Pages

Wednesday, September 19, 2012

పడబుద్ధి

బహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ‘వేదభం' అనే మహామంత్రంలో సిద్ధి పొందాడు. గ్రహాలన్నీ కూటమయ్యే సమయంలో, ఆకాశంవంక చూస్తూ ఆ మంత్రాన్ని పునశ్చరణ చేసినట్టయితే, సరాసరి ఆకాశం నుంచిబంగారు, వెండి, ముత్యం, పగడం, రత్నం, కెంపు, నీలం-ఈ ఏడు వస్తువులూ వర్షిస్తాయి. మంత్రసిద్ధి గల ఆ బ్రాహ్మణ్ణి ఆశ్రయించి బోధిసత్వుడు, ఆయనకు ప్రియశిష్యుడయ్యూడు.
ఒక రోజున శిష్యుణ్ణి వెంటబెట్టుకుని గురువు అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ అరణ్యంలో ఐదువందలమంది గజదొంగలున్నారు. వాళ్ళు గురు, శిష్యులిద్దరినీ అటకాయించారు. ఐతే, ఆ దొంగలలో చిత్రమైన నియమం ఒకటి వున్నది. ఇద్దరు బాటసారులు కలిసి ఆ త్రోవన వచ్చినట్టయితే ఇంటికిపోయి శిక్షారుసుము తెచ్చి తోటివాడిని విడిపించుకోవటానికి అవకాశ మిచ్చి, అందులో ఒకడిని వదిలేస్తారు.
ఆ వచ్చిన బాటసారులు తండ్రీ, కొడుకులైతే తండ్రిని పోయి రమ్మని చెప్పి, రుసుము తెచ్చి కొడుకును విడిపించుకునేటందుకు అవకాశ మిస్తారు. అలానే, తల్లీ కూతురూ ఐతే తల్లినీ, సోదరులైతే అందులో ఒకణ్ణీ, గురు శిష్యులైతే శిష్యుణ్ణీ-ఇలా వదిలిపెట్టడం వాళ్ళకు మామూలు. ఇప్పుడా వింతదొంగలు బ్రాహ్మణ్ణి తమవద్ద అట్టేపెట్టుకుని, శిష్యుడైన బోధిసత్వుణ్ణి పోయి రమ్మని పంపించారు. వెళ్ళేటప్పుడు బోధిసత్వుడు గురువుకు నమస్కరించాడు. ‘‘గురువర్యా! భయపడకండి. ఒకటి రెండు రోజులలో తప్పక తిరిగి వచ్చేస్తాను.

ఐతే, నా మనవి మటుకు ఒక్కటి వినండి: ఇవాళ గ్రహాలన్నీ కూటమయ్యే రోజు. కొంపతీసి ఇవాళ మాత్రం మంత్రం జపించి రత్నాలవర్షం రప్పించకండి. అలా చేశారంటే మీకూ, ఈ దొంగలకూ కూడా తీరని ముప్పు కలిగి తీరుతుంది,�� అని మరిమరి చెబుతూ, బోధిసత్వుడు బయలుదేరి వెళ్ళాడు. సూర్యాస్తమయం అయింది. దొంగలు వచ్చి బ్రాహ్మణ్ణి పట్టుకున్నారు. పుచ్చ పువ్వులాటి వెన్నెల కిరణాలను వెదజల్లుతూ పున్నమిచంద్రుడు ఆకాశాన తిరుగుతున్నాడు.
బ్రాహ్మడు పైకి చూసి, గ్రహాలు కూటమయ్యే సమయం వస్తుందని పసికట్టాడు. ��దొంగల బారిని పడి, చేతకానివాడిలాగా ఈ హింసలన్నీ ఎందుకు నేననుభవించాలి? చేతిలో వున్న మంత్రాన్ని పఠించి, కనక వర్షం రప్పించి, దొంగల రుసుము వాళ్ళకిచ్చేసి, విడుదలవుతాను. స్వేచ్ఛ పొంది సుఖంగా వుంటాను,�� అనుకున్నాడు. తరవాత బ్రాహ్మడు ఆ దొంగల గుంపును చేరబిలిచాడు. ��మీరు నన్నెందుకు బంధించారు చెప్పండి!�� అన్నాడు.
��అయ్యూ, ఇంకెందుకు? డబ్బు కోసం!�� అన్నారు వాళ్ళు. ��అంతేకదా! అలా ఐతే నేను చెప్పినట్టు చేయండి, మీరు కోరిన ధనం ఇస్తాను. ముందు నా కట్లు విప్పెయ్యండి. నాకు శుభ్రంగా స్నానం చేయించండి. నూతన వస్త్రాలు కట్టబెట్టండి. పుష్పజాతులన్నీ తెచ్చి ఇక్కడ పోగుపోయండి. నా చుట్టూ పరిమళ ద్రవ్యాలూ, ధూప దీపాదులకు కావలసిన సామగ్రులూ అమర్చిపెట్టండి. అటుపైన ఏం జరుగుతుందో చూడండి!�� అని బ్రాహ్మడు చెప్పాడు. అక్షరాలా ఆ బ్రాహ్మడు చెప్పిన ప్రకారమే చేశారు దొంగలు.
తరవాత ఆయన అదును చూసి, ఆకాశం వంక దృష్టి నిలిపి, వేదభ మంత్రం ఉచ్చరించాడు. వెంటనే విలువ గల లోహాలూ, మణులూ వర్షించినై! దొంగలు గబగబా వాటన్నిటినీ ఏరి మూటలు కట్టుకొని వాళ్ళ దారిని వాళ్ళు పోయూరు. వాళ్ళ వెనకనే బ్రాహ్మడూ వెళుతున్నాడు. ఆ సమయంలో మధ్యదారిలో మరి ఒక దొంగల గుంపు తారసపడి, మొదటి గుంపును ఎదుర్కొన్నది.

ఎందుకయ్యూ, మీరు మమ్మల్ని పట్టుకుంటారు? అని అడిగారు మొదటి దొంగలు. అందుకు రెండవ గుంపు, ఇంకెందుకు, డబ్బుకోసం! అన్నారు. అంతేకదా! డబ్బుకోసమే ఐతే, ఈ బ్రాహ్మణ్ణి ఆశ్రయించండి. ఈయన ఆకాశం పైకి చూస్తే చాలు, విలువ గల రత్నాలూ, మణులూ వర్షిస్తాయి. అలా చేసే మాకు ఈ ధనమంతా ఇచ్చాడు, అని చెప్పి వాళ్ళు తప్పించుకుపోయూరు. ఇప్పుడు రెండవ దొంగలజట్టు బ్రాహ్మణ్ణి వదలక పట్టుకుంది.
మాకు కూడా ధనమియ్యవయ్యూ, బ్రాహ్మడా! అని వాళ్ళు బొబ్బలు పెట్టి పీడించసాగారు. అందుకు బ్రాహ్మడు, అయ్యలారా! ఇందాక ఆ దొంగలకు నేనిచ్చింది మంత్రమహిమవల్ల రప్పించిన ధనం. నేను నేర్చిన మంత్రానికి మళ్ళీ ఒక యేడాదికి గాని శక్తి కలగదు. ఇది నా ఇష్టం వచ్చినప్పుడల్లా జపించితే పని చేసే మంత్రం కాదు. దీనికంతా గ్రహకూటం కలియడం అదీ, చాలా గొడవ వున్నది. దానివల్ల ఇప్పటికి ప్రయోజనం కలగదు కనుక, ఒక్క ఏడాది అయ్యే సరికి, గ్రహాలు కూటమవుతై; అప్పుడు నా మంత్రం జపించి, మీకు కనకవర్షం కురిపిస్తాను, అన్నాడు.
బ్రాహ్మడి మాటలు నమ్మలేదు దొంగలు. మాకంటే ముందు వచ్చిన వాళ్ళను ఇట్టే కుబేరులను చేసి పంపావే, మేం అడిగితే ఏడాదివరకూ కనిపెట్టుకు ఉండమంటావా, అబద్ధాలకోరా! అంటూ పదునైన కత్తి పుచ్చుకుని బ్రాహ్మణ్ణి నిలువునా రెండు ముక్కలుగా చీల్చి వేశారు! అతని కళేబరాన్ని దారి మధ్యలో వేలాడదీశారు. ఆ తరవాత గబగబా పరుగులెత్తిపోయి మొదటి దొంగల జట్టును కలిసి, అందరినీ చంపి, వాళ్ళదగ్గిర వుండే ధన ద్రవ్యాలను అపహరించారు.
అపహరించిన ధనం వాటాలు తెగలేదు. ఈ రెండవ జట్టు దొంగలలో రెండు కక్షలు ఏర్పడినై. ధనంకోసం రెండు కక్షలవాళ్ళూ పోరాడుకున్నారు. పోరాటంలో మొత్తం ఒక వంద మంది నరుక్కుచావగా చివరకు ఇద్దరే ఇద్దరు మిగిలారు. ఇలా మిగిలిన దొంగలిద్దరూ ధనాన్నంతటినీ సమీపంలోని ఒక అరణ్యంలో దాచిపెట్టారు. అందులో ఒకడు విచ్చుకత్తులతో ఆ ధనానికి కాపలా కాస్తూ వుండగా, రెండవవాడు తినుబండారాలు తేవటానికని దాపున వున్న ఊళ్ళోకి వెళ్ళాడు.

ధనాగారం వద్ద కూర్చున్న దొంగ, ��నా నేస్తం వస్తే, అయూచితంగా ఈ ధనంలో సగభాగం కబళించుకుపోతాడే, ఎలా?�� అనే ఆలోచనతో కుమిలిపోసాగాడు. అక్కడ తినుబండారాలు తీసుకురావటానికి వెళ్ళిన ఆ దొంగ, ��వాడు చస్తే ఆ ధనమంతా నాకే ఉండిపోతుందిగా! కుబేరుడినయిపోవచ్చుకదా!�� అని అనుకొని, తనవంతు పదార్థాలు కేటాయించుకుని, తక్కిన భాగంలో విషం కలిపివేశాడు.
వాడు పదార్థాలు చేతపట్టుకొని తన బసచేరుకునేసరికల్లా ఆ రెండవ దొంగ వీడి పీకతెగవేసి, కళేబరం దూరంగా విసిరి వేశాడు! తరవాత విషం కలిసిన తినుబండారాలు తిని, చివరకు వాడూ ప్రాణాలు విడిచాడు! ఈ విధంగా బ్రాహ్మడూ, బ్రాహ్మడితో పాటు దొంగలూ అంతా, కలిసి మొత్తంగా చచ్చి వూరుకున్నారు. ఒకటి రెండు రోజులలో బోధిసత్వుడు దొంగల కీయవలసిన రుసుము చేత పట్టుకు వచ్చాడు.
గురువుకోసం చూశాడు. గురువు కానరాలేదు. ఎక్కడ చూసినా ధనమే! ఎక్కడ చూసినా కళేబరాలే! అప్పుడిలా అనుకున్నాడు బోధిసత్వుడు, ��ఈ బ్రాహ్మడు నా మాట చెవిని పెట్టలేదు. తనకు తోచినంతా చేశాడు. మొన్నటి రోజున ఈ బ్రాహ్మడు మంత్రం జపించి, రత్నాలవర్షం రప్పించే వుంటాడు. దాని ఫలితంగానే అందరూ చచ్చివుంటారు,�� అని తలిచి, బాటవెంబడే చూసుకుంటూ పోసాగాడు.
కొంత దూరంలో గురువుగారి కళేబరం కనిపించింది. ��అయ్యో! గురువర్యా, నా మాట విన్నావు కాదుకద! ఎంతటి దుర్గతి పాలయ్యూవు!�� అంటూ అతను వాపోయూడు. చితుకులు పోగుచేసి తెచ్చి గురువుకు దహనాది క్రియలు సలిపాడు. అడవిపువ్వులు పట్టుకువచ్చి ఆ స్థలమందు వుంచి, భక్తిపూర్వకంగా తుదిసారి నమస్కరించాడు.
అక్కడినుంచి ఇంకా అలా అలా వెళ్ళగా మొదటి దొంగల జట్టులోని కొందరి శవాలూ కంటపడినై. మరి కొంత దూరంలో రెండవ జట్టులో వుండే దొంగల కళేబరాలు పడివున్నయి. రెండు తప్ప, బోధిసత్వుడికి తను చూసివున్న అందరి కళేబరాలూ లెక్కకు సరీగా కనిపించినై.

ఐతే ఆ ఇద్దరూ ఎక్కడికి తప్పించు కుపోయూరా అని ఆలోచించాడు. వాళ్ళు ధనం దోచుకుపోయిన జాడ కనిపెట్టి, ఆ దారినే వెళ్ళగా ఆ దారి బోధిసత్వుణ్ణి ఒక కీకారణ్యంలోకి తీసుకుపోయింది. ఆ అరణ్యంలో ధనం మూటలు కనిపించినై. తప్పిపోయూరనుకొన్న ఇద్దరు దొంగల లోనూ ఒకడి కళేబరం కనిపించింది. ఐతే వాడి పక్కన తినుబండారాలు గల పాత్ర వున్నది. ��ఓహో, ఇదా సంగతి!�� అని అనుకొన్నాడు బోధిసత్వుడు.
ఇంకా నాలుగడుగులు వేసే సరికి ఒక మూల ఆ మిగిలివున్న దొంగ కళేబరం వేలాడదీయబడి వున్నది. ఇంకిప్పుడు ఎవరూ చెప్పనక్కరలేకుండానే జరిగిన సంగతి అంతా బోధిసత్వుడికి మొదటి నుంచి చివరివరకూ అవగాహనై పోయింది. ఇదంతా చూసి బోధిసత్వుడు చాలా విచారించాడు. ��నా మాట పాటించాడు కాదు గురువుగారు. అంతగా చెప్పి పోయినా, పెడచెవిని పెట్టాడు. ఆత్మబుద్ధి సుఖమనుకున్నాడు.
ఇందుకు ఫలితం? తనూ నాశనమయ్యూడు, తనతో పాటు చాలా మంది జనమూ చావటానికి కారకుడయ్యూడు. వివేకవంతుల మాట వినక, తమకు తోచిందే మంచిదని అనుకొని పనులు చేసేవాళ్ళకు ఇటువంటి శాస్తిజరిగే తీరుతుంది. ��నా గురువుగారు తన మంత్ర మహిమ వల్ల భూలోకానికి రప్పించిన ధనసంపద మానవకోటికి ఉపకృతి చేయలేదు సరికదా, పైగా సంఘాత మరణానికీ, అంతులేని వినాశానికీ దారి తీసింది.
కనుక, బుద్ధి వక్రమార్గాన్ని పట్టినప్పుడు మంచి వస్తువులవల్ల కూడా కీడే కలుగుతుంది. దోషం వస్తువులో లేదు, బుద్ధిలో వుంది. వక్రబుద్ధి అగ్నిజ్వాల వంటిది. అది ఒకళ్ళ నాశనంతో పోదు. మరి ఎంతమందినో నాశనం చేస్తేగాని ఆ అగ్ని చల్లారదు,�� ఈ బోధలను బోధిసత్వుడు అరణ్యమంతా మారుమోగేటట్టు ప్రబోధించాడు.
తన గురువుగారిని ఉదాహరణగా చూపి, అందరకూ నచ్చేటట్టు చెప్పాడు. బోధిసత్వుడి ప్రబోధానికి వనదేవతలు జేజేలు కొట్టారు. అటు తరువాత ఆ ధన సంపదనంతటినీ బోధిసత్వుడు తన ఆశ్రమానికి తీసుకుపోయి, అదంతాలోకోపకారం కోసం వినియోగించి, అవతారం చాలించాడు.

No comments:

Post a Comment