Pages

Friday, September 14, 2012

విలువైన స్మారకం


విదిశా నగరాన్ని పాలించే శివవర్మ ప్రజారంజకుడుగా పేరు పొందాడు. వృద్ధుడైన ఆయనకు ఒక వింత కోరిక కలిగింది. వెంటనే ఆయన తన ఆస్థానంలోని నలుగురు మంత్రులను పిలిపించి, ‘‘ప్రజలు నన్ను శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. ప్రజలు మరిచి పోకుండా, ఎప్పటికీ నన్ను గురించి గొప్పగా చెప్పుకునేలా ఒక స్మారకాన్ని నిర్మించదలిచాను.అది ఎలాంటిదైతే బావుంటుందో చెప్పండి,'' అని అడిగాడు.
 
విష్ణుశర్మ అనే వృద్ధ మంత్రి, ‘‘మహాప్రభూ, విలువైన పాలరాతితో ఒక అద్భుత మందిరం నిర్మించవచ్చు,'' అన్నాడు. ‘‘ఆ పాలరాతి మందిరంలో విలువైన రత్నాలను పొదిగిస్తే, వాటిని చూసినప్పుడల్లా, తమ వైభవాన్ని ప్రజలు గొప్పగా చెప్పుకోగలరు,'' అన్నాడు మరొక మంత్రి అనంతశర్మ.
 
‘‘ఆ మందిరంలో తమ బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే, దాన్ని చూసే ప్రజలు తమరు జీవించి ఉన్నట్టే భావించగలరు,'' అన్నాడు శివశర్మ అనే మూడవ మంత్రి. ఆ ముగ్గురు మంత్రుల ఆలోచనలు విన్న తరవాత కూడా, తన అభిప్రాయూన్ని చెప్పకుండా మౌనంగా ఉన్న మణిశర్మ కేసి చూస్తూ, ‘‘మీ అభిప్రాయం ఏమిటి అమాత్యా!'' అని అడిగాడు మహారాజు.
 
‘‘ముగ్గురు మంత్రుల సూచనలూ, తమ వైభవాన్ని చాటి చెప్పేవిగానే ఉన్నాయి. అయినా, కాలం ఎల్లప్పుడూ ఒకే విధంగా సాగదన్న సంగతి తమకు తెలియనిది కాదుగదా. మునుముందు ఎలాంటి మార్పులువస్తాయో చెప్పలేం. పైగా ఇది కలికాలం. వచ్చే కాలంకంటే గడిచిన కాలమే సత్యకాలం అని కొందరంటే, కాదు భవిష్యత్తులోనే మానవాళికి మంచికాలం రాగలదని విశ్వసించే వారూ ఉన్నారు. ఇందులో ఏది నిజమైనప్పటికీ, ఏకాలంలో నైనాసరే, సామాన్య ప్రజల మేలు కోరి చేసేపనులే మన్ననల నందుకుం టాయి.

మంచి పనులు చేసేవారే ప్రజల హృదయూలలో చెరగని స్థానం సంపాయించగలరు. అందుకని, ముగ్గురు మంత్రులు చెప్పిన పాలరాతి స్మారక మందిరం చుట్టూ పదిమందికి ఉపయోగపడేలా రకరకాల పూల చెట్లతో, ఫల వృక్షాలతో పెద్ద తోటను నాటి పెంచుదాం. వాటి మధ్య అక్కడక్కడా బాటసారులైన ప్రజలు సేదతీరడానికి వీలుగా చిన్న చిన్న విశ్రాంతి గృహాలు నిర్మిద్దాం,'' అన్నాడు మణిశర్మ.
 
ఆ మాట విన్న మహారాజు, ‘‘చక్కగా చెప్పావు, మణిశర్మా! నీటి బుడగలాంటి జీవితం మరెంతకాలం ఉంటుందో చెప్పలేము కదా? ప్రజోపయోగకరమైన పనులను వెంటనే ప్రారంభించాలి. ఉత్తర దిశగా ప్రవహిస్తున్న భవతారిణి నదికీ, నగరానికీ మధ్య ఉన్న సువిశాల ప్రదేశంలో సుందరవనం కోసం మొక్కలు నాటేపనులు వెంటనే ప్రారంభించండి,'' అన్నాడు పరమానందంతో.
 
రాజుగారి అభీష్టానుసారం మంత్రి మణిశర్మ ఆధ్వర్యంలో మరునాడే మొక్కలు నాటే పనులు ప్రారంభమయ్యూయి. ఆ తరవాత యేడాది తిరిగే సరికి రాజు మరణించడంతో, మిగిలిన ముగ్గురు మంత్రులూ మహారాజుకు ఇచ్చిన మాట ప్రకారం, వనంమధ్య పాలరాతితో స్మారక మందిరం నిర్మించి, రాజుగారి బంగారు విగ్రహం ప్రతిష్ఠించారు.
 
సంవత్సరాలు దొర్లిపోయూయి. కాలప్రవాహంలో మంత్రులు కూడా కాలధర్మం చెందారు. క్రమేణా స్మారక మందిరం శిథిలావస్థకు చేరుకున్నది. రాజుగారి బంగారు విగ్రహం ఎప్పుడో దొంగిలించబడింది. మణులు మాణిక్యాలు పోయినచోటు తెలియలేదు.
 
మణిశర్మ నాటించిన సుందరవనం మాత్రం ఇంకా కళకళలాడుతూ ఉంది. ఆయన అక్కడక్కడ నిర్మించిన చిన్న చిన్న విశ్రాంతి గృహాలు బాటసారులకు నీడనిస్తూ ఉన్నాయి. తమ మీది బరువులుదించి, అలసట తీర్చుకోవడానికి పనికి వచ్చేలా బాటల పక్కన నాటించిన తెల్లబండలు, శ్రమజీవులకు ఇంకా సేద తీరుస్తూనే ఉన్నాయి. సుందరవనంలోని పువ్వులూ, పళ్ళూ వాడుకుంటూ చుట్టు పక్కల ప్రజలు రాజు శివవర్మ తోటను ఇంకా స్మరించుకుంటూనే ఉన్నారు!

No comments:

Post a Comment