Pages

Sunday, September 16, 2012

ద్రాక్షపళ్ళు తీయన!

అమరావతి సమీపంలో ఒక బౌద్ధ సన్యాసి జీవితమంతా ప్రజలకు మంచి బోధించి అవసానదశకు చేరుకున్నాడు. గురువుకు చివరి ఘడియలు సమీపించాయి అని గ్రహించిన శిష్యులు, చివరి సందేశంగా ఏం చెబుతాడో అని ఆయన పాదాల వద్ద కూర్చుని ఆసక్తితో ఎదురు చూడసాగారు. చుట్టు పక్కల నిశ్శబ్ద వాతావరణం అలముకున్నది.

"జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సర్వం మార్పుకు లోబడినదే. మార్పు ఒక్కటే మార్పు లేనిది. కాలం నిరంతరాయంగా ప్రవహించే జీవనదిలాంటిది. వెళ్ళిన నీటిచుక్క తిరిగిరాదు. గతం వదిలిన బాణంలాంటిది. భవిష్యత్తు అమ్ములపొదిలోని బాణం లాంటిది. వర్తమానం ఒక్కటే మనం వదలగలిగిన బాణం లక్ష్యం కేసి ఆ బాణాన్ని గురి చూసి వదలగలిగిన వారే ఆనంద ఫలాలను అందుకోగలరు," అంటూ తరచూ గురువు బోధించే విషయాలు శిష్యుల మనసుల్లో కదలాడ సాగాయి.

అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు, గురువు దర్శనానికి వచ్చాడు. ద్రాక్షపళ్ళు గల పళ్ళాన్ని గురువు ముందుంచాడు. గురువు కళ్ళు తెరిచి, రెండు ద్రాక్షపళ్ళను నోట్లోవేసుకుని చప్పరిస్తూ రాజునూ, శిష్యులనూ పరిశీలనగా చూశాడు. గురువు ఏదో మహత్తర సందేశాన్ని ఇవ్వగలడని శిష్యులు ఆత్రుతతో ఎదురు చూడసాగారు. "ద్రాక్షపళ్ళు తియ్యగా ఉన్నాయి!" అంటూ గురువు మందహాసంతో చివరిశ్వాస విడిచాడు.

మొదట ఆశాభంగానికిలోనైన శిష్యులు, ఆ తరవాత గురువు జీవితాంతం బోధించిన జీవిత సత్యాన్నే, చివరి క్షణాలలో ప్రత్యక్షంగా చూపాడని గ్రహించి సంతోషించారు.

No comments:

Post a Comment