Pages

Sunday, September 16, 2012

మాయావీణ

పూర్వం ఒక ఊళ్ళో, ఒకసంగీత విద్వాంసుడు వుండేవాడు. అయనకు ముగ్గురు కొడుకులు. తండ్రికొడుకులు కలిసి కచేరీలు చేసి, తమ కుటుంబాన్ని పోషించుకునేవారు. కొంతకాలానికి ఆ విద్వాంసుడికి ఏదో వ్యాధి సోకిచేతివేళ్ళు వంకర్లుపోయాయి. నోటమాట కూడా పడిపోయింది. ఆ ఊరి వైద్యుడు వచ్చి పరీక్షించి, " ఇది సామాన్యమైన వ్యాధికాదు. దీన్ని అపరధన్వంతరిగా పేరు తెచ్చుకున్న రాజవైద్యుడు తప్ప, నాలాంటి వాళ్ళు నయం చేయలేరు. రాజవైద్యుడితో చికిత్స అంటే, ముందు మూర్ఖుడైన మన రాజును మెప్పించ గలగాలి. రాయినైనా మెప్పించగలంగాని, ఈ దేశపురాజును మెప్పించలేమని అందరూ అంటూంటారు గదా! అందుకని, ఈ చికిత్స జరిగి మీ నాన్న బాగుపడతాడనే నమ్మకం నాకు లేదు. అయినా ప్రయత్నించిచూడండి. భగవత్ కృప, మీ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది!" అన్నాడు. ఆ మాట విని విద్వాంసుడి ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు, "రాజు ఎంతమూర్ఖుడైనా నా వీణావాదంతోమెప్పించి, రాజవైద్యుణ్ణి తీసుకువచ్చి, నాన్నగారి జబ్బు నయంచేయిస్తాను!" అని వీణ తీసుకుని రాజధానికి బయలుదేరాడు. వాడు రాజును కలిసి, "ప్రభూ, వీణ వాయించడంలో నాకున్న ప్రతిభతో మిమ్మల్నిరంజింపజేస్తాను. ప్రతిగా రాజవైద్యుడిచేత, మా నాన్నగారికి చికిత్స చేయించండి, "అన్నాడు. రాజు నవ్వి, "వీణవాయించడం ఈదేశంలో నీకేకాదు, మాకాపలాభటుడికి కూడాతెలుసు. అంతగా నీ కోరిక తీరాలంటే ఒక పని చెయ్యి. వీణావాదంలో న్నుమించిన వాడులేడని ప్రజలు అంటూంటారు కాబట్టి, నాతో పందెం కయి. నన్ను గెలిస్తే నీ కోరిక తీరుతుంది. నేను గెలిస్తే మాత్రం, నీకు లభించేది పాతికకొరడాదెబ్బల శిక్షే! ఈ పోటీకి ప్రజలేన్యాయనిర్ణేతలు కూడా,"  అన్నడు.


ఈ షరతుకు పెద్దవాడు అంగీకరించిన మీదట, ఆ మర్నాడే రాజుతో వాడికి వీణావాదంలో ప్రజల సమక్షాన పోటీ జరిగింది. ఈ పోటీలో పెద్దవాడు, రాజును మించిన నైపుణ్యాన్ని ప్రదర్శించినప్ప టికీ, ప్రజలు రాజుకు భయపడి, ఆయనకే జేజేలు పలికారు. ఫలితంగా, పెద్దవాణ్ణి పోటీలో ఓడినట్టు ప్రకటించి కొరడాతో కోట్టి పంపించారు. ఒళ్ళంతా దెబ్బలతో ఇల్లు చేరిన పెద్దవాణ్ణి చూడగానే చిన్నవాళ్ళిద్దరూ హతాశులయ్యారు. జరిగింది తెలుసుకుని రెండోవాడు ఈ రోజుల్లో వీణ వాయించడం సర్వసాధారణమైపోయింది. కాబట్టే రాజు నిన్నోడించగలిగాడు. అదే మృదంగం అయితే, రాజు కాదుగదా. రారాజు కూడా నన్ను ఢీకొనలేడు. అందుకే, ఈ మృదంగంతో రాజును మెప్పించి, రాజవైద్యుణ్ణి తీసుకువస్తాను," అని, మృదంగం తీసుకుని బయలుదేరాడు.

వాడు రాజదర్శనం చేసుకుని,"ఈ మృదంగ వాయిద్యంలో నన్ను తలదన్నేవాడేలేడు. కావాలంటే పరీక్షించి, మా తండ్రికి రాజవైద్యుడిచేత వైద్యం చేయించండి," అన్నాడు. రాజు వాడి కేసి పరీక్షగా చూసి, "చూడబోతే నువ్వు మొన్న వీణావాయిద్యంలో నా చేతుల్లో ఓడిపోయి కొరడా దెబ్బలు తిన్నవాడికి తమ్ముడిలా వున్నావు. నేను సంగీత సమ్రాట్టును! ఇది జగమెరిగిన సత్యం. నాతో పోటీ పెట్టుకుంటే, మీ అన్నకు జరిగిన శాస్తే నీకూ జరుగుతుంది. అందుకు సిద్ధపడితే రేపే పోటీలో పాల్గొను!" అన్నాడు రెండోవాడు, రాజుతో పోటీకి దిగాడు. ఆ పోటీలో రాజు మృదంగవాయిద్యం శ్రోతలకు ఏవగింపు కలిగించింది. రెండోవాడు మాత్రం మృదంగవాయిద్యంలో గోప్ప ప్రతిభ కనబరిచాడు. అయితే, రాజుకు భయపడి ప్రజలు మళ్ళి రాజుపక్షానే నిలిచారు. ఫలితంగా రెండోవాడికి కొరడా దెబ్బల శిక్ష పడింది. రెండోవాడు కూడా బిక్క మొహం వేసుకుని కొరడా డెబ్బలతో తిరిగి వచ్చేసరికి, మూడోవాడు మండిపడి, "ప్రజల ముందు ఒక విద్వంసుడి కొడుకులను చవటల్ని చేసి దండించినందుకు, ఈ రాజునే అసలైన చవటను చేసి తగిన శాస్తి చెయ్యకపోతే, నేను సంగీత విద్వాంసుడి కొడుకునే కాదు," అని వీణ, మృదంగం, సన్నాయి తీసుకుని, అప్పటికప్పుడే రాజధానీ నగరానికి బయల్దేరాడు.

రాజధాని చేరుకున్న మూడోవాడు, ఒక కూడలి ప్రదేశంలో కూర్చుని, తనకెదురుగా మృదంగం, సన్నాయి పెట్టుకుని, అదేపనిగా దివారాత్రాలు వీణవయించసాగాడు. మూడుదినాలు గడిచే సరికి, వీణాతంత్రులు మీటుతున్న మూడోవాడి చేతివేళ్ళనుంచి రక్తం బొట్లు బొట్లుగా కారసాగింది. ఈ విషయం ఈనోటా ఆనోటా పడి రాజు చెవినపడింది. అయన మంత్రులతో కలిసి హూటాహుటిన బయలుదేరి, మూడోవాడిని చూడబోయాడు.
రాజును చూడగానే, మూడోవాడు లేచి నమస్కరించాడు. ఎవరు నువ్వు? ఏమిటీ పిచ్చి పని?" అని అడిగాడు రాజు. అందుకు మూడోవాడు, "ఫభూ! నాది కొండకోనల్లో వుండే భైరవకోన అనే గ్రామం. మా గ్రామానికి రోజూ ఎక్కడినుంచో, నా ఈడువాడే అయిన ఒక కుర్రవాడు వచ్చి, నాతో ఆడుకువాడు. ఒకరోజు ఆకుర్రవాడు తాటిముంజలు తినాలని కోరితే, నేను కత్తి తీసుకుని బయలుదేరాను. గ్రామం చివరికి వచ్చాక, ఆ కుర్రవాడు వేసవి కావడం వల్ల తాపంగావుందని, కనిపించిన పెద్ద నీటివాగులో స్నానానికిదిగాడు.

చూస్తూండగానే వాగులో మునకవేసిన, ఆ కుర్రవాడు ఎంతకీ పైకి రాలేదు. నాకు భయం వేసి కత్తిని నడుముకు కట్టుని, వాగులో దూకి అడుగుకు వెళ్ళాను. అక్కడ వింతసర్పం ఆ కుర్రవాణ్ణిమింగు కనిపించింది. దాని పోట్ట తెల్లగా వుండి, పైన చర్మం పులి చర్మంలా చారాలు చారులుగా వున్నది. ఆ దృశ్యం చూసి నేను క్షణంకూడా ఆలస్యం చేయకుండా, కత్తితో దాన్ని నిలువునా చీరేసి, నా మిత్రుణ్ణి రక్షించాను. వాడు కృతజ్ఞతగా, తనతోబాటు తన ఇంట్టికి రమ్మని బలవంత పెట్టి - కొండలూ, అడవులూ దాటించి, ఒక కొండకోనలోకి తీసుకువెళ్ళడు. ఆ కోనలో వున్న ఒక కొండగుహలో, నడుం వరకూ విర బోసుకున్న తెల్లని చింపిరిజుట్టుతో ఒకమంత్రగతై ఏవో లేపనాలు చేస్తూ కనిపంచింది. దాని కళ్ళు దీపాల్లా మెరుస్తున్నాయి.

మొహం కుదుమ్లు కట్టి వికృతంగా వున్నది. నా మిత్రుడు ఆ మంత్రగతైను సమీపించాడు. మంత్రగతై వాణ్ణి చూడగానే అమాంతం కౌగలించుకుని, ముద్దులాడుతూ, 'నా బంగారు కొండ, పొద్దుననగా వెళ్ళి ఇప్పుడా వచేది? నీకిష్టమని కొండబల్లుల కూర వండి పెట్టాను,' అన్నది. కుర్రవాడు, నన్ను ఆ మంత్రగతైకు చూపిస్తూ, 'అమ్మా, వీడు నా మిత్రుడు ప్రాణాలకు తెగించి నన్నుకాపాడాడు. వీడి పుణ్యన ఈ రోజు ప్రాణాపాయంనుంచి బయటపడ్డాను!' అని జరిగిందంతా చెప్పాడు.

"అంతా విన్న మంత్రగతై ఆవేశంతో ఊగిపోతూ, ఏదో లేపనం తీసుకుని గోడకు పులిమి వికృతస్వరంతో బిగ్గరగా ఏవో మంత్రాలు చదివింది. మరుక్షణమే లేపనం పూసిన గోడ అద్దంలా మారిపోయి అందులో మత్రగతై కొడుకు మునిగిన వాగు,వాగు అడుగున ముక్కలుగా పడివున్న పాము కళేబరము కనిపించాయి. ఆ దృశ్యం చూడగానే మంత్రగతై మళ్ళీ ఏవో మంత్రలు చదివింది. చూస్తూండగానే ఆ కళేబరం మాయమై, ఆ స్థలంలో చచ్చిపడి వున్న ఒకమంత్రగతై శవం కనిపిచింది. ఆశవాన్ని చూస్తూనే మంత్రగతై వికవికా నవ్వుతూ, కాసేపు క్షుద్రనాట్యం చేసింది.
అతర్వాత అది నా భుజం తట్టి" భళిరా, కుర్రాడా, నువ్వు చంపింది పామును కాదు; అది నా చిరకాల శత్రువైన ఒక మంత్రగతై. దాన్ని ఎన్ని విధాల ప్రయత్నించినా నేను చంపలేక పోయాను. ఇన్నాళ్ళుకు నువ్వు దాన్ని హతమార్చి నన్ను, నా బిడ్డనూ రక్షించావు. నీకు బహుమతిగా ఒక మాయావీణనూ, దానితో పాటు ఒక మృదంగం, సన్నాయి ఇస్తాను. నువ్వామాయావీణను బాగావాయించగలిగితే, దాని మహిమవల్ల ఇద్దరు అదృశ్య యువకులు వచ్చి, మృదంగాన్నీ, సన్నాయినీవాయించి ఆశ్చర్యపరుస్తారు,' అన్నది.

 "ఆ మంత్రగత్తె ఇచ్చిన మాయావీణను తీసుకు వచ్చి మూడు రోజుల నుంచి వేళ్ళు తెగేలా మీటినప్పటికీ, ఆ అదృశ్యయువకులు వచ్చి, ఈ మృదంగం,సన్నాయిలను వాయించలేదు. ఆ మంత్రగత్తె నన్ను మోసపుచ్చిందో, ఏమో!" అని ముగించాడు.అంతా విని రాజు ఫకాలున నవ్వి, "పిచ్చి వాడా! మంత్రగతై నిన్ను మోసగించలేదు.
వీణను బాగా వాయించగలిగితేనే, దాని మహిమ తెలుస్తుందని, అది ముందే నీకు చెప్పింది. నీకు వీణ మీటడం చేతగాక దాన్ని నిందిస్తున్నావు. ఇప్పుడు వీణ నేను మీటి చూపిస్తాను. ఆ అదృశ్యయువకులు వచ్చి మృదంగం, సన్నాయి ఎలా వాయిస్తారో చూడు!" అని గుర్రం దిగి, వీణ ముందు కూర్చుని, వీణ వయించ సాగాడు. రాజు వీణను మీటిమీటి తంత్రులను తెంపేశాడేగాని, ఆ అదృశ్య యువకులు వచ్చి మృదంగం, సన్నాయిలను వాయించలేదు.

చివరకు రాజు విసిగిపోయి, "సంగీత సమ్రాట్టునయిన నాకే దీని మహత్తు పని చేయలేదంటే, ఇది సామాన్యమైన వీణకాదు. సంగీతంలో నన్ను మించినవాడైతేనే దీన్ని వాయించగలడు. త్వరలో జరగబోయే దసరాఉత్సవాల్లోపోటీలు నిర్వహించి, ఎవడైతే ఈ వీణద్వారా అదృశ్యయువకుల్ని రప్పించగలడో, వాణ్ణి అగ్రహారంతోపాటు ధన కనకవస్తువాహనాలిచ్చి సత్కరించగలను," అనిచెప్పి, ఆ వాయిద్యాలను తీసుకుని వెళ్ళి పోయాడు. ఆ మరుసటి రోజే రాజు, ఈ విషయాన్ని ప్రజలకు తెలియభరుస్తూ నగరంలో చాటింపు కూడా వేయించాడు.

ఇది జరిగిన కొద్ది దినాలకే నవరాత్రి ఉత్సవాలు వచ్చాయి. ఆవేడుకల్లో చివరి రోజు రాజు, మాయావీణ పోటీలు ఎందరో ఆ పోటీలో పాల్గొని ఎంత ప్రయత్నించినా, అదృశ్యయువకులు వచ్చి మృదంగం సన్నాయిలను వాయించనేలేదు. చివరకు విద్వాంసుడి మూడో కొడుకు వచ్చి, రాజుకు నమస్కరించి, "ప్రభూ, మీరు పోటీలు ప్రకటించిన నాటినుంచి నేటివరకూ, ఒక మహావిద్వాంసుడి దగ్గర వీణావాదంలోశిక్షణ పొందాను. మీరనుమతిస్తే, నేను కూడా ప్రయత్నిస్తాను,"అన్నాడు. రాజు వెటకారంగా నవ్వి," ప్రయత్నించిచూడు!" అన్నాడు.
మూడోవాడు వీణ ముందు కూర్చుని ఇష్టదైవాన్ని ప్రార్థించి, వీణ మీటడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు గడిచేసరికి జనం మధ్యనుంచి విద్వాంసుడి పెద్దకోడుకు, రెండో కొడుకు మారు వేషాల్లో రంగు రంగుల విచిత్రమైన వస్త్రధారణతో నడుచుకుంటూ వచ్చి మృదంగం, సన్నాయిల ముందు కూర్చుని, ఆ వాయిద్యాలను అద్బుతంగా వాయించ సాగారు. చూస్తూన్న ప్రజలు పరవశత్వంతో కరతాళ. ధ్వనులు చేశారు.

సంగీతంలో ఆరి తేరిన ఆ ముగ్గురన్నదమ్ములు కలిసి, ఆ పోటీని సంగీత కచేరిలా రక్తికట్టించారు. రాజు,ప్రజలు తన్మయత్వం నుంచి తేరుకునే సరికి, అదృశ్యయువకులు వేదికమీద లేరు. వీణమీటడం ఆపి, మూడోవాడు ఒక్కడే వీణ ముందు కూర్చునివున్నాడు.రాజు ప్రకటించినట్టుగా నే మూడోవాడిని ఘనంగా సత్కరించి, అగ్రహారం, ధన కనక వస్తు వాహనాలతోపాటు, అతడి తండ్రికివైద్యం చేసేందుకు రాజవైద్యుణ్ణి అతడి వెంటపంపాడు.

No comments:

Post a Comment