Pages

Wednesday, September 19, 2012

మద్యపాన ఫలితం

బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో, బోధిసత్వుడు పండితవంశంగా ప్రసిద్ధిగాంచిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తనకు ఇరవైఏళ్ళ వయసు వచ్చేవరకూ సర్వశాస్త్రాలూ చదివి, మహాపండితుడన్న ఖ్యాతి గాంచాడు.

ఆయనకు తల్లిదండ్రులు వివాహం చేయచూశారు. కాని, బోధిసత్వుడు అందుకు అంగీకరించక సన్యసించి హిమాలయ పర్వతాలకు పోయి, ఒక సుందర ప్రదేశంలో ఆశ్రమం నిర్మించుకుని ఉండసాగాడు.

ఒకసారి బోధిసత్వుడు వానాకాలం నాలుగు నెలలూ శ్రావస్తిలో గడిపి, శిష్యులతో భద్రవతి అనే గ్రామం చేరాడు. అక్కడికి కోసుదూరంలో ఒక నదీ, అంబ తీర్థమనే ప్రసిద్ధ స్థలమూ వున్నవి. ఆయన ఆ తీర్థం కేసి శిష్యులతో బయలుదేరాడు. ఆ తీర్థం ఒడ్డున ఒక ముని ఆశ్రమమూ, ఆ ఆశ్రమంలో అంబకతీర్థిక అనే మహా విషసర్పమూ వున్నవి. ఇది తెలిసిన గ్రామవాసులు బోధిసత్వుడికి అక్కడికి వెళ్ళ వద్దని సలహా ఇచ్చారు. ఆయన అది వినీ విననట్టు ఊరుకున్నాడు.

ఆయన శిష్యుల్లో సాగతస్థవిరుడనే వాడొకడున్నాడు. అతడు మంత్రశాస్త్రంలో ఆరితేరినవాడే గాక, అసామాన్య ధైర్యశాలి. అతడు తతిమ్మావాళ్ళ నుంచి వేరుపడి ముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయంలో ముని లేడు. సాగతస్థవిరుడు ఆశ్రమంలో ప్రవేశించి, ఒకచోట తుంగచాప పరుచుకుని కూర్చున్నాడు. ఆ వెంటనే మహా భయంకరాకారంలో వున్న విషసర్పం అతడి ముందుకు వచ్చి బుస్సుమంటూ పడగవిప్పింది. సాగతస్థవిరుడు ఏమాత్రం జంకక, ‘‘నువ్వేనా, అంబకతీర్థిక అనే నీటి పామువి?’’ అన్నాడు.


ఆ ప్రశ్న వింటూనే సర్పం పెద్దగా బుసలు కొట్టడం ప్రారంభించింది. దాని నోట్లో నుంచి నల్లనిపొగలు లేచినై. స్థవిరుడు కూడా మంత్రశక్తితో తన నోట్లో నుంచి పొగలు వెలువరించాడు. ఆ వెంటనే సర్పం నోటినుంచి అగ్నిజ్వాల లేచింది. స్థవిరుడు తన నోటినుంచి అగ్నిజ్వాల లేపాడు.

ఈ విధంగా నాలుగైదు నిమిషాల కాలం స్థవిరుడూ, విషసర్పం తమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించుకున్నారు. స్థవిరుడి నిర్భయత్వం గమనించిన సర్పం, ఇక చేసేదిలేక తల వాల్చి వెనక్కు తిరిగింది. స్థవిరుడు దాని తోక పట్టుకుని వెనక్కు లాగాడు. ‘‘అంబకతీర్థికా, ఇక్కడ తీర్థమాడవచ్చిన యాత్రికులు చాలామంది, నీ కాటుకు మరణించారని, నాకు తెలుసు!’’ అంటూ స్థవిరుడు విషసర్పం కోరలు పీకి, దాన్ని ప్రాణాలతో వదిలాడు.

ఇది జరిగిన పక్షం రోజుల తర్వాత బోధిసత్వుడు భద్రవతి నుంచి కోశాంబీ నగరానికి వెళ్ళాడు. స్థవిరుడు మహా సర్పాన్ని కోరలు పీకి వదిలిన సంగతి గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ మారు మోగి పోయింది. కోశాంబీవాసులు బోధిసత్వుడికి ఘనంగా స్వాగతం ఇచ్చి, ఒక పెద్ద ఉద్యానంలో నివాసం ఏర్పాటు చేశారు. ఆ మర్నాటి ఉదయం కొందరు నగర వాసులు బోధిసత్వుడి దర్శనం చేసుకుని. కొందరు సహాధ్యాయులతో ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుని వున్న స్థవిరుడి వద్దకు పోయి, నమస్కరించి, ‘‘మీరు ఎక్కడో దూరాన హిమాలయాల్లో నివసించేవారు. అక్కడ మీరు కోరిన వస్తువులు దొరకడం దుర్లభం. అలాంటి వేమైనా వుంటే మాకు చెప్పండి. తక్షణం తెచ్చి ఇవ్వగలం,’’ అన్నారు.


స్థవిరుడు జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. అప్పుడు శిష్యుల్లో ఇద్దరు, ‘‘అయ్యలారా, మాకు పారావతమద్యం తాగాలని వున్నది. అది ఇంతవరకూ మాకు ఎక్కడా లభించలేదు. ఆ మద్యం తయారు చేసి పంపండి,’’ అన్నారు.

నగరవాసులు అందుకు ఒప్పుకుని, మధ్యాహ్నం లోపల పారావతమద్యం తయారు చేసి, ఒక గృహస్థు ఇంట్లో దాచి, స్థవిరుణ్ణి వెంటబెట్టుకు పోయారు. స్థవిరుడు పారావతమద్యం తాగడం ప్రారంభించి క్రమంగా కైపు తలకెక్కడంతో లేచి, పిచ్చివాడిలా మాట్లాడుతూ గంతులేస్తూ నగరద్వారం కేసి పరిగెత్తి, అక్కడ పడిపోయాడు. వెంట వున్న సహాధ్యాయులు అతణ్ణి భుజాల మీద వేసుకుని బోధిసత్వుడి దగ్గిరకు తెచ్చి, ఆయన పాదాలముందు తల వుండేలా పడుకోబెట్టారు.

అయితే, స్థవిరుడు తూలుతూ కోపంగా లేచి, బోధిసత్వుడి వైపుకు పాదాలుచాచి పడుకున్నాడు. బోధిసత్వుడు చిరునవ్వు నవ్వి, శిష్యులతో,  ‘‘అంబతీర్థంలో మహా విషసర్పాన్ని లొంగదీసినదెవరు?’’ అన్నాడు. ‘‘స్థవిరుడు!’’ అన్నారు వాళ్ళు. ‘‘ఇప్పుడా స్థవిరుడు బురదపామునైనా లొంగతీయగలడా?’’ అని బోధిసత్వుడు అడిగాడు. ‘‘లొంగతీయలేడు,’’ అన్నారు శిష్యులు.

అప్పుడు బోధిసత్వుడు, ‘‘ఈ అనుభవాన్ని మరిచిపోకండి! మద్యపానం దేహానికి మైకమేకాదు, బుద్ధిభ్రమ కూడా కలిగిస్తుంది. ఈ నాటి నుంచి ఎవరూ మద్యపానం చేయరాదని నియమం పెడుతున్నాను,’’ అన్నాడు. మద్యపాన మైకం నుంచి తేరుకున్నాక స్థవిరుడు బోధిసత్వుడి కాళ్ళ మీద పడి దుఃఖించసాగాడు. ఆయన వాణ్ణి లేవనెత్తి, మద్యపానం వల్ల కలిగే దుష్ఫలితాలు వివరించి చెప్పాడు.


No comments:

Post a Comment