Pages

Wednesday, September 19, 2012

మరుగుజ్జు

బహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మడికి కుమారుడుగా జన్మించాడు. అతడు చాలా పొట్టివాడు కావటంచేత అందరూ అతన్ని మరుగుజ్జు అని పిలిచేవాళ్ళు. అతడు చిన్నతనంలోనే తక్షశిలకు వెళ్ళి అక్కడ ఒక గురువు వద్ద విలువిద్య నేర్చుకుని, యుక్త వయస్కుడయ్యేసరికి, ఆ విద్యలో గొప్ప ప్రవీణుడయ్యాడు.

ఆ తరవాత మరుగుజ్జుకు విలువిద్యతోనే  పొట్టపోసుకోవాలన్న కోరిక కలిగింది. ఆ కారణంగా అతడు చాలాదేశాలు తిరిగి, ఎందరో రాజులను సందర్శించి, తాను విలువిద్యా ప్రవీణుడినని చెప్పి, కొలువులోకి తీసుకోమని కోరాడు. కాని అతడు పొట్టివాడు కావటం మూలాన ఎవరూ అతన్ని కొలువులోకి తీసుకోలేదు.

ఉద్యోగం సంపాదించటానికి ఏమి చెయ్యాలో, తన విద్యను ఏ విధంగా ఉపయోగపరుచుకోవాలో తెలియక సతమతమయ్యాడు. ఒకనాడు ఈవిషయంగా తీవ్రంగా ఆలోచిస్తూ మరుగుజ్జు ఒక గ్రామంలోని నేతకార్మికుల వీధి గుండా పోతూ ఉండగా, అతనికి ఆజానుబాహు వొకడు మగ్గం మీద పనిచేస్తూ కనిపించాడు. మరుగుజ్జు ఆ మనిషిని సమీపించి, ‘‘నీ పేరేమిటి?’’ అని అడిగాడు.

 ‘‘నా పేరు భీమసేనుడు,’’ అని చెప్పాడు ఆ ఆజానుబాహుడు.

‘‘ఇంత ఒడ్డూ పొడుగూ ఉన్నావు. ఇంత గొప్ప పేరు పెట్టుకున్నావు. నేత చేసేటంత కర్మమేం వచ్చింది నీకు?’’ అని మరుగుజ్జు అడిగాడు.

‘‘నేనేం చెయ్యను? పూట గడవాలి కదా. బట్టలు నేయటం తప్ప నాకింకే పనీ చేతకాదు!’’ అన్నాడు భీమసేనుడు. ‘‘పుష్కలంగా సంపాదించుకునే ఉపాయం చెబుతాను. నా వెంట వస్తావా?’’ అని మరుగుజ్జు అడిగాడు.


 భీమసేనుడు ఒప్పుకుని మరుగుజ్జు వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి ప్రయాణం చేసి కొద్ది రోజులలో కాశీ రాజ్యం చేరారు.

‘‘నీవు రాజుగారి వద్దకు వెళ్ళి, విలువిద్యలో గొప్పవాణ్ణని చెప్పుకుని, ఉద్యోగం అడుగు. నీ ఒడ్డూ పొడుగూ చూసి వెంటనే ఉద్యోగం ఇస్తారు,’’ అని మరుగుజ్జు భీమసేనుడితో అన్నాడు.

‘‘మరి నాకు విలువిద్య రాదే. అబద్ధం ఎలా చెప్పను? రేపు అసలు విషయుం తెలిస్తే అపాయం కదా?’’ అన్నాడు భీమసేనుడు.

‘‘నీకు రాకపోతే ఇబ్బంది లేదు. నాకా విద్య బాగా వచ్చు. నన్ను నీ భటుడిగా వేసుకో. అవసరమైనప్పుడల్లా నేను నీకు సహాయపడుతుంటాను, నీకు ఎలాంటి భయమూ వద్దు,’’ అని మరుగుజ్జు ధైర్యం చెప్పాడు.

ఆ ప్రకారమే భీమసేనుడు కాశీరాజు వద్దకు వెళ్ళి, తాను గొప్ప విలుకాడినని చెప్పి, సులువుగా కొలువు సంపాదించాడు. అతని జీతం పక్షానికి వెయ్యి రూపాయులు. మరుగుజ్జు అతని కింద భటుడిగా చేరాడు.

ఇంతలో కాశీ నగరానికి సమీపాన గల అడవులలో ఉండే పెద్దపులి ఒకటి రహదారి కాసి దారేపొయ్యే మనుషులను చంపనారంభించింది.

ఈ సంగతి తెలియగానే రాజుగారు భీమసేనుణ్ణి పిలిచి, ఫలానా చోట ఒక పెద్దపులి ఉండి దారే పోయేవారిని భయపెడుతున్నదనీ, ఆ పెద్దపులిని చంపిరమ్మని ఉత్తరువిచ్చాడు.
భీమసేనుడు అందుకు అంగీకరించి, మరుగుజ్జు వద్దకు వచ్చి, ‘‘ఇప్పుడు నాకీ బెడద వచ్చి పడింది. నేను ఆ పెద్దపులిని ఎలా చంపగలను? ఈ గండం తప్పే ఉపాయం చెప్పు!’’ అన్నాడు.

‘‘నేను చెప్పినట్టు విను. పులిని నువ్వు ఒక్కడివే చంపలేవు. ఊరి బయటికి వెళ్ళగానే పల్లెటూళ్ళ జనాన్ని రెండు వేల మందిని పోగుచేసుకుని పులి వచ్చే చోటికి వెళ్ళు. పులి అరుపు వినగానే నువ్వు ఏ పొదలోనన్నా దూరి దాక్కో. నీ వెంట వచ్చిన జనం పులిని చంపేస్తారు. పులి చచ్చినదాకా దాగి ఉండి, ఆ తరవాత లత ఒకటి తెంచుకుని ఇవతలికి వచ్చెయ్యి. ఆ తరవాత పులి చచ్చిపోవటం చూసి కోపం తెచ్చుకో! ‘దీనిని ఈ లతతో కట్టి రాజుగారి దగ్గరికి ప్రాణాలతో తీసుకుపోయి నా ప్రజ్ఞ చూపించుతామనుకున్నాను. దాన్ని చంపటానికైతే మీరంతా దేనికి? నేను చాలనా?


ఈ పులిని చంపిన వాళ్ళెవరో చెప్పండి, వాళ్ళకి శిరశ్ఛేదం చేయిస్తాను?’ అని కేకలు పెట్టు. జనం దడుసుకుని, పులిని చంపింది మేము కాదంటే మేము కాదంటారు. అప్పుడు నువ్వు తిరిగి వచ్చి రాజుగారితో పులిని నువ్వే చంపినట్టు చెప్పవచ్చు. నువ్వు చెప్పే మాట నిజం కాదని చెప్పటానికి అక్కడి జనంలోని వారెవ్వరూ సాహసించరు!’’ అని మరుగుజ్జు ఉపాయం చెప్పాడు.

భీమసేనుడు అక్షరాలా మరుగుజ్జు చెప్పినట్టే చేశాడు. పెద్దపులిని గ్రామస్థులంతా కలిసి చంపుతుంటే భీమసేనుడు పొదల మధ్య దాగి ఉండి, అది చచ్చినాక ఒక లత చేతబట్టి బయటికి వచ్చి, తను అలా వెళ్ళిన సమయంలో పులిని చంపేసినందుకు గ్రామస్థుల మీద ఎగిరి పడ్డాడు. దాన్ని చంపిన వాళ్ళ తలఎగిరి పోతుందన్నాడు. గ్రామస్థులంతా భయుపడి ఎవరి దారిన వారు జారుకున్నారు.

తరవాత భీమసేనుడు నగరానికి తిరిగి వెళ్ళి, రాజును దర్శించి, ‘‘మహారాజా, తమ ఆజ్ఞప్రకారం పెద్దపులిని చంపేశాను. ఇక రహదారిన ప్రయాణం చేసే ప్రజలకు ఆ క్రూరమృగం వల్ల ఎట్టి భయమూ లేదు!’’ అని విన్నవించాడు.

రాజుగారు భీమసేనుడి పరాక్రమానికి చాలా సంతోషించాడు. భీమసేనుడి ఖ్యాతి రెట్టింపయింది. అందరూ అతన్ని ప్రశంసించే వాళ్ళే. ఈ ప్రశంసలు వింటూ భీమసేనుడు తాను నిజంగా మహావీరుణ్ణి అయిపోయాననుకుని, తనకు బంటుగా ఉన్న మరుగుజ్జును చిన్నచూపు చూడసాగాడు.

ఇది, మరుగుజ్జు గ్రహించాడు గాని, అంతగా పట్టించుకోలేదు. ఇలా ఉండగా కాశీరాజ్యం మీదికి ఒక శత్రురాజు దండెత్తి వచ్చి, నగరాన్ని తన సైన్యాలతో చుట్టుముట్టి, ‘‘లొంగి పోతారా? లేక యుద్ధం చేస్తారా?’’ అని దూతల ద్వారా కబురు చేశాడు.

రాజుగారు భీమసేనుణ్ణి పిలిచి, ‘‘అవసరమైన బలాలను తీసుకుని శత్రువును జయించి రా!’’ అని ఆజ్ఞాపించాడు. అతనికి కవచం తొడిగి, విల్లు బాణాలు చేతికిచ్చి, ఒక ఏనుగుపై ఎక్కించి యుద్ధరంగానికి పంపారు.

భీమసేనుడికి ప్రమాదం జరగబోతుందని మరుగుజ్జుకూ తెలుసు. తాను కూడా విల్లూ, బాణాలూ ధరించి భీమసేనుడి వెనకగా ఏనుగు మీద కూచున్నాడు. చుట్టూ అశ్వదళమూ, పదాతిదళమూ నడుస్తూండగా ఏనుగు యుద్ధభూమికి గంభీరంగా కదిలి వెళ్ళింది.

శత్రుసేనలు బారులు తీర్చి ఎదురుగా నిలబడి ఉండటం చూడగానే భీమసేనుడికి  దడపుట్టుకొచ్చింది, ముచ్చెమటలు పోశాయి, కాళ్ళూ చేతులూ చల్లబడ్డాయి. అతను ఏనుగు మీది నుంచి కిందికి జారి తప్పించుకోవాలని చూశాడు. సమయానికి మరుగుజ్జు అతన్ని పట్టుకుని ధైర్యం చెప్పి, ఏనుగుకు కట్టివెయ్యక పోయినట్టయితే భీమసేనుడు గుర్రాల కాళ్ళ కింద నలిగి దారుణంగా చచ్చిపోవలసినవాడే!

ఇంత జరిగాక, మరుగుజ్జు తానే నాయకత్వం తీసుకున్నాడు. అతను ఏనుగును అదిలించి సుడిగాలిలాగా శత్రుసేనల మధ్య జొరబడి, శత్రువులపై బాణాల వర్షం కురిపిస్తూ, సూటిగా శత్రురాజును సమీపించాడు. అతని ధాటికి శత్రుబలాలు చిందర వందర అయ్యాయి. కొద్ది సేపట్లో శత్రురాజు గాయపడి, ఓడిపోయి, మరుగుజ్జుకు ఖైదీగా చిక్కాడు.
మరుగుజ్జు యుద్ధరంగం నుంచి విజయుడై తిరిగి రాగానే రాజుగారికి నిజమైన విలుకాడెవరో తెలిసిపోయింది. ఆయన మరుగుజ్జును సేనానాయకుడుగా నియమించాడు. మరుగుజ్జు భీమసేనుడికి అంతులేని కానుకలిచ్చి పంపేశాడు.


No comments:

Post a Comment