Pages

Sunday, September 16, 2012

అక్కచెల్లెళ్ళ కథ

దుర్గాపూర్ లో ఒక బ్రాహ్మడు భార్య, ఇద్దరు ఆడపిల్లలతో నివసిస్తూండే వాడు. పెద్ద కూతురి పేరు ఉమాబీ, చిన్న కూతురి పేరు జుమాబీ. బ్రాహ్మడు నిరుపేదవాడు కావడంతో వాళ్ళకు పూట గడవడం కూడా దుర్లభంగా ఉండేది. రోజుకు గుప్పెడు బియ్యం, పప్పు దొరికితే చాలనుకుని కాలం గడపసాగాడు.

ఒకరోజు అతడికి కొంతబియ్యం, రెండు కొబ్బరి చిప్పలు దొరికాయి. వాటితో పీధాలు చేస్తానని చెప్పి, అతడి భార్య బియ్యం పిండి రుబ్బి, పొయ్యి రగిలించి పెనం మీదపీధాలు కాల్చడం మొదలుపెట్టింది. పెనం వేడెక్కి, పిండి పోయడంతో సుయ్ మనే శబ్దం రావడంతో, బ్రహ్మడు ఒక నూలు దారం తీసుకుని వంటగది పక్కగా వెళ్ళి నిలబడి దారంలో ఒక ముడి వేశాడు. ఇలా శబ్దం వినిపించినప్పుడల్లా దారంలో ఒక్కొక్క ముడిగావేసిన బ్రాహ్మడు, పిండి అయిపోగానే భార్య పిండి పాత్రను కడగడం కనిపించడంతో అక్కడి నుంచి వెనక్కు వచ్చేశాడు.

ఆ తరవాత స్నానం చేసి భోజనానికి కూర్చుని "వడ్డించు," అని భార్యను ఆజ్ఞాపించాడు. భార్య ఒక్కొక్క పీధాగా వడ్డించసాగింది. ఒక్కొక్క పీధాను తినిముగించగానే బ్రాహ్మడు తను ముడులు వేసిన దారం నుంచి ఒక్కొక్క ముడిని విప్పుతూ వచ్చాడు. "అంతే, ఇక పీధాలు లేవు," అని భార్య చెప్పే వరకు అలా చేస్తూ వచ్చాడు. దారంలో ఇంకా రెండు ముడులు మిగిలి ఉన్నాయి. "ఇంకా రెండు పీధాలు ఉండాలి. ఏమయ్యాయి? నువ్వు తినేశావా?" అని భార్యను అడిగాడు.

"లేదు, లేదు. నేను తినలేదు. పిల్లలు ఆకలిగా ఉందంటే వాళ్ళకు పెట్టాను," అన్నది భార్య.

ఆమె ఆకలితో ఉండడం చూసి అతడు భాదపడ్డాడు. తల్లికి తిండి లేకుండా చేసిన పిల్లల్ని శిక్షించాలనుకుంటూ వెళ్ళి పడుకున్నాడు.

మరునాడు తెల్లవారగానే పిల్లల్ని లేపి, "ఈ రోజు నేను మిమ్మల్ని మీ మామయ్య ఇంటికి తీసుకువెళతాను. బయలుదేరండి," అన్నాడు.

ఇద్దరు కూతుళ్ళూ తండ్రివెంట బయలుదేరారు. వాళ్ళు చాలా దూరం నడిచాక ఒక అడవి ఎదురయ్యింది. పిల్లలు బాగా అలిసిపోయారు. కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక మర్రిచెట్టు నీడలో కూర్చున్నారు. మరి కొంతసేపటికి అలసటతో అలాగే నిద్రపోయారు. తండ్రి కూడా వాళ్ళకు సమీపంలో రాళ్ళాను తలకడగా పెట్టుకుని పడుకున్నాడు. కూతుళ్ళిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారని తెలియగానే, బ్రాహ్మడు మెల్లగా లేచి, తను తలకడగా పెట్టుకున్న రాళ్ళ వద్ద కుంకుమ కలిపిన నీళ్ళు చల్లి అక్కడి నుంచి జారుకున్నాడు.

చీకటి పడుతూండగా అక్కచెల్లెళ్ళకు మెలకువ వచ్చింది. తండ్రి కనిపించలేదు. అతడు పడుకున్న చోట నెత్తురులాంటి ఎర్రటి మరకలు ఉండడం చూసి హడలిపోయారు. "ఏదో క్రూర మృగం మన నాన్నను చంపేసినట్టున్నది," అని విలపించింది జుమాబీ.

"ఇది నెత్తురు కాదు, జుమాబీ," అని చెల్లెల్ని ఓదార్చిన ఉమాబీ, "నాన్న మనల్ని ఇక్కడే వదిలి వెళ్ళి ఉంటాడేమో," అన్నది.

అప్పటికే రాత్రి కావడంతో, తెల్లవారేవరకు వాళ్ళు అక్కడే గడిపారు. తూరుపు దిక్కున వెలుగు రేఖలు కనిపించగానే అక్కడి నుంచి బయలు దేరారు. కొంత దూరం నడిచి, దూరంలో ఒక గ్రామం కనిపించగానే సంతోషిస్తూ, ఆ గ్రామాన్ని చేరుకున్నారు. వాకిళ్ళలో రంగు రంగుల ముగ్గులు వేసి, పుష్పాలంకరణలు చేయబడి ఉన్నాయి.

ఒక ఇంటి నుంచి ఒక అవ్వ వెలుపలికి రావడం చూసి, "ఎవరికైనా పెళ్ళి జరుగుతున్నదా?" అని అడిగింది ఉమాబీ. "లేదు పాపా, ఇవి పూజ రోజులు, కదా," అన్నది ఆ అవ్వ.

"దుర్గాపూజ ఎప్పుడో వెళ్ళిపోయింది కదా?" అని అడిగింది ఉమాబీ.

"మరయితే దీపావళి అయి ఉండవచ్చు," అన్నది జుమాబీ.


"దీపావళి పండుగ కూడా వెళిపోయింది. మేమిప్పుడు సూర్యుడిపండుగ జరుపుకుంటున్నాం. ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించమని సూర్యభగవానుణ్ణి ప్రార్థిస్తాం. అది సరే, మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ సంగతి చెప్పండి," అన్నది అవ్వ.

"మాది దుర్గాపూరు. మా తండ్రి మమ్మల్ని మా మామయ్య ఇంటికి తీకుసువెళతానని చెప్పి వెంటబెట్టుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో బాగా అలిసిపోయి ఒకచెట్టుకింద విశ్రాంతి కోసం పడుకున్నాం. లేచి చూస్తే మా తండ్రి జాడ కనిపించలేదు. మేము దుర్గాపూరుకు వెళ్ళడం ఎలాగో తెలియడంలేదు," అని తమ స్థితిని వివరించింది ఉమాబీ.

"విచారించకండి. ప్రస్తుతానికి మీరు నా వద్దే ఉండవచ్చు. నేనూ ఒంటరిదాన్నే. మంచి రోజున వచ్చారు. మీకు మంచే జరుగుతుంది. మొదట వెళ్ళి ఆ కొలనులో స్నానం చేసిరండి. సూర్యుడికి పూజ చేయవచ్చు," అన్నది అవ్వ.

ఆ తరవాత ఆమె వాళ్ళకు దుస్తులు తెచ్చి ఇచ్చింది.వాళ్ళు కొలను వద్దకు వెళ్ళి, కొలనులో అడుగుపెట్టగానే కొలనులోని నీళ్ళు కనిపించకుండా పోయాయి. దిగ్భ్రాంతి చెందిన అక్కచెల్లెళ్ళు తిరిగివచ్చి, అవ్వకు జరిగిన వింత సంగతి చెప్పారు. "అదేం ఫరవాలేదు. అది చాలా మహిమగల కొలను. సూర్యుణ్ణి తలుచుకుంటూ భక్తితో ఈ దర్భలను మొదట ఆ కొలనులో వేయండి. నీళ్ళు పొంగి వస్తాయి," అంటూ నాలుగు దర్భపోచలను వాళ్ళకు ఇచ్చింది అవ్వ.

వాళ్ళు అలాగే ఆ దర్భలను వేయగానే కొలను నుంచి నీళ్ళు గబగబా పైకి పొంగి రాసాగాయి.సూర్యుడికి అడ్డుగా ఉన్న మేఘాలు తొలగిపోవడంతో, సూర్యుడి వెలుతురు వాళ్ళ మీద బంగారు కాంతులు వెదజల్లాయి. సూర్యుడు తమను కరుణించాడని అక్కచెల్లెళ్ళు ఎంతగానో సంబరపడిపోయారు. నిండిన కొలనులో స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి అవ్వ వద్దకు తిరిగి వెళ్ళారు. అవ్వ చెప్పినట్టు సూర్యపూజ చేశారు. ఆ తరవాత అవ్వ ఇచ్చిన పళ్ళూ, ఫలహారాలూ తిన్నారు.

అవ్వతో కలిసి ఉంటూ, ఆమెకు ఇంటి పనులలో సాయపడసాగారు. వాళ్ళ మంచితనం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా భోజనం పెట్టేవారు. గ్రామస్థులందరూ వాళ్ళను ఆదరించసాగారు. వాళ్ళు అక్కడే పెరిగి పెద్దవారయ్యారు.
ఇలా ఉండగా ఒకనాడు రాజకుమారుడూ, అతడి మిత్రుడైన ప్రధానమంత్రి కుమారుడూ ఆ మార్గం గుండా రావడం జరిగింది. వేటకు వెళ్ళి తిరిగివస్తూ, దాహం కావడంతో ఆ గ్రామం వద్ద ఆగారు. వాళ్ళకు ఈ అక్కచెల్లెళ్ళు కనిపించడంతో, గుర్రాలపై నుంచి దిగి, నీళ్ళడిగి దాహం తీర్చుకున్నారు.

అందమైన ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ళు తమ పట్ల ఎంతో గౌరవమర్యాదలు కనబరచినందుకు, రాజకుమారుడూ, మంత్రి కుమారుడూ ఎంతో సంతోషించారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా అని అడుగగా, తమ అవ్వ వంటచెరకు కోసం అడవికి వెళ్ళినట్టు చెప్పి, ఆమె వచ్చేంతవరకు వాళ్ళను ఉండమని అక్కచెల్లెళ్ళు కోరారు. ఉదయం బయలుదేరిన తాము త్వరగా రాజభవనానికి తిరిగి వెళ్ళాలని ఆ యువకులు చెప్పినప్పుడే వాళ్ళు ఎవరన్న విషయం అక్కచెల్లెళ్ళకు తెలియవచ్చింది.

కొన్ని రోజుల తరవాత, రాజభవనం నుంచి అవ్వ వద్దకు భటులను వెంటబెట్టుకుని ఇద్దరు మంత్రులు వచ్చారు. యువరాజూ, ప్రధాన మంత్రి కుమారుడూ అవ్వ ఇంట్లో ఉన్న ఇద్దరు అక్కచెల్లెళ్ళను వివాహమాడడానికి ఆశపడుతున్నట్టు చెప్పారు. ఆమాట విన్న అవ్వ పరమానందం చెందింది. అక్కచెల్లెళ్ళు కూడా అమితానందానికి లోనయ్యారు. అయినా, అవ్వను వదిలి వెళ్ళవలిసి వస్తున్నందుకు లోలోపల చింతించారు.

ఉమాబీ యువరాజును వివాహమాడబోతున్నానన్న ఆనందంతో తనను రాజధానికి తీసుకువెళ్ళడానికి రథాన్ని తెమ్మన్నది. జుమాబీ పల్లకీలో బయలుదేరింది. సూర్యుణ్ణి పూజించడం వల్లే తమకీ అదృష్టం కలిగిందని భావించిన జుమాబీ రాజధానిలో కూడా సూర్య పూజను కొనసాగించడానికి పూజా పాత్రలను, సామాగ్రిని తనవెంట భక్తితో తీసుకువెళ్ళింది.

రాజకుమారుడితో వివాహం జరుగబోతున్నదన్న ఉత్సాహంలో సూర్యపూజను మరిచిన ఉమాబీ పయనం సాఫీగా జరగలేదు. ఆమె రాజధానికి చేరేసరికి బాగా ఆలస్యమయింది. రాజకుమారుడితో వివాహమయింది గాని, నిర్ణయించిన శుభముహూర్తంలో మాలలు మార్చుకోలేక పోయారు. మహారాణి దానిని రాజ్యానికి అపశకునంగా భావించింది.

జుమాబీకి ప్రధాన మంత్రి కుమారుడితో నిర్ణయించిన శుభ ముహూర్తంలో ఘనంగా వివాహం జరిగింది. వివాహానంతరం, జుమాబీ కోరికమేరకు, ఆమె అన్నాళ్ళు గడిపిన గ్రామంలోని ప్రజలకు ఆమె భర్త తీపి ఫలహాలను పంపాడు. రాజభవనం నుంచి అలాంటి వేమీ రాకపోయేసరికి గ్రామస్థులతో పాటు అవ్వ కూడా విస్మయం చెందింది. అంతలోనే ఉమాబీ తమను మరిచిపోయిందేమిటా అనుకున్నారు.

ఒక సంవత్సరం గడిచినా ఉమాబీకి సంతానం కలగకపోయేసరికి, మహారాణికి కోపం వచ్చి, ఆమెను తీసుకెళ్ళి మళ్ళీ ఆ గ్రామంలోనే వదిలి పెట్టిరమ్మని కొడుకును కోరింది. యువరాజు సమస్యను తన మిత్రుడైన ప్రధానమంత్రి కుమారుడితో చర్చించాడు. మంత్రికొడుకు ఆ సంగతిని తన భార్య జుమాబీకి చేప్పాడు. జుమాబీ కొంతసేపు ఆలోచించి, "ఉమాబీని మళ్ళీ ఆ గ్రామానికి పంపవద్దు. నేను గర్భవతిగా ఉన్నాను కదా. మా అక్కను ఇక్కడికి పిలిచుకువస్తే, ప్రసవ సమయంలో నాకు తోడుగా ఉంటుంది," అని భర్తకు సలహా ఇచ్చింది. ఆ విధంగా ఉమాబీ మళ్ళీ తన చెల్లె వద్దకు చేరింది.

అలా ఉన్నప్పుడు అక్కచెల్లెళ్ళు, తండ్రి తమను అడవిలో వదిలి వెళ్ళడం, తాము గ్రామం చేరి అవ్వ ఇంట పెరిగి పెద్ద వాళ్ళవడం మొదలైన విషయాలను తరచూ మాట్లాడుకునేవారు. ఇద్దరూ సూర్యుడికి భక్తితో పూజలు జరిపి ప్రార్థించారు. కొన్నాళ్ళకు జుమాబీ మగశిశువును ప్రసవించింది. ప్రధానమంత్రి గృహంలో వేడుకలు ఆరంభమయ్యాయి. ఆ వేడుకల్లో పాల్గొనడానికి తన మిత్రుడు ఆహ్వానించడంతో రాజకుమారుడు కూడా వచ్చాడు. అక్కడ తన భార్యను చూడగానే యువరాజు మనసులో పశ్చాత్తాపం మొదలయింది. వెంటనే ఆమెను రాజభవనానికి తీసుకువెళ్ళాలని నిర్ణయించాడు.

భార్యను వెంటబెట్టుకుని రాజభవనంలో ప్రవేశించిన కుమారుణ్ణి చూసి రాజదంపతులు ఎంతో సంతోషించారు. ఇన్నాళ్ళు కోడలు తమ వద్ద లేకపోయినందుకు బాద పడ్డారు. ఆమెను రాజభవనం నుంచి వెళ్ళగొట్టినందుకు మహారాణి పశ్చాత్తాప పడింది. జుమాబీ ఇంట ఉన్నప్పుడు రోజూ సూర్యదేవుణ్ణి ప్రార్థించడం వల్లే, తనవారిలో మంచి మార్పు వచ్చి, తనకు మళ్ళీ మంచి రోజులు ఆరంభమయ్యాయని ఉమాబీ గ్రహించింది. రాజభవనంలోనూ సూర్యభగవానుణ్ణి పూజించడం ప్రారంభించింది. సంవత్సరం తిరిగే సరికి పండంటి మగబిడ్డను ప్రసవించింది.

No comments:

Post a Comment