Pages

Sunday, September 16, 2012

మొర ఆలకించిన దేవుడు!

మాధవుడు చాలా పేదవాడు. అతడికి సరైన ఉద్యోగం లేదు.సంపాదన లేదు గనక, అతడు పెళ్ళి కూడా చేసుకోలేదు; తనకంటూ కుటుంబం ఏర్పరుచుకోలేదు. ఒంటరి బతుకు బతుకుతూ ఎవరు ఏపని చెప్పినా చేస్తూ, వాళ్ళిచ్చిన దాన్ని పుచ్చుకుని తృప్తిగా కాలం గడుపుతున్నాడు.

కట్టెలు చీల్చడం, నెళ్ళు తోడడం,బట్టలుతకడం, పశువుల్ని తోలుకుపోయి దాపులనున్న నదిలో స్నానం చేయించడం ఇలా క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు. పనులన్నీ ముగించుకున్నక నదిలో స్నానం చేసి గుడికి వెళ్ళి దేవుడికి మొక్కుకుని ఇంటికి వెళ్ళేవాడు.

అలా ఒకనాడు అతడు గుడిలోని విగ్రహం ముందు కళ్ళు మూసుకుని చేతులు జోడించి నిలబడి దేవుణ్ణి ప్రార్థించాడు. కళ్ళు తెరవగానే అతడికి దేవుడు తన కేసి దీనంగా చూస్తున్నట్టు అనిపించింది. దేవుడు అలిసి పోయాడా? గర్భ గృహం నిండా భక్తులు వెలిగించిన అగరు వత్తుల పొగ కమ్ముకుని వుంది. ఆ పొగ దేవుడికి కళ్ళకు మంట కలిగిస్తున్నదా ఏం? భక్తులు అలంకరించిన పెద్ద పెద్ద పూల మాలలను మోయలేక దేవుడు అవస్థపడుతున్నాడా? ఇలా ఆలొచించిన మాధవుడు, "స్వామీ, నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు. నాతో మా ఇంటికి రా. నీకు మంచి భోజనం వండి పెడతాను," అన్నాడు చేతులెత్తి మొక్కుతూ, కన్నార్పకుండా చూస్తూన్న మాధవుడికి దేవుడు మందహాసం చేస్తున్నట్టనిపించింది. దేవుడి పెదవులు మెల్లగా కదల సాగాయి.

"మాధవా, నువ్వు ముందు ఇంటికి వెళ్ళి, భోజనం వండి సిద్ధం చేసి నా దగ్గరికి రా," అన్నాడు దేవుడు. మాధవుడు ఇటూ అటూ చూశాడు. తనతో పాటు అక్కడ ఇంకా కొందరు భక్తులు ఉన్నారు.అయితే, దేవుడు తనతో మాత్రమే మాట్లాడినట్టు మాధవుడు గ్రహించాడు. దేవుడి విగ్రహం ఇంకా మందహాసం చేస్తూ ఉన్నట్టు మాధవుడికి కనిపించింది.

మాధవుడు గుడినుంచి వెలుపలికి వచ్చి, గబగబా ఇంటికేసి నడవసాగాడు. ఇల్లు చేరగానే వంట చేయడం ప్రారంభించాడు. బియ్యం, పప్పు, కూరగాయలతో రుచికరమైన వంట పూర్తి కాగానే, దానిని భద్రంగా దాచి, ఇంటి తలుపు మూసుకుని గుడికి బయలుదేరాడు. నాలగడుగులు వేశాడో లేదో, ఊత కర్ర సాయంతో నడవలేక నడుస్తూ ఒక ముసలి వాడు ఎదురుపడి, "నాయనా, పొద్దుటి నుంచి ఆకలితో అలమటిస్తున్నాను. ఇంత తిండి ఉంటే పెట్టు. పుణ్యముంటుంది," అని దీనంగా అడిగాడు.

మాధవుడికి అతని మీద జాలి కలిగింది. "నాతో రా," అంటూ వెనుదిరిగి అతన్ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. ముసలివాడు కూర్చుని కొద్దిగా, అయితే ఎంతో ఆనందంగా తిన్నాడు. "చాలా సంతోషం నాయనా. నీ కరుణ ఎన్నటికీ మరువను. దేవుడు నిన్ను ఎల్లవేళలా కాపాడగలడు," అంటూ ఊతకర్రను అందుకుని ముసలివాడు వెళ్ళిపోయాడు.

మాధవుడు ఇంటి తలుపు మూసుకుని మళ్ళీ గుడికి బయలుదేరాడు. కొంతదూరం వెళ్ళేసరికి, దారి పక్కన ఒక ముసలిది ఆకలితో చాలా దీనంగా కనిపించింది. ఆమెకు ఇంత ఆహారం పెడితే సంతోషిస్తుంది కదా అని మాధవుడు భావించాడు. ఆమెను ఇంటికి తీసుకువెళ్ళి అన్నం పెట్టాడు. భోజనం చేసి చేతులు కడుక్కున్నాక, ఆమె కళ్ళు ప్రశాంతంగా, తృప్తిగా కనిపించాయి. విచారం మటుమాయమయింది. "దేవుడు నిన్ను చల్లగా చూడగలడు నాయనా. ఈ రోజును నేనెన్నటికి మరిచిపోను," అంటూ ముసలిది వెళ్ళిపోయింది.

ఆమె వెళ్ళాక, మాధవుడు ఇంటి తలుపు మూసుకుని మళ్ళీ గుడికేసి బయలుదేరాడు. అతడు వేగంగా అడుగులు వేయబోతూండగా, ఎవరో వెనకనుంచి తన బట్టను పట్టుకోవడం గమనించాడు. వెనుదిరిగి చూసిన మాధవుడికి చిరిగిన దుస్తులతో, ఆకలి చూపులతో చేతిని కడుపుకేసి చూపుతూ ఒక పసివాడు కనిపించాడు. వాడు తనను అన్నం కోసం అడుగుతున్నట్టు మాధవుడు గ్రహించాడు. ఆ తరవాత క్షణం కూడా ఆలోచించకుండా పసివాడి చేయి పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళి కడుపు నిండా తిండి పెట్టాడు. ఆ కుర్రవాడు అన్నం తింటూ, తానొక అనాధననీ, బిచ్చమెత్తుకుని బతుకుతున్నాననీ చెప్పాడు. మాధవుడు వాడిపై జాలిపడి, "రేపు సాయంకాలం వచ్చావంటే ఇంత తిండి పెడతాను," అంటూ మూడోసారి తలుపు మూసుకుని గుడికేసి వేగంగా బయలుదేరాడు.

మాధవుడు గుడిలోకి వెళ్ళి విగ్రహం ముందు చేతులు జోడించి, "నన్ను క్షమించు స్వామీ. ఇంటి నుంచి రావడానికి ఆలస్యమయింది," అన్నాడు.

"నువ్వు నాకు ఎప్పుడో భోజనం పెట్టావు కదా, మాధవా?" అన్నాడు దేవుడు.

"ఎప్పుడు స్వామీ? నేను ఇప్పుడే కదా వస్తున్నాను," అన్నాడు మాధవుడు విస్మయంతో.

"ఒక వృద్ధుడికి, వృద్ధురాలికీ, అనాధ బాలుడికీ అన్నం పెట్టావు కదా? అది నాకు పెట్టినట్టే. నాకు చాలా ఆనందంగా ఉన్నది," అన్నాడు దేవుడు.

"మరి, నువ్వు మా ఇంటికి వస్తానని మాట ఇచ్చావు కదా," అని మాధవుడు దేవుడికి గుర్తు చేశాడు.

"అలాగా!తప్పకుండా వస్తాను. ముందుగా నడువు. నీ వెంటే వస్తాను," అన్నాడు దేవుడు.

ఇంటిని సమీపించిన మాధవుడు తలుపు తెరిచి వెనక్కు తిరిగి చూశాడు. దేవుడు దివ్యాద్భుత ప్రకాశంతో నిలబడి వున్నాడు."కూర్చో స్వామీ. నువ్వు మా ఇంటికి రావడం ఎంతో సంతొషంగా ఉన్నది. ఇదిగో ఈ పండు తిను," అంటూ ఒక పండును ఇచ్చి, పక్కనున్న విసనకర్రను తీసుకుని దేవుడికి మెల్లగా వీచసాగాడు మాధవుడు. దేవుడు పండు ఆరగించి లేచి నిలబడ్డాడు. మాధవుడు సాష్టాంగ నమస్కారం చేసి, లేచే సరికి దేవుడు అదృశ్యమయ్యాడు.గుడి వరకు వెళ్ళి దిగబెట్టి వద్దామనుకున్న మాధవుడికి కొద్దిగా ఆశాభంగమయినప్పటికీ, దేవుడు తన ఇంటికి వచ్చాడన్న ఆనందంతో పొంగిపోయాడు.

దేవుడు పేదవాడైన మాధవుడి ఇంటికి వచ్చిన విషయం ఆ నోటా ఈ నోటా పడి ఆ ఊరిలోని గొప్ప భూస్వామికి తెలిసింది. ఆలయ పునరుద్ధరణకూ, ఇతర కైంకర్యాలకూ భూస్వామి ఎంతో ధనం విరాళంగా ఇచ్చాడు. అయినా దేవుడెప్పుడూ అతడి ఇంటికి రాలేదు.అతడు వెంటనే ఆలయంలోకి వెళ్ళి చేతులు జోడించి, "ప్రభూ! తమరెప్పుడు మా ఇంటికి విజయం చేస్తారు?" అని అడిగాడు. అతని కంఠస్వరంలో వినయపూర్వక విన్నపం కన్నా, అధికారం ధ్వనించింది.

"నీ అభీష్టానుసారమే వస్తాను. మొదట వెళ్ళి భోజనం సిద్ధం చేసి నన్ను వచ్చి పిలువు," అన్న మాటలు విగ్రహం నుంచి వినిపించాయి. భూస్వామి చిన్నగా నవ్వి ఇంటికి తిరిగి వచ్చాడు.వంటవాళ్ళను పిలిచి షడ్రసోపేతమైన విందు భోజనం తయారు చేయమని ఆజ్ఞాపించాడు.వంట సిద్ధం కాగానే గుడికేసి బయలుదేరాడు.

దారిలో ఒక వృద్ధుడు ఎదురు పడి తన ఆకలి గురించి చెప్పాడు. "నీలాంటి దరిద్రుడికి తిండి పెట్టడానికి నాకిప్పుడు తీరిక లేదు.దున్నలా ఉన్నావు ఏదైనా పనీపాటూ చేసుకుని బతుకవచ్చుకదా?" అంటూ కోపంగా భూస్వామి ముందుకు నడిచాడు.

నాలుగడుగులు వేసేలోగా, "అయ్యా, పొద్దుటి నుంచి తిరుగుతున్నాను. గుప్పెడు మెతుకులు దొరకలేదు. ఆకలి దహించేస్తున్నది. అడుగు వేయలేక పోతున్నాను," అన్న వృద్ధురాలి దీనస్వరం వినిపించింది.

భూస్వామీ పట్టరాని కోపంతో, "ఈ ఊళ్ళో ఇంతమంది పనికిమాలిన బిచ్చగాళ్ళు ఉన్నారా? వెళ్ళు, వెళ్ళు. అవతల నాకు ముఖ్యమైనపని ఉంది," అంటూ కనీసం తిరిగైనా చూడకుండా హడావుడిగా ముందుకు అడుగువేశాడు.

ఇంకొకడు అడ్డుపడగలడని అతడు అనుకోలేదు. అంతలో మరొక బిచ్చగాడు ఎదురుపడి, కళ్ళు తిరిగి కిందపడిపోయేలావున్న తన ఆకలి బాధ గురించి దీనంగా ఏకరువు పెట్టాడు. భూస్వామి వాణ్ణి పక్కకు తోసేసి గబగబా ముందుకు నడిచాడు. అతడు రొప్పుతూ ఆలయంలోకి వెళ్ళి, విగ్రహం ముందు నిలబడి, "ప్రభూ! మీ కొసం సిద్ధం చేసి మిమ్మల్ని వెంటబెట్టుకు వెళ్లడానికి వచ్చాను," అన్నాడు.

"నేనే స్వయంగా ఎప్పుడో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అయితే, నువ్వే నన్ను పట్టించుకోలేదు. మొదట నువ్వు కోపంతో నన్ను పట్టించుకోలేదు. మొదట నువ్వు కోపంతో నన్ను దరిద్రుడివి అన్నావు. ఆ తరవాత బిచ్చగత్తెవని తిట్టావు. మూడోసారి దారికి అడ్డమని పట్టి పక్కకు తోసి దిగ్బ్రాంతి కలిగించావు. వచ్చినప్పుడల్లా నాపట్ల కఠినంగా ప్రవర్తించావు.ఇప్పుడు నేను మాత్రం నీకోసం ఎందుకు సమయాన్ని వెచ్చించాలి?" అన్నాడు దేవుడు.

ధనికుడైన భూస్వమి విగ్రహం కేసి అలాగే చూస్తూ నిలబడ్డాడు. కఠినమైన నల్లరాతిలో చెక్కిన ఆకారాన్ని మాత్రమే అతడిప్పుడు చూడ గలిగాడు. 

No comments:

Post a Comment