Pages

Wednesday, September 19, 2012

రాతికింద జల

పూర్వం కాశీరాజ్యాన్ని బ్రహ్మదత్తుడు ఏలేటప్పుడు బోధిసత్వుడు సార్థవాహకుల వంశంలో పుట్టాడు. అతను పెరిగి పెద్ద వాడై, వర్తక వ్యాపారాలలో ఆరితేరాడు. అయిదువందల బళ్ళతో దూర ప్రాంతాలకు వెళ్ళి వర్తకం చేసేవాడు.
ఒకసారి అతని బిడారు ఎడారి ప్రాంతం చేరింది. ఆ ఎడారి అరవై యోజనాల నిడివిగలది. అందులోని ఇసుక చాలా సన్ననిది, గుప్పిట పట్టుకుంటే వేళ్ళ సందులనుంచి జారిపోతుంది. ఆ ప్రదేశం రాత్రిపూట చల్లగా ఉంటుంది, కాని సూర్యోదయం అయినది మొదలు క్రమంగా వేడెక్కి, భగభగా మండే కుంపటిలాగా అయిపోతుంది. పట్టపగలు ఆ ఎడారిలో నడవటం సాధ్యం కాదు. అందుచేత ప్రయాణీకులు ఎడారి దాటేదాకా తమకు అవసరమైన బియ్యమూ, నూనే, వంట చెరకూ, నీరూ బళ్ళలో తీసుకుని, రాత్రి పూటనే ప్రయాణం చేస్తారు. సముద్రం మీద ప్రయాణం చేసే నావికుల లాగే ఈ ఎడారి ప్రయాణీకులు నక్షత్రాల సహాయంతో తాము ఎటుపోతున్నదీ తెలుసుకుంటారు. తెల్లవార వస్తూండగా వాళ్ళు ప్ర…యాణం చాలించి, బళ్ళను వల…యాకారంగా నిలబెట్టి, మధ్య మంటపం లాగా అమర్చి, దాని మీద చాందినీలాటిది కట్టి, పొద్దెక్కకుండానే త్వరత్వరగా వంటా, భోజనాలూ ముగించి, తిరిగి పొద్దువాలేదాకా నీడపట్టున విశ్రాంతి తీసుకుంటారు.
బోధిసత్వుడు ఇలాగే ప్రయాణంచేస్తూ దాదాపు ఎడారి దాటాడు. ఇంకా ఒక్క యోజనం ప్ర…యాణం మాత్రమే మిగిలి ఉన్నది. ఆ రాత్రి ఆ యోజనమూ దాట వచ్చుననుకుని, అతను సా…యంకాలం బ…యలుదేరే ముందు, తన సేవకులచేత వంటచెరుకూ, నీరూ పారేయించాడు. ఈ విధంగా బరువు తగ్గించు కుంటే ప్ర…యాణం మరింత చురుకుగా సాగుతుంది.

అన్నిటికన్న ముందు ఉండే బండిలో దారి నిర్ణయించేవాడు ఉంటాడు. అతను రాత్రంతా మేలుకుని వుండి, నక్షత్రాల గమనాన్ని జాగ్రత్తగా చూస్తూ, ముందు బండి ఎక్కడ ఎటుపోవాలో కేకవేసి చెబుతూ ఉంటాడు.
కాని ఈసారి అతను నిద్రచాలక, బడలి ఉండటం చేత నిద్రపోయాడు. ఎడ్లు తోలేవాడు లేక, అదుపు తప్పి, వచ్చినదారే పట్టాయి.
అరుణోద…యం అవుతూండగా అతను నిద్రలేచి, నక్షత్రాలను గమనించి, బళ్ళు వెళ్ళవలసినదారికి ఎదురుదిక్కుగా, అంటే వచ్చిన దిక్కుకే, పోతున్నట్టు తెలుసుకుని, ‘‘బళ్ళను వెనక్కుతిప్పండి!'' అని గట్టిగా కేక పెట్టాడు.
బళ్ళు వెనక్కు తిరిగాయి, కాని జరగవలసిన పెద్ద ప్రమాదం జరిగిపోనే పోయింది.
తెల్ల వారేసరికి బిడారు కిందటి సాయంకాలం బ…యలుదేరిన చోటనే ఉన్నది. నీరు మాత్రం లేదు! మళ్ళీ బళ్ళు వలయాకారంగా అమర్చి. జరిగిన పొరబాటుకు విచారిస్తూ, నిస్పృహతో మనుషులందరూ బళ్ళకింద చతికిలబడ్డారు.
అందరిలాగా తాను కూడా అధైర్య పడితే అందరూ చచ్చిపోవటం తథ్యం.అందుకని బోధిసత్వుడు ఆ చల్లటివేళ అటూ, ఇటూ తిరుగుతూ, నీటిజాడ కోసం అమిత శ్రద్ధగా చూస్తూ, ఒక చోట గుబురుగా పెరిగిన దర్భల దుబ్బు చూశాడు. కింద ఎక్కడో నీరు లేకపోతే అక్కడ ఆ దుబ్బు మొలవదు!

బోధిసత్వుడు మనుషులను పంపి పలుగు తెప్పించి, ఒక కురవ్రాడి చేత దుబ్బువున్న ప్రదేశాన తవ్వించాడు.
ఎంతో కష్టపడి అరవైమూరల లోతు తవ్వినాక పలుగుకు కంగుమని రాయి తగిలింది. దాంతో అందరి ప్రాణాలూ ఉసూరుమన్నాయి.
కాని బోధిసత్వుడికి మాత్రం రాతి కింద నీరు ఉండి తీరుతుందని గట్టి నమ్మకం. అతను గుంటలోకి దిగి, రాతికి చెవి పెట్టి ఆలకించాడు. రాతికి దిగువగా ప్రవహిస్తున్న నీటి చప్పుడు వినిపిస్తున్నది.
అతను గుంటలో నుంచి పైకి వచ్చి, ‘‘బాబూ, మనం ఇప్పుడు నిరాశపడి కాళ్ళు బారజాచామంటే, అందరం చచ్చిపోతాం. నువ్వు కిందికి దిగి, దీక్షగా ఆ రాతిని పగల గొట్టాలి. దానికింద నీరున్నది. అది పైకి వచ్చిందంటే అందరం బతికిపోతాం!'' అన్నాడు.
బోధిసత్వుడు ప్రకటించిన విశ్వాసం మరెవ్వరికీ లేదు. అయినా అతను చెప్పాడు గదా అని, కురవ్రాడు గోతిలోకి దిగి, ఇనపగూటంతో శక్తి కొద్దీ రాతిని కొట్టాడు. చివరకు రాయి పగిలింది. దాని కింద అణగి ఉన్న నీరు తాడిప్రమాణాన, ఉవ్వెత్తుగా పైకిలేచింది.
అందరికీ పోతున్న ప్రాణాలు తిరిగి వచ్చినట్టయింది. అందరూ దాహం తీర్చుకుని, స్నానాలు చేశారు. మరీ పాతబడిన బండి చక్రాలు నరికి, వంట చెరుకుగా ఉపయోగించి, వంటలు చేసి, భోజనాలు చేశారు. పశువులకు మేతా, నీరూ పెట్టి, సాయంకాలం అయినదాకా విశ్రాంతి తీసుకుని, రాత్రికాగానే తిరిగి ప్రయాణమై పోతూ, నీరు పడినచోట ఒక ధ్వజస్తంభం నీరున్నట్టు గుర్తుగా పాతి, తెల్లవారేలోపల ఎడారి దాటి గమ్యస్థానం చేరారు.
వారి సరుకులు మూడింతల ధరకు అమ్ముడు అయాయి. ఖర్చులుపోగా న్యాయమైన లాభం మిగిలింది. బోధిసత్వుడు కొన్నాళ్ళకు తన స్వస్థానానికి తిరిగి వచ్చి, వర్తకం మీద సంపాదించిన దానితో దానధర్మాలు చేస్తూ సుఖంగా జీవించాడు.

No comments:

Post a Comment