Pages

Sunday, September 16, 2012

భయంలేనివాడు

రాజు విక్రమసేనుడికి తరచూ ఏవేవో సందేహాలు వస్తూండేవి. తన సందేహాలకు సమాధానాలను ప్రత్యక్షంగా నిరూపించమని మంత్రులను కోరేవాడు. ఒకనాడు రాజు మంత్రి సుబుద్ధిని,"ఈ లోకంలో భయంలేనివారు ఎవరైనా ఉంటారా?" అని అడిగాడు.

"రాత్రికి మనం నగర సంచారం చేస్తే, అలాంటి వాళ్ళు కనిపించవచ్చు, ప్రభూ," అన్నాడు మంత్రి.

ఆ రాత్రి రాజూ, మంత్రీ మారువేషాల్లో నగర సంచారానికి బయలుదేరారు. నగరం చివర ఒక పూరిగుడిసె ముందు ఒక యువకుడు నులకమంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు. రాజూ,మంత్రీ ఆశ్చర్యంతో ఆ యువకుణ్ణి నిద్రలేపి, "ఇంటి తలుపు బార్లా తెరిచి ఇలా బయట పడుకుని నిద్రపోతున్నావే, నీకు భయం లేదా?" అని అడిగారు.

"భయమా? నాకా? ఎందుకూ? నా ఇంట్లో దొంగలు పడి దోచుకోవడానికి ఏముందని తలుపులు మూయడం? కట్టెలు కొట్టి అమ్మి దాంతో పొట్టపోసుకుంటున్నాను.ముందూ వెనకా ఎవరూ లేనివాణ్ణి. నేను చచ్చినా బాధపడేవాళ్ళు లేరు. నాకూ ప్రాణభయం లేదు. ఇక భయపడడం దేనికి? ఈ విషయం అడిగేందుకా బంగారంలాంటి నిద్ర చెడగొట్టారు?" అంటూ మళ్ళీ ముసుగుదన్ని పడుకున్నాడా యువకుడు.

"ఈ లోకంలో భయంలేని వాళ్ళెవరైనా ఉన్నారంటే, వాళ్ళు ప్రాణభయం లేని నిరుపేదలైన కష్టజీవులు మాత్రమే!" అంటూ రాజు ముందుకు నడిచాడు.

మంత్రి ఆయన్ను అనుసరించాడు.

No comments:

Post a Comment