Pages

Sunday, September 16, 2012

ప్రాణభయం

అరణ్యంలో కుందేలొకటి, ఆహారంకోసం తిరుగుతూ, ఒక చోట కాళ్ళు జారి చిన్న నీటిగుంటలో పడిపోయింది. ఆ గుంటలోని నీరు అది మునిగిపోయేంతలోతుగా లేదు. కుందేలు నీటి గుంటనుంచి బయట పడేందుకు నానాప్రయత్నాలు చేసింది కానీ, అక్కడినుంచి పైకిరాలేకపోయింది.      
   
"ఇక నా చావు, ఈ నీటి గుంటలోనే!" అనుకుంటూ, కుందేలు విచారపడుతున్న సమయంలో, అటుగా వచ్చిన రెండు కుందేళ్ళూ, ఒక కోతీ దానిని బయటికి లాగేందుకు ప్రయత్నించినై. కానీ, అది వాళ్ళెంత సాయం చేసేందుకు శ్రమించినా గుంటనుంచి పైకి రాలేక, "మీ ప్రయత్నం అంతా వృధా! ఇక మీ దారిన మీరు పొండి," అన్నది విసుక్కుంటూ.

కుందేళ్ళూ, కోతి దాని దుస్థితికి విచారపడుతూ అక్కణ్ణించి వెళ్ళిపోయినై. ఆ తర్వాత కొద్దిసేపటికి నక్క ఒకటి అరుస్తూ, కుందేలున్న నీటిగుంటకి ప్రాంతానికి రాసాగింది. నక్క అరుపు వింటూనే కుందేలు ప్రాణభయంతో కంపించిపోతూ, ఒక్క ఎగురున నీటిగుంట నుంచి బయటికి దూకి పారిపోసాగింది. కుందేలు అలా కొంతదూరం పోయాక, అంతకు ముందు దానికి సాయం చేయవచ్చిన కుందేళ్ళూ, ఎదురుపడి ఎక్కడిలేని ఆశ్చర్యంతో, "మేమంత సాయపడినా గుంటనుంచి బయటికి రాలేనిదానివి, నీకై నీవు ఎలా బయటికి రాగలిగావు," అని అడిగినై.

అందుకు కుందేలు, "నక్కబావ పాడుతూ నేను ఉన్నచోటికి రావడం గమనించాను. అంతే! ఆ ఉత్సాహంతో ఒక్క ఎగురున గుంటనుంచి బయటపడ్డాను," అన్నది. ఆ మాట విని కుందేళ్ళూ, కోతీనవ్వుకున్నాయి!

No comments:

Post a Comment