Pages

Thursday, September 6, 2012

రంగు రంగుల మనుషులు


ప్రపంచ సృష్టి జరిగిన తొలిరోజులలో భూమి మీద కొండలూ, లోయలూ, నదులూ, సముద్రాలూ మాత్రమే ఉండేవి. ఒక్క పురుషుడు గాని, స్ర్తీగాని లేరు. అప్పటికి మానవ సృష్టి జరగలేదు.

ఒకనాటి ఉషోదయం సమయంలో సంతోషంగా నిద్ర నుంచి లేచిన మానీటూ దేవుడు, భూమికేసి చూసి మనుషులను సృష్టించవలసిన సమయం ఆసన్నమయిందనుకున్నాడు. నదీ తీరం నుంచి గుప్పెడు బంకమన్ను తెచ్చి, తనకు నచ్చిన రీతిలో జాగ్రత్తగా ఒక అందమైన మనిషి బొమ్మను తయారు చేశాడు. మన్ను గట్టిపడి అది దృఢంగా వుండడానికి ఇక చేయవలసిందల్లా, దానిని కాల్చడం ఒక్కటే మిగిలింది. దేవుడు మట్టి బొమ్మను పోయ్యిపై వుంచి, పుల్లలతో నిప్పు రాజిల్లేలా చేశాడు.

ఆ తరవాత, ఎండ తీవ్రంగా ఉండడం వల్ల, విశ్రాంతి తీసుకోవడానికి దాపులనున్న ఒక చెట్టునీడలో కూర్చున్నాడు. కొంతసేపటికి కునుకు పట్టడంతో, అలాగే నిద్రలోకి జారుకుని చాలా సేపు నిద్రపోయాడు. ఏదో మాడుతున్న వాసన రావడంతో ఉలిక్కి పడి లేచాడు. పొయ్యిపై కాలుతూన్న మట్టిబొమ్మ జ్ఞాపకం వచ్చింది. ఒక్క గెంతున వెళ్ళి, పొయ్యిని తెరిచి చూశాడు. మనిషి బొమ్మ బాగా మాడిపోయి బొగ్గులా నల్లగా వుంది.

దానిని చూసిన మానీటూ, ‘‘ఫరవా లేదు,’’ అనుకుంటూ, ‘‘ఇది నల్లజాతి ప్రజలకు మూల మవుతుంది,’’ అని బొమ్మను భూమి మీదికి వదిలాడు. మరురోజు మానీటూ మరొక మట్టి బొమ్మను తయారు చేశాడు. ఈసారి దానిని కాల్చడానికి అత్యంత జాగ్రత్తను తీసుకున్నాడు. దానిని ఎక్కువసేపు కాల్చితే మాడిపోయి మళ్ళీ నల్లగా అయిపోతుందేమో అన్న అనుమానం కొద్దీ, తొందరపడి ముందుగానే పొయ్యిమీది నుంచి తీసేశాడు.


దాంతో బొమ్మ కాలీ కాలకుండా పేలవంగా తెల్లగా తయారయింది. ‘‘ఫరవా లేదు. ఇది శ్వేతజాతి ప్రజలకు మూలమవుతుంది,’’ అనుకుంటూ మానీటూ ఆ బొమ్మను భూమిమీదికి వదిలాడు.

మూడవరోజు మానిటూ మరింత జాగ్రత్తగా మరొక బొమ్మను తయారుచేశాడు. ఎక్కువ సేపు కాలినా నల్లగా మారకూడదన్న ఉద్దేశంతో బొమ్మకు నూనె పూసి పొయ్యిమీద పెట్టాడు. అయినా ఈ ప్రయత్నం కూడా విజయవంతంకాలేదు. బొమ్మ, నల్లగానూ లేదు, తెల్లగానూ లేదు. పసుపురంగుగా తయారయింది. ‘‘సరే, వీళ్ళు పసుపు రంగు ప్రజలు!’’ అనుకుంటూ దానిని భూమిమీదికి వదిలిపెట్టాడు.

 నాలగవరోజు తెల్లవారగానే మానీటూ పట్టుదలగా కూర్చుని నాలగవ బొమ్మను చక్కగా తయారుచేశాడు. దానిని ఇప్పుడు ఎలా పక్వంగా కాల్చాలో ఆ…యనకు బాగా తెలిసిపోయింది. బొమ్మకు తగినంత నూనె రాసి పొయ్యిమీద పెట్టాడు. ఆ తరవాత పొయ్యిలో సరిగ్గా కావలసినన్ని కట్టెలు పెట్టి నిప్పు రగిలించాడు. బొమ్మ ఎలా కాలుతున్నదో జాగ్రత్తగా చూశాడు. ఆ విధంగా పరిపూర్ణమైన మనిషిని సలక్షణ రూపంతో తయారుచేశాడు. ఆ మనిషి అద్భుతమైన ఊదా-ఎరుపు రంగులో ఉన్నాడు.

 ‘‘వీరే ఎరజ్రాతి ప్రజలు! నేను తయారు చేసిన సర్వోత్తమమైన మనిషిబొమ్మ ఇదే!’’ అంటూ దానిని కూడా భూమీమీదికి వదిలాడు. వారే ఆ తరవాత రెడ్‌ ఇండి…యన్లుగా పిలవబడ్డారు.

ఈ విధంగానే వివిధ జాతుల సృష్టి భూమి మీద జరిగిందని రెడ్‌ ఇండి…యన్ల పూర్వగాథ చెబుతుంది. ఈ సృష్టి చేసిన మానీటూ రెడ్‌ ఇండియన్ల ఆరాధ్యదేవుడు.

No comments:

Post a Comment