Pages

Sunday, September 16, 2012

దొరికిన దొంగ

రుద్రపూరు రాజైన జయపాలుడి భార్య రూపమతి వద్ద అపురూపమైన గులాబీ రంగు ముత్యాలహారం ఉండేది.అది అంటే ఆమెకు అమితమైన అభిమానం.

జయపాలుడు అదృష్టవంతుడు.అతని భార్య రూపమతి అందగత్తె.వారి కొడుకు శక్తిపాలుడు పదేళ్ళవాడు-వాడుకూడా అందగాడే.అతని ప్రజలు రాజంటే అభిమానం గలవారు.రాజ్యం సుభిక్షం.

ఒకనాడు జయపాలుడు సపరివారంగా వేటకు వెళ్ళాడు.మధ్యాన్నం దాకా వేట చక్కగా సాగింది.కాని మిట్ట మధ్యాన్నం అందరూ విశ్రాంతి తీసుకునే సమయంలో అతిదారుణమైన తుపాను వచ్చిపడింది.వేటకని తెచ్చిన ఏనుగులూ, గుర్రాలూ వశం తప్పాయి.రాజు ఎక్కిన రథం ఒక చెట్టుకు తగలటం వల్ల దాని చక్రం ఒకటి చిన్నాభిన్నమయింది.వెంటనే జయపాలుడు ఒక గుర్రం ఎక్కాడు.అది అదుపు తప్పి, చిత్తం వచ్చినట్టు, దారీ తెన్నూ లేకుండా పరిగెత్తసాగింది. తక్కువ ఎత్తులో ఉన్న ఒక చెట్టుకొమ్మ రాజు నుదురుకు బలంగా తగిలి రక్తం కార సాగింది. అతను కిందపడిపోయి, కాలినడకన ఒక వాగు వద్దకు వచ్చాడు. ధారాపాతంగా కురిసే వానకు వాగు పొంగసాగింది. రాజుకు ఈత వచ్చును గాని,రక్తం పోవటం వల్ల బలం తరిగిపోయి, అతను ఆ వాగు వెంబడి కొట్టుకుపోతూ, స్పృహ కోల్పోయాడు.

అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి అతని తల కొద్దిగా నొచ్చుతున్నది.అతనొక రాళ్ళతో కట్టిన ఇంట ఉన్నాడు. ఒక చక్కని ఆడపిల్ల సాధారణ దుస్తులు ధరించి, అతని కాళ్ళు ఒత్తుతున్నది.

అతను కళ్ళు తెరవటంచూసి ఆమె తృప్తితో నవ్వి, "తిరిగి ప్రపంచంలో పడ్డావన్న మాట!నాలుగు రోజులుగా నిన్ను గురించి చాలా ఆదుర్దా పడ్డాం. మా రేవులో నువ్వు కనిపించినప్పుడు కొసప్రాణంతో ఉన్నావు. నువ్వు ఇప్పుడున్నది సోన్ పూర్ అరణ్యానికి రాజైన ఫకీరా రాజభవనంలో. నేను రాజ వైద్యుడి కూతురును. నా పేరు మంజరి. నువ్వు పూర్తిగా కోలుకొనటానికి కనీసం ఒక నెల పట్టుతుంది.మా తండ్రి ఇచ్చే మూలికలతో నీ ఆరోగ్యం చక్కబడుతుంది.నీకు కావలసినది చూడటానికి నేను అహర్నిశలు నీ వద్దనే ఉంటాను. నువ్వు ఎవరో మాకు తెలియలేదు. నువ్వు ఎవరో నీ పేరేమిటో తెలిసినట్టయితే నీ దగ్గిర వాళ్ళకు తెలిపి ఉండే వాళ్ళం," అన్నది.

మంజరి తండ్రీ, ఫకీరా వచ్చారు.

"నీ వాలకాన్ని బట్టి మంచి వంశానికి చెందినవాడివని గ్రహించాం. నువ్వు ఎవరో చెబితే నిన్ను మీ ఇంటికి చేర్చుతాం," అన్నాడు ఫకీరా.

తన అసలు వివరాలియ్యటం అపాయకరమని శంకించి జయపాలుడు, "మా తండ్రి విక్రమపూరుకు చెందిన ఒక వర్తకుడు.నేను పనిమీదపోతూ, దారిలో ఉపద్రవానికి గురి అయ్యాను," అన్నాడు.

వాళ్ళు అతని మాటలు నమ్మారు. మంజరి రోజు రోజుకూ అతనికి మరింత సన్నిహితురాలవుతున్నది.ఆమె చేసే సేవలకు అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.ఆమె రుణం ఎలా తీర్చుకోవాలో అతనికి తెలియలేదు.తాను ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలంటే తనకు సహాయపడగలది మంజరి ఒకతే. ఆమె అతన్ని గాఢంగా ప్రేమించినట్టు అనేక నిదర్శనాలు కనపడినాయి.అయితే, తాను తప్పించుకు పోయినాక మంజరి అపాయానికి గురి అవుతుంది.మంజరికి అభ్యంతరంలేని పక్షంలో అతను ఆమెను తన వెంట రుద్రపురానికి తీసుకుపోవాలి.తాము వివాహం ఆడటానికి రూపమతి,పరిస్థితులను పాటించి, అభ్యంతరం చెప్పదు.

జయపాలుడు స్వస్తుడయ్యాక మంజరితో, "నాకు వేరే జీవితం ఉన్నది.ఇక్కడి మీ జీవితంలో ఇమడటం నాకు సాధ్యం కాదు.నేను వెళ్ళిపోవాలి.అందుకు నీ సహాయం కావాలి. నేను వెళ్ళిపోయాక, నింద నీ పై మోపుతారు.నీకు ఎలాంటి శిక్షపడుతుందో నాకు తెలియదు," అన్నాడు.

"నన్ను చిత్రవధ చేస్తారు. అయితే ఆ శిక్షను నేను చాలా సంతోషంగా అనుభవిస్తాను. నువ్వంటే నాకెంతో ఇష్టం. నువ్వు నీ వాళ్ళతో సుఖంగా ఉండటమే నాకు కావలిసింది," అన్నది మంజరి.

"నేను పశువును కాను. నేనూ నిన్ను ఇష్టపడుతున్నాను. నువ్వుకూడా నా వెంట మా దేశానికి రా. నా పెద్ద భార్య అముమతితో, మా ఆచారం ప్రకారం, నేను నిన్ను పెళ్ళాడుతాను నీకు అభ్యంతరమా, మంజరీ?" అని జయపాలుడు అడిగాడు.

అందుకు మంజరి సంతోషంగా ఒప్పుకున్నది.

ఒక చీకటి రాత్రి ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళు రుద్రపురం చేరినమీదట జయపాలుడు, "నీతో ఇంతకాలమూ చెప్పనందుకు క్షమించు,మంజరీ, నే నీ రుద్రపురానికి రాజును," అన్నాడు.

"తెలియకనేనేదైనా అపచారం చేసి ఉంటే క్షమించండి," అన్నది మంజరి.

రూపమతి అయిష్టంగానే అనుమతించిన మీదట జయపాలుడికీ, మంజరికీ వివాహం జరిగింది.

మంజరి నాగరిక పద్ధతులు ఎరిగినది. రాజభవనంలో ఆమె అందరినీ ఆదరంతో చూసింది. రాజుకొడుకు శక్తిపాలుడు ఆమెకు చాలా మాలిమి అయ్యాడు. ఆమె అతన్ని సొంత కొడుకులాగే చూసుకున్నది.తన స్థాయికన్న రాజభవనంలో మంజరి స్థాయి పెరిగిపోవటం చూసి రూపమతి అసూయతో దహించుకుపోసాగింది. ఒక రోజు ఆమె నిద్ర లేస్తూనే తన ముత్యాలహారం ఎవరో తీశారని ఆందోళన లేవదీసింది. ఆ నేరం ఎలాగైనా మంజరి మీదికి తోయాలని ఆమె ఉద్దేశం.

రాణిగారి హారం పోయిందనగానే కాపలా వాళ్ళు కంగారుపడ్డారు. కాని మంజరి, "నేను దొంగను పట్టేస్తాను. నేను అడవి నుంచి వచ్చినదాన్ని కదా! మాకు అనేక మంత్రశక్తులున్నాయి. దొంగను పట్టుకునే ముందు నా మంత్రశక్తులు ప్రదర్శిస్తాను. అందరూ రాజభవనం చావడిలోకి రావాలి," అన్నది.

ఆరోజు మధ్యాన్నం తన భర్తతో ఆమె పథకం ఒకటి చెప్పింది.అపరాహ్ణం చావడి జనంతో నిండిపోయింది. కళ్ళకు గంతలు కట్టుకుని మంజరి అక్కడికి వచ్చింది. రాజు ముందు పెద్ద బల్ల మీద అనేక వస్తువులు చిన్నవీ, పెద్దవీ పాతిక దాకా ఉంచబడ్డాయి. మంజరి కోరిన ప్రకారం రాజకుటుంబానికి చెందిన వారు ఒక్కొక్కరే వచ్చి ఒక్కొక్క వస్తువును తాకారు. ఒక వస్తువును ఎవరైనా తాకినప్పుడు రాజు, "మంజరీ, తాకిన వస్తువు ఏది? కోడిగుడ్డా, గొడుగా, లోటా?" అని అడిగాడు.

"లోటా," ఆనది మంజరి, అది నిజమే. మరొకసారి, "మంజరీ, తాకిన వస్తువు ఏది? విసనకర్రా, సంచీయా, లోటా, కోడిగుడ్డా, సిరాబుడ్డియా, కొవ్వొత్తా, ఈకా...?" అని అడిగాడు.

"కొవ్వొత్తి!" అన్నది మంజరి, అదీ నిజమే.

ఈ విధంగా మంజరి ప్రతిసారీ నిజం చెప్పింది. అందరూ ఆమె శక్తిచూసి ఆశ్చర్య పడ్డారు.

"రేపు సాయంకాలం లోపల పోయిన హారం దొరక్కపోతే దొంగను పట్టేస్తాను. ఇంత కన్న బలమైన శక్తులు నాకున్నాయి," అన్నది మంజరి.

ఆ సాయంకాలం రూపమతి మంజరి వద్దకు రహస్యంగా వెళ్ళి, "మన భర్త మీద ప్రమాణం చేసి రహస్యం దాస్తానంటే నీకో మాట చెప్పలి," అన్నది. "అలాగే ప్రమాణం చేస్తాను.చెప్పు," అన్నది మంజరి.

"నన్ను క్షమించు, సోదరీ. నేనే దొంగను.అసూయకొద్దీ నీ మీద దొంగతనం మోపాలని చూశాను.నా తప్పు తెలిసివచ్చింది. నీలాటి దొడ్డబుద్ధిగల మనిషి మీద అసూయపడటం అవివేకం," అన్నది రూపమతి. ఇద్దరూ కౌగిలించుకుని ఆనందబాష్పాలు రాల్చారు.

మంజరి చేసిన ఇంద్రజాలానికి ఆధారం ఏమిటి? ఎవరన్నా ఒక వస్తువు తాకినప్పుడు రాజు వస్తువులను పేర్కొంటూ అసలు వస్తువు పేరు చెప్పే ముందు ఒక నల్లని వస్తువును చెప్పేటట్టు ముందుగా ఏర్పాటు జరిగింది.ఆ ప్రకారం రాజు లోటాకు ముందు గొడుగు పేరూ, కొవ్వొత్తికి ముందు సిరాబుడ్డి పేరూ చెప్పాడు.

తన ముత్యాలహారం దొరికినట్టు రూపమతి ప్రకటించింది. 

No comments:

Post a Comment