Pages

Wednesday, September 19, 2012

బంగారు నెమలి

 బోధిసత్వుడు ఒకప్పుడు, బ్రహ్మదత్తుడి కాశీ రాజ్యంలో ఒక నెమలిగా జన్మించాడు. అది మామూలు అన్ని నెమళ్ళ వంటిది కాదు. అపురూపమైన బంగారు నెమలి! అది దండకారణ్యంలో విహరిస్తూ ఉండేది.

ఒకనాడు కాశీరాజు భార్య పట్టమహిషికి ఆ బంగారు నెమలి కలలో కనబడగా, అది కావాలని ఆమె భర్తతో చెప్పింది. రాజు మంత్రులను అడిగాడు. వారు బ్రాహ్మలకు తెలుస్తుందన్నారు. బ్రాహ్మల నడగితే వారు వేటగాళ్ళకు తెలుస్తుందని చెప్పారు.

రాజు దండకారణ్యానికి సమీపంలో వుండే ఒక వేటగాణ్ణి రప్పించి, ‘‘ఫలాని బంగారు నెమలిని జీవాలతో తీసుకువస్తే గొప్ప బహుమానం ఇస్తాను,’’ అని చెప్పాడు. వేటగాడు అంగీకరించి వరుసగా ఏడేళ్ళు మాటు వేశాడు. కానీ, నెమలి వలలో పడలేదు. వేటగాడు చనిపోయాడు. నెమలిని కోరిన ఆ మహారాణి కూడా చచ్చిపోయింది.

‘‘కలలో కనబడిన ఒక నెమలి కోసం బెంగపట్టుకుని, నా రాణి మరణించటమా!’’ అని రాజుకు కోపం  వచ్చింది. అప్పుడాయన, ‘‘దండకారణ్యంలో బంగారు నెమలి సంచరిస్తూ వుంది. దాని మాంసం తిన్న వాళ్ళకు జరామరణాలు ఉండవు,’’ అంటూ ఒక ప్రకటన కోటగుమ్మం ముందు వేలాడగట్టించాడు.

ఆ రాజు తదనంతరం యువరాజు మళ్ళీ ఇంకో వేటగాడిని బంగారు నెమలి కోసం పంపించాడు. లాభం లేకపోయింది. ఇలా ఆరు తరాలు గడచిపోయినై.

 ఏడవసారి గద్దె ఎక్కిన రాజు కూడా ఆ ప్రకటన చూసి, వేటగాడిని పంపాడు.  వేటగాడు యుక్తిగా ఆ నెమలిని పట్టివేసి  కాశీరాజుకు అప్పగించాడు.


ఆ బంగారు నెమలిని చూడగానే రాజుకు ఆశ్చర్యం కలిగి, గౌరవభావం ఏర్పడింది. దాని కోసం ఎత్తయిన ఒక సింహాసనం తన పక్కన వేయించాడు.  అప్పుడు నెమలి రూపంలో ఉన్న బోధిసత్వుడు, ‘‘రాజా! నన్నెందుకు పట్టించి ఇక్కడికి  తెప్పించావు?’’ అని అడిగాడు.

‘‘నీ మాంసం తింటే జరామరణాలు ఉండవని  చెబుతున్నారు,’’ అన్నాడు రాజు.

‘‘అంటే, నన్ను చంపవలసిందేకదా?’’ అని ప్రశ్నించాడు బోధిసత్వుడు.

‘‘అవును,’’ అన్నాడు రాజు.

‘‘పిచ్చివాడా! నాకే మరణం నిజమైతే నా మాంసం తిన్నవాళ్ళకు మరణం లేకపోవడం ఏమిటి?’’ అని మళ్ళీ ప్రశ్నించాడు బోధిసత్వుడు.

‘‘నీది అపురూపమైన బంగారు చాయ. కనుక, నీ మాంసం తిన్నవాళ్ళకు ఆ చాయ వస్తుందనీ, వాళ్ళకు చావు ఉండదనీ మా తండ్రి చెప్పాడు,’’ అన్నాడు.

‘‘అయితే రాజా! నాకీ బంగారు చాయ వచ్చిన కారణం చెబుతా విను: ఒకప్పుడు నేనీ రాజ్యానికే మహారాజుగా ఉండేవాడిని . నేను న్యాయంగా పాలించి ధర్మం నిలబెట్టినందుకు ఫలితంగా ఈ జన్మలో బంగారు నెమలిగా పుట్టాను,’’  అని చెప్పాడు బోధిసత్వుడు.  కాశీ రాజు విస్తుపోయి, ‘‘ఏమిటీ, ధర్మ పరిపాలనకు ఫలితమా ఇది! నీ మాటకు రుజువేమిటి?’’ అని అడిగాడు.

‘‘లేకేమి?  నేను మహారాజుగా ఉన్న కాలంలో ఒక నవరత్న ఖచితమైన దివ్యరథం మీద  విహారం చేసేవాణ్ణి. అది ఉద్యానవనంలో కొలను పక్కన పూడ్చబడి ఉన్నది,’’ అన్నాడు బోధిసత్వుడు.

కాశీరాజు ఆ ప్రకారం కొలనుపక్కన తవ్వించగా దివ్యరథం కనిపించింది! ఆనాటి నుంచి రాజు బోధిసత్వుణ్ణి తన గురువుగా ఎంచుకున్నాడు.

No comments:

Post a Comment