Pages

Wednesday, September 19, 2012

లోకం తీరు

బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు కృష్ణద్వైపాయనుడనే ధనిక బ్రాహ్మణుడుగా కౌశాంబీ నగరంలో జన్మించాడు. ఆయన లౌకిక వాంఛలవల్ల కలిగే అనర్థాలను గుర్తించి, సన్యాసం అవలంబించి, యాభై ఏళ్ళపాటు హిమాలయ పర్వతాలలో తపస్సు చేసుకుంటూ గడిపాడు.

అటుపైన కృష్ణద్వైపాయనుడు హిమాలయాలను వదిలి, తీర్థయాత్రలు చేస్తూ కాలక్రమాన కాశీరాజ్యానికి వచ్చాడు. అక్కడ ఆయనకు బాల్యమిత్రుడొకాయన, మాండవ్యుడు అనేవాడు, ఒక గ్రామంలో కనిపించి ఆతిథ్యం ఇచ్చాడు. మాండవ్యుడు కృష్ణద్వైపాయనుణ్ణి తన వద్దనే ఉండమని కోరాడు; ఆయన నిమిత్తం చక్కని పర్ణకుటీరం ఒకటి కట్టించి, ఆయన అవసరాలన్నిటినీ తాను యథావిధిగా తీర్చుతూ వచ్చాడు.

ఒకనాడు, మాండవ్యుడి కుమారుడు, యజ్ఞదత్తుడనేవాడు, బంతితో ఆడుతూ ఉండగా ఆ బంతి వెళ్ళి ఒక పాము పుట్టలో పడింది. యజ్ఞదత్తుడు బంతి తీసుకోవటానికై పుట్టలో చెయ్యిపెట్టాడు. వాడి చేతిని పాము కరిచింది. త్వరలోనే పాము విషం వంటికి ఎక్కి యజ్ఞదత్తుడు స్పృహ లేకుండా పడిపోయాడు.

తమ కుమారుడు ఈ స్థితిలో పడి ఉండగా మాండవ్యుడూ, ఆయన భార్యా వాణ్ణి చూశారు. మాండవ్యుడు తన కుమారుణ్ణి కృష్ణద్వైపాయనుడి కాళ్ళముందు పడుకోబెట్టాడు.

‘‘మీ తపశ్శక్తిచేత వీణ్ణి బతికించి మాకు పుత్రభిక్ష పెట్టండి!’’ అని ఆ దంపతులు ప్రాథేయపడ్డారు. కృష్ణద్వైపాయనుడికి ఏమి చెయ్యాలో అసలు తోచలేదు. ‘‘నేను అంతకాలం తపస్సు చేశానేగాని, ఆ తపస్సు సిద్ధించలేదు. కనీసం నాకు మందూ మాకులూ అయినా తెలీవు. నేను మీ పిల్లవాణ్ణి ఎలా బతికించగలను?’’ అన్నాడు.


‘తపస్సు సిద్ధించకపోయినా అంతకాలం చేసిన తపస్సుకు ఫలితం ఉండక పోదు. మీరు సత్యప్రమాణం చెయ్యండి, కురవ్రాడు తప్పక బతుకుతాడు!’’ అన్నాడు మాండవ్యుడు.

కృష్ణద్వైపాయనుడు ఇందుకు సమ్మతించి, ఈ కింది శ్లోకం చదువుతూ సత్య ప్రమాణం చేశాడు.
‘‘సత్తాహం ఏవాహం ప్రసన్నచిత్తో
పుంజ్ఞత్థికో ఆచరిం బ్రహ్మచరియం!
ఆధాపరం యం చరితం మమయిదం
వస్యాని పంజ్ఞాస సమాధికాని
అకామకో వా హి  అహం చరామి!
ఏతేన సచ్చేన సువత్థి హోతు!
హతం, విసం, జీవతు యంజ్ఞదత్తో!

(నేను పుణ్యం కోరినవాణ్ణి అయి వారం రోజులపాటు నిర్మల చిత్తంతో బ్రహ్మచర్యం అవలంబించాను. తరవాత నేను యాభై ఏళ్ళపాటు చేసిన తపశ్చర్య చిత్తశుద్ధితో చేసినది కాదు. నేను చేసే ఈ సత్యప్రమాణం ఫలితంగా మేలు కలిగి, విషం విరిగి, యజ్ఞదత్తుడు పూర్ణజీవుడౌ గాక!)

వెంటనే కురవ్రాడి వక్షస్థలం నుంచి కొంత విషం బయటికి వచ్చి నేలలో ఇంకిపోయింది. వాడు, ‘‘అమ్మా!’’ అని మూలిగి, పక్కకు ఒత్తిగిలి తిరిగి మైకంలో పడిపోయాడు.

‘‘చూశావు గదా? విషం పూర్తిగా లాగి వెయ్యటం నాకు సాధ్యం కాలేదు. నువ్వు కూడా సత్యప్రమాణం చేసి చూడు, ఫలితం ఉండవచ్చు,’’ అని కృష్ణద్వైపాయనుడు మాండవ్యుడితో అన్నాడు.

మాండవ్యుడిందుకు ఒప్పుకుని ఈ విధంగా సత్యప్రమాణం చేశాడు.

‘‘యస్కా దానం న అభినందిం కదాచి
దిరవానాహం  అతిథింవా సకాలే
న చాపి మే అప్పియం అలేదుం
బహుస్సుతా సమణా బ్రాహ్మణాచ
అకామకో వా హి అహం దదామి,
ఏతేన సచ్చేన సువత్థి హోతు,
హతం  విసం, జీవతు యంజ్ఞదత్తో.’’

(నేను అతిథులను సత్కరించానుగాని, అది ఇష్టంతో కాదు. జ్ఞానులైన శ్రమణులూ,  బ్రాహ్మణులూ నా ఆతిథ్యం ఇష్టం లేకుండా  చేసినదేనని తెలుసుకోలేకపోయారు. నేను దానాలు కూడా ఇష్టం లేకుండానే చేశాను. నేను చేసే ఈ సత్యప్రమాణం ఫలితంగా మేలు కలిగి, విషం విరిగి, యజ్ఞదత్తుడు పూర్ణజీవుడౌ గాక!


మాండవ్యుడు ఈ విధంగా సత్యప్రమాణం చెయ్యగానే యజ్ఞదత్తుడి వీపు నుంచి మరికొంత విషం బయటికి వచ్చి నేలలో ఇంకిపోయింది. కురవ్రాడు లేచి కూచోగలిగాడు గాని, నిలబడలేక పోయాడు. అప్పుడు మాండవ్యుడు తన భార్యకేసి తిరిగి ఇలా అన్నాడు. ‘‘నువ్వు కూడా సత్యప్రమాణం చెయ్యరాదా? కురవ్రాడు లేచి ఎప్పటిలాగా తిరగగలుగుతాడు.’’

‘‘నేను ప్రకటించవలిసిన సత్యం కూడా ఉన్నది గాని, దాన్ని మీ ముందు ప్రకటించటానికి వీలులేదు,’’ అన్నది మాండవ్యుడి భార్య విచారంగా.

‘‘పిచ్చిదానా, ఎందుకు సందేహిస్తావు? మన కురవ్రాడికన్న ఎక్కువేమిటున్నది? సత్యప్రమాణం చెయ్యి,’’ అన్నాడు మాండవ్యుడు. తన భార్యను ప్రోత్సహించాడు.

ఆమె అందుకు ఒప్పుకుని ఈ విధంగా సత్యప్రమాణం చేసింది:

‘‘అసో విసో తాత పహూత తేజో
యే తం అదట్టి పతరా ఇదచ్చి,
తస్మించ మే అప్పియతాయ అజ్జ
పితరి చతే నత్థి కోచి విసేసో,
ఏతేన సచ్చేన సువత్థి హోతు,
హతం విసం, జీవతు యంజ్ఞదత్తో.’’

నాయనా, ఇవాళ నిన్ను ఆ పుట్టలో నుంచి కాటువేసిన విషసర్పాన్ని చూస్తే నాకెంత అసహ్యమో, నీ తండ్రిని చూసినా అంత అసహ్యమే. నాకు ఈ ఇద్దరిలో తేడా ఏమీ కనిపించ లేదు. నేను చేసే ఈ సత్యప్రమాణం ఫలితంగా మేలు కలిగి, విషం విరిగి, యజ్ఞదత్తుడు వెంటనే పూర్ణజీవుడౌ గాక!

ఈ సత్యప్రమాణంతో యజ్ఞదత్తుడి శరీరంలో నుంచి విషం పూర్తిగా బయటికి వచ్చి నేలలో ఇంకిపోయింది. వాడు లేచి ఎప్పటిలాగే ఆడుకోసాగాడు.

మాండవ్యుడు కృష్ణద్వైపాయనుడి కేసి తిరిగి, ‘‘స్వామీ, మీరు ఉత్తమోత్తమమైన తపస్వి జీవితాన్ని స్వీకరించి కూడా దాన్ని ఇష్టం లేకుండా సాగించటానికి కారణమేమిటి?’’ అని అడిగాడు.


అందుకు కృష్ణద్వైపాయనుడు, ‘‘దానికి ఒకటే కారణం. ఒకసారి సన్యసించి వెళ్ళిపోయినవాడు తిరిగి సంసారంలోకి అడుగు పెడితే అందరూ హేళనచేసి, మూఢుడని నిందిస్తారు! అందుచేత, ఆ జీవితం నాకు ఇష్టం లేకపోయినప్పటికీ అందరూ నన్ను గౌరవంగా చూడగలందులకై నేను తపస్విగానే ఉండిపోయాను! మరి నువ్వు అతిథి అభ్యాగతులకు ఇంత ఘనంగా ఆతిథ్యం ఇస్తావుగదా, ఆ పని అయిష్టంగా చెయ్యటానికి కారణమేమిటి?’’ అని అడిగాడు.

‘‘నా తాతా, తండ్రీ జగత్ప్రసిద్ధి పొందిన దాతలు. అందుచేత నేను కూడా వారి మార్గమే అనుసరించవలిసి వచ్చింది.
వారి కీర్తికి కళంకం తెచ్చానని జనం నన్ను ఆడిపోసుకోకుండా ఉండగలందులకై నేను వితరణగా దాన ధర్మాలు చేశాను; నాకు వాటియందు ఏ మాత్రమూ ఇష్టం ఉండి కాదు,’’ అని జవాబు చెప్పి, మాండవ్యుడు తన భార్య కేసి తిరిగి, ‘‘పసితనంలోనే నాకు భార్యవై నా ఇంటికి వచ్చావు. ఇన్నేళ్ళుగా నాతో కలిసి కాపురం చేశావు. నాపైన ప్రేమాభిమానాలు లేని ఈ జీవితం నీకెంతో రోత పుట్టించి ఉండాలి. దానిని మౌనంగా ఎందుకు సహించావు?’’ అని అడిగాడు.

దానికి మాండవ్యుడి భార్య, ‘‘మన వంశంలో స్ర్తీ తన భర్తతో కాపురం చెయ్యటం విధి గనక ఈ జీవితం భరించాను. నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయి మరొక భర్తను కట్టుకున్నట్టయితే లోకమంతా నన్ను కులటగా భావించి ఉండేది. మన అబ్బాయి క్షేమం కోరి మాత్రమే నేనీ విషయం బయటపెట్టాను!’’ అన్నది.

‘‘నిజం చెప్పినందుకు నేను నిన్ను తప్పుపట్టను. ఇకముందు నిన్ను ప్రేమతో చూస్తానని ప్రమాణం కూడా చేస్తున్నాను!’’ అన్నాడు మాండవ్యుడు తన భార్యతో.

‘‘నువ్వు దానాలు చెయ్యదలిస్తే ఇష్టంతోనే చెయ్యిగాని, ఇష్టం లేకుండా లోకానికి భయపడి చెయ్యకు. నేను కూడా ఇక మీదట ఈ తాపసి జీవితం మనస్ఫూర్తిగా సాగిస్తాను!’’ అంటూ కృష్ణద్వైపాయనుడు మాండవ్యుడి వద్ద సెలవు పుచ్చుకుని, తన దారిన తాను వెళ్ళిపోయాడు.



No comments:

Post a Comment