Pages

Sunday, September 16, 2012

నిక్కచ్చి మనిషి

విష్ణుపురంలో వున్న శకారుడనే భాగ్యవంతుడికి కొన్ని నియమాలున్నాయి.ఆ ప్రకారం,ఆయన ఏరోజైనా,అడిగినవారికి వీలైనంతలో ధనసాయం చేస్తాడు; ఒక్క శుక్రవారం తప్ప.ప్రాణం మీదికొచ్చినా, తన కోసం అప్పు చెయ్యడు.నియమాలను పాటించడంలో ఖచ్చితంగా వుంటాడని,తెలిసినవాళ్ళాయన్ను నికచ్చి మనిషి అంటారు.

ఆ ఊళ్ళోనే శకారుడి బాల్య స్నేహితుడు జోగిరాజు వుంటున్నాడు.ఒకప్పుడు బాగా బ్రతికిన ఆయనకు, కొంత కాలంగా అటు వ్యాపారంలోనూ,ఇటు వ్యవసాయంలోనూ ఏదీ కలిసిరాక వున్న ఇంటినీ,పొలాన్నీ తాకట్టు పెట్టాడు. పరిస్థితులిలాగే కొనసాగితే, ఓ ఏడాదిలో తన బ్రతుకు వీధిన పడుతుందని బెంగపెట్టుకున్నాడాయన.మిత్రుడు శకారుడి నడిగితే,అవసరానికి తననాదుకుంటాడని,ఆయనకు తెలుసు.ఐతే,అభిమానధనుడైన జోగిరాజు,తన సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకాలనుకున్నాడే తప్ప,ఎవర్నీ దేహీ అనే ఉద్దేశంలోలేడు.

అలాంటి సమయంలో ఆ ఊరుకు సుదర్శనుడనే త్రికాలవేది వచ్చి,ఆలయ ప్రాంగణంలో విడిది చేశాడు.ఊరివాళ్ళాయన్ను కలుసుకుని తమ ఇబ్బందులు చెప్పుకుంటే,సుదర్శనుడు దివ్యదృష్టితో భవిష్యత్తులోకి చూసి,వారికి తరుణోపాయం చెబుతున్నాడు.

జోగీరాజు కూడా ఆయనకు తన కష్టాలు చెప్పుకోగా, "నువ్వు దేవుణ్ణి నమ్ముతావు.కానీ ఇంతవరకూ దైవకార్యాలకు ఒక్క దమ్మిడీ కూడా ఖర్చు చేయలేదు.అదే నీ కష్టాలకు కారణం.నమ్మకమున్న చోట వితరణ కూడా వుండాలి.నువ్వు ఓ శుక్రవారం నాడు,నూరు వరహాలు విలువ చేసే దేవుడి కంచుబొమ్మను డబ్బిచ్చి కొని,పూజామందిరంలో ప్రతిష్ఠించి పూజించు. మర్నాడా విగ్రహాన్ని ఎవరికైనా లాభానికి అమ్మగలిగితే, నీకు దశ తిరిగిపోతుంది," అన్నాడు సుదర్శనుడు

ఇది జోగిరాజుకు పక్కనేవున్న శకారుడికి నచ్చలేదు.ఆయన సాధువుతో, "స్వామీ! పూజామందిరంలో వుండే కంచువిగ్రహాల ధర రెండు వరహాలకు మించదు.ఆ తర్వాత,అప్పటికే ఒకసారి అమ్ముడు పోయిన ఆ బొమ్మనింకా హెచ్చు ధరకు కొనే వాళ్ళుంటారా? కాబట్టి తమరు,నా మిత్రుడికి వేరేదైనా సులభ మార్గం ఉపదేశించమని కోరుతున్నాను," అన్నాడు.

సుదర్శనుడు నవ్వి, "నాయనా! దైవలీలలు విచిత్రాలు. ఈ విషయమై ఇన్ని సందేహాలు వెలిబుచ్చిన నీవే,నీ మిత్రుడికి అన్నింటా సాయపడతావేమో! ఎవరు చూడొచ్చారు?" అన్నాడు.

అందుకు శకారుడు, "నా మిత్రుడికి డబ్బు అప్పివ్వగలనేమో కానీ,చిన్న కంచు విగ్రహాన్ని నూరు వరహాలిచ్చికొనే అవివేకాన్ని మాత్రం ప్రోత్సహించను," అన్నాడు.

ఆ మాటలు విని జోగిరాజు హతాశుడై,తనకు అదృష్ట యోగం లేదనే అనుకున్నాడు.తర్వాత సుదర్శనుడు,ఆ ఊరి నుంచి వెళ్ళిపోయాడు.

ఒకనాటి మిట్టమధ్యాహ్న సమయంలో ఎండఫెళ్ళునకాస్తూంటే,శకారుడు,ఆయన భార్య చారుమతి వేడి భరించలేక పెరట్లోకి వచ్చి,మామిడిచెట్టు నీడలో కూర్చున్నారు.అప్పుడెవరో కొత్తవాడు వస్తే,పనివాడు వెళ్ళి పెరటి తలుపు తీసి అతణ్ణి, యజమాని వద్దకు తీసుకువచ్చాడు. ఆ వచ్చినవాడు శకారుడికి నమస్కరించి,మంచి నీళ్ళు కావాలని సైగ చేశాడు.చారుమతి చప్పున లోపలకు వెళ్ళి, ఓ లోటాతో నీళ్ళు తెచ్చి ఇచ్చింది.అతడు గటగటా నీళ్ళు తాగి, శకారుడితో, "నా పేరు మాల్యుడు.నా వృత్తి వ్యాపారం.ఒంటెద్దు బండిలో దేశమంతా తిరుగుతూ వివిధ ప్రాంతాల్లో లభించే విలక్షణమైన వస్తువులుకొని,ఒక ప్రాంతానివి మరో చోట అమ్ముతూంటాను.ఈ ఉదయమే ఈ ఊరొచ్చాను.సగం పైగా సరుకు అమ్ముడైంది.ఆ సంతోషంలో ఎండ ముదిరిందని చూసుకోలేదు.చెప్పలేనంత ఆకలిగా వుంది.పూటకూళ్ళ ఇంటికి దారి చూపిస్తారా?" అన్నాడు.

శకారుడు నవ్వి,"ఆకలితో వచ్చిన వాళ్ళకు ఆతిథ్యమివ్వడం,మా సంప్రదాయం.నీకు పూటకూళ్ళ ఇల్లే కావాలనుకుంటే మాత్రం నేను దారి చూపను; వెళ్ళి ఇంకెవరినైనా అడుగు," అన్నాడు.

మాల్యుడాయన మంచి మనసు అర్థం చేసుకుని,అక్కడే భోంచేస్తానన్నాడు.చారుమతి క్షణాల మీద వంట పూర్తి చేసి,మాల్యుడికి విందుభోజనం వడ్డించింది.మాల్యుడు భోంచేస్తూండగా,పొరుగింటి పుల్లయ్య పిలిచాడని,అక్కడకు వెళ్ళాడు శకారుడు.

మాల్యుడు భోజనం ముగించి చారుమతికి,తన బండిలో వున్న వస్తువులు చూపాడు.వాటిలో వేణువునూదే కృష్ణుడి కంచు విగ్రహ మొకటి,చారుమతిని ఆకర్షించింది.దాని ధర నూటపదివరహాలని తెలుసుకుని,"ఇంత చిన్న కంచు బొమ్మల ధర రెండు వరహాలకు మించదు. ఈ బొమ్మకేమైనా ప్రత్యేకత ఉందా?" అన్నది ఆశ్చర్యంగా.

మాల్యుడు చిరునవ్వు నవ్వి,"ఇది అక్బరు చక్రవర్తి కాలం నాటి విగ్రహం.మహా భక్తురాలు మీరాబాయి దీనికి కొంత కాలం పూజలు చేసి, ఓ భక్తుడికి దానం చేసిందంటారు!ఓ గృహస్థు దీన్ని నాకు తొంభై వరహాలకు అమ్మాడు.పదివరహాలు లాభమేసుకుని,నూరు వరహాలకు అమ్మాలనుకుంటున్నాను," అన్నాడు.

ఈ సమాధానానికి తృప్తి పడ్డ చారుమతి,"ఈ బొమ్మ చూడ ముచ్చటగా ఉంది.చేతిలో డబ్బుండాలి కానీ,మీరాబాయి పూజలందుకున్నందుకు, దీన్ని ఎంతయినా ఇచ్చికొనొచ్చు," అంటూ అతడి మాటలను సమర్థించింది.

మాల్యుడు వెంటనే,"అమ్మా!నేను చెప్పిన ధర ఇతరుల కోసం. నీకైతే ఈ బొమ్మను అమ్మలేను కానుకగా ఇస్తాను," అన్నాడు.

చారుమతి ఏదో అనబోయేంతలో శకారుడు,పుల్లయ్యతో కలిసి అక్కడికి వచ్చాడు.సంగతి విని,సాధువు సుదర్శనుడు చెప్పినట్లే,నూరు వరహాల చిన్న కంచు బొమ్మ,నిజంగానే తన ఇంటికి అమ్మకానికి వచ్చినందుకు ఆశ్చర్యపడుతూ,మాల్యుడికి,జోగిరాజు కథ చెప్పాడాయన.

బొమ్మను నూరు వరహాలకు అమ్మడానికి మాల్యుడు ఒప్పుకున్నాడు.శకారుడు వెంటనే జోగిరాజుకు కబురు పెట్టి రప్పించి,"ఈ రోజు శుక్రవారం.సాధువు చెప్పిన బొమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది.మారాలోచన లేకుండా వెంటనే కొనుక్కో,"అన్నాడు.

జోగిరాజు దిగాలు పడి,"ప్రస్తుతం నా దగ్గర ఒక్క వరహా కూడా లేదు.నా కోసం నువ్వింత శ్రమ తీసుకున్నావు.కానీ,దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవారు లేరనిగదా సామెత!" అన్నాడు.

"అలాగే,అదృష్టవంతుణ్ణి చెరిపేవారూలేరని సామెత వుందిగా!నీకు పుట్టని అప్పు,నాకు పుడుతుంది! ఏం పుల్లయ్యా?" అంటూ శకారుడు పక్కనే వున్న పుల్లయ్య వంక చూశాడు.

ఎప్పుడూ అడగని శకారుడు అప్పడిగేసరికి కాదన లేక, "రేపు నాకు అవసరం అయిన ఖర్చులున్నాయి.రేపటికి తిరిగి ఇచ్చేమాటైతే అలాగే ఇస్తాను," అన్నాడు పుల్లయ్య.శకారుడు సరేనన్నాడు.

ఆ విధంగా జోగిరాజు,మాల్యుడి దగ్గర నూరు వరహాలిచ్చి కంచుబొమ్మ కొని,సాధువు చెప్పినట్లే దాన్ని పూజామందిరంలో ప్రతిష్ఠించి పూజ చేశాడు.మర్నాడు శకారుడు జోగిరాజుకు నూట పది వరహాలిచ్చి కంచు బొమ్మను తీసుకుని,అతన్ని పుల్లయ్య బాకీ వంద వరహాలు తీర్చమని చెప్పి,బొమ్మను చారుమతికిచ్చాడు.

ఆమె నిష్ఠూరంగా,"చూశారా!నిక్కచ్చి మనిషనుకున్న మీకు,మాటనిలకడలేదని తెలిసి పోయింది.ప్రాణం మీది కొచ్చినా అప్పుచేయననే మీరు, నిన్న పుల్లయ్యను అప్పడిగారు!" అన్నది.

శకారుడు నవ్వి, "నా అవసరానికి అప్పు చేయకూడదన్నదే, నా నియమం.నేను పుల్లయ్య దగ్గర చేసిన అప్పు జోగిరాజు కోసమే తప్ప, నా కోసం కాదు. ఈ వ్యవహారంలో నేను నా నియమాలన్నీ ఖచ్చితంగా పాటించానే తప్ప,నియమభంగం చెయ్యలేదు.కాదంటావా?" అని అడిగాడు.

చారుమతి చిరునవ్వు నవ్వి, "కాదని ఎలా అంటాను? స్వంతానికి అప్పు అడగరాదన్న నియమం కంటే కూడా,ఇతరుల కోసం అప్పడగవచ్చునన్న నియమం ఇంకా గొప్పది.సాధువు సుదర్శనుడు చెప్పాడని కాక,జోగిరాజుకు లభించిన డబ్బు,మీ వంటి ఉత్తముడి డబ్బుకావడం వల్ల,అది అక్షయమై,అతడి దశను మార్చగలదని నమ్ముతున్నాను,"అన్నది.

ఆమె అన్నట్లే అనతి కాలంలో,జోగిరాజుకు దశ తిరిగి,ఆ ఊరి గొప్ప భాగ్యవంతుల్లో ఒకడయ్యాడు.

No comments:

Post a Comment