‘‘ఎవరో సామాన్య బాటసారి అనుకున్నాను, క్షమించండి! నా భవిష్యత్తు ఎలావుంటుందో చెప్పగలరా?’’ అన్నది.


రామేశ యోగిలా ఒకసారి కళ్ళు మూసుకుని తెరిచి, గంటమ్మ కేసి అబ్బుర పడుతూన్నట్టు చూసి, ‘‘గంటమ్మా! నువ్వు డబ్బు తీసుకుని అన్నం పెట్టినా, బాటసారుల ఆకలి తీర్చిన అన్నపూర్ణవు. భగవంతుడు నిన్ను మెచ్చాడు. నాకు కాలం సమీపిస్తున్నది. నా ఇచ్ఛాశక్తిని, దివ్యదృష్టిని సంతోషంగా నీకు దానం చేసి, శ్రీశైలం వెళ్ళి శివసాన్నిధ్యంలో ముక్తి పొందుతాను. ఈ తెల్లవారు జామున మన ఊరి చెరువుగట్టున వున్న ఊడల మర్రికింద, వాటిని నీకు ధారాదత్తం చేస్తాను,’’ అన్నాడు.

తెల్లవారు జామున ఇద్దరూ చెరువుగట్టుకు చేరుకున్నారు. గంటమ్మ చెరువులో స్నానం చేసివచ్చింది. రామేశం తన శక్తులను ఆమెకు దానం చేసి, ‘‘గంటమ్మా! ఈ యోగశక్తుల్ని ఎట్టి పరిస్థితులలోనూ స్వార్థంకోసం దుర్వినియోగం చే…యకూడదు. అలా చేస్తే, నువ్వు మతిభ్రమకులోనై ఊళ్ళు పట్టుకు తిరగవలసివస్తుంది!’’ అని హెచ్చరించాడు.

గంటమ్మ, ఆ హెచ్చరిక విని తెల్లబోయింది. తనకు ఉపయోగపడని, ఈ శక్తులవల్ల ఏంప్రయోజనం! ఆమె అలా ఆలోచిస్తున్నంతలో, రామేశం చెట్టు కింది నుంచి లేచి చకచక అడుగులు వేసుకుంటూ క్షణాల మీద కను మరుగయ్యాడు.

గంటమ్మ దిగులుగా ఇంటికి తిరిగి వచ్చి, తనకున్న శక్తుల్ని గురించిన మాటను పక్కకు పెట్టి, మామూలు పూటకూళ్ళమ్మ లాగే జీవించ సాగింది. గంటమ్మలో ఇదివరకటి ఉత్సాహం లేకపోవడం, ఆమె పెంపుడుకొడుకు గోవిందరాజు గమనించాడు. ఒక నాడు అతడు గుచ్చిగుచ్చి రెట్టించి అడిగాక, గంటమ్మ అనుకోకుండా తనకు లభించిన దివ్యశక్తుల్ని గురించి అతడికి చెప్పి, వాటిని ఉపయోగిస్తే తనకు కలగబోయే ప్రమాదాన్ని గురించి వివరించివాపోయింది.

గోవిందరాజుకు ఇదంతా ఏదో కలలాగా తోచింది. అయినా దానిని గురించి మరువ లేకపోయాడు. ఆమర్నాటి మిట్టమధ్యాహ్నం వేళ అతడు ధైర్యంగా చెరువుగట్టునవున్న ఊడలమర్రి దగ్గరకు వెళ్ళాడు. అతడు చెట్టుపైకి ఒకసారి చూసి కూర్చోబోయేంతలో, చెట్టుపై నుంచి ఒక వింత ఆకారం దిగింది. అది పిశాచమని గుర్తించిన గోవిందరాజు నిలువెల్లా వణకసాగాడు.


పిశాచం భయపడకు అన్నట్టు చేయి ఊపి, ‘‘నేను, నిన్ను పెంచిన గంటమ్మ పెద్దమ్మకు శక్తులిచ్చిన రామేశం యోగికి తండ్రిని. కుటుంబంతో పాటు మంటల్లో బలవన్మరణం చెందడంవల్ల, ఇలా పిశాచాన్నయ్యాను. నువ్వు, నీ పెద్దమ్మకు కొడుకుతో సమానం కాబట్టి, ఆమె తన దివ్యదృష్టినుపయోగించి, నీ భవిష్యత్తు చెబితే, అది స్వార్థమే అవుతుంది. కానీ, గంటమ్మకున్న శక్తులవల్ల నీకు శుభం కలిగేలా, నేను చేయగలను,’’ అన్నది.

ఆ మాటలతో గోవిందరాజు మొండి ధైర్యం తెచ్చుకుని, ‘‘మా పెద్దమ్మ శక్తులు నాకు శుభం కలిగించేలా ఎలా చేయగలవు?’’ అని అడిగాడు పిశాచాన్ని. అప్పుడు పిశాచి రూపంలోని రామేశం తండ్రి, ‘‘నేను మరణించాను కాబట్టి, నాకు బంధుత్వాలు అంటవు. నీగంటమ్మ పెద్దమ్మను, నా భవిష్యత్తేమిటని అడుగు!’’ అన్నది.

 రామేశం తండ్రి కోరికకు సరేనన్న గోవిందరాజు, ఇంటికి తిరిగి వచ్చి, గంటమ్మకు జరిగింది చెప్పాడు.
తన శక్తుల్ని పరీక్షంచుకునే అవకాశం వచ్చినందుకు గంటమ్మ చాలా సంతోషించింది. అయితే, పిశాచి భవిష్యత్తును దివ్య దృష్టిలో చూసి గంటమ్మ గతుక్కుమన్నది. ఎందుకంటే, ఆ పిశాచానికి తన సహాయంవల్ల, పిశాచి రూపు నుంచి విముక్తి కలుగుతుంది. ఇది ఒక వేళ తన స్వార్థం అవుతుందేమో అని శంకించి, ఆమె అప్పటికప్పుడే, గోవిందరాజును వెంటబెట్టుకుని ఊడలమర్రి దగ్గరకు వెళ్ళింది.


పిశాచి చెట్టుదిగి వచ్చి గంటమ్మకు నమస్కరించి, ‘‘నేను రామేశం తండ్రి నన్న సంగతి విన్నావు కదా! ఆనాడు మంటల్లో మరణంపాలైనవాళ్ళల్లో, రామేశం చెల్లెలైన, నా కూతురు గిరిజ కూడా వుంది. ఇప్పుడా గిరిజ, మన పక్క గ్రామమైన శివపురంలో, నాతమ్ముడి కొడుకైన శివరాజుకు మనమరాలుగా పుట్టి యుక్తవ…యస్కురాలైంది. దానికి మాటలు రావు! నీ ఇచ్ఛాశక్తి దానికి మాట తెప్పిస్తుంది. ఈ గోవిందరాజుకు, శివరాజు మనమరాలినిచ్చి పెళ్ళి చేయడం, నా కోరిక అని చెప్పు. శివరాజు మంచి ఆస్తి పరుడు గనక, గోవిందరాజుకు పొలం కట్నంగా ఇస్తాడు. అందువల్ల, నీ పెంపుడు కొడుకు ఐశ్వర్యవంతుడవుతాడు. నాకు పిశాచరూపు నుంచి విముక్తి కలుగుతుంది. ఇందులో నీ స్వార్థం అంటూ ఏమీ లేదు, పుణ్యం తప్ప!’’ అంటూ పిశాచం, గంటమ్మకు మరొకసారి నమస్కరించి చెట్టుపైకి వెళ్ళిపోయింది.

పిశాచి మాటలు శ్రద్ధగా విన్న గంటమ్మకు, అన్ని సంశయాలూ తీరిపోయాయి. ఆమె, గోవిందరాజుతో పాటు శివపురంవెళ్ళి, తన యోగ శక్తితో శివరాజు కూతురుకు మాటలు వచ్చేలా చేసింది. గంటమ్మ ద్వారా సంగతంతావిన్న శివరాజు, తనకుమార్తెకు గోవిందరాజుతో పెళ్ళి జరిపించడమేగాక, కొంత పొలం కట్నంగా కూడా ఇచ్చాడు.

గంటమ్మ యోగశక్తుల్ని గురించి చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసిపోయింది. క్రమంగా ధనవంతులూ, వ్యాపారులూ తమతమ భవిష్యత్తు ఎలావున్నదో తెలుసుకునేందుకు ఆమె దగ్గరకు రాసాగారు.

గంటమ్మ తన ఓగశక్తులతో వాళ్ళకు భవిష్యత్తు గురించి వివరించేది. వాళ్ళు ఇవ్వజూపిన ప్రతిఫలాన్ని తీసుకోవడం స్వార్థం అవుతుంది గనక, వాళ్ళ చేత ప్రజోపయోగకరమైన పాఠశాలలూ, వైద్యాలయాలూ స్థాపించేలా డబ్బు ఖర్చుపెట్టించేది.

ఈ విధంగా, పూటకూళ్ళ గంటమ్మ, యోగశక్తుల గంటమ్మగా నలుగురి చేతా గౌరవింపబడుతూ, సమాజానికి ఉపయోగ పడే పనులు చేస్తూ, చాలాకాలం సుఖంగా జీవించింది.



No comments:

Post a Comment