Pages

Sunday, September 16, 2012

మంచీ మర్యాదా!


ఒకానొక అగ్రహారంలో, పురుషోత్తశర్మ అనే పండితుడుండేవాడు. ఆయన శాస్త్ర, పురాణాలను క్షుణ్ణంగా చదివి అర్థంచేసుకున్న వ్యక్తిగా అందరూ చెప్పుకునేవారు. ఒకనాడు, దూర గ్రామంలో వుంటున్న రఘుపతి అనే పండితుడొకాయన పురుషోత్తమశర్మను చూడవచ్చాడు. మధ్యాహ్న భోజనాంతరం ఇద్దరూ వీధి అరుగుమీద కూర్చుని తీరిగ్గా ఎవేవో శాస్త్ర చర్చలు చేయసాగారు. ఆ సమయం వీధిన వెళుతున్న కట్టెలు కొట్టేవాడొకడు, పురుషోత్తమశర్మను చూస్తూనే తలమీద వున్న కట్టెలమోపును కిందకి దించి, రెండు చేతులూ ఎత్తి, "దణ్ణాలు శర్మగారూ!" అన్నాడు వినయంగా.
ఆ వెంటనే పురుషోత్తమశర్మ చేతులెత్తి వాడికి నమస్కరిస్తూ, "బావున్నావా, ఎల్లయ్యా!" అంటూ పరామర్శించాడు. ఇది చూసిన రఘుపతి, పురుషోత్తమ శర్మను, "ఇదేమిటి, శర్మగారూ! ఆ కట్టెలు కొట్టుకు బతికేవాడికి, మీరు నమస్కరించడం?" అని అడిగాడు. దానికి పురుషోత్తమశర్మ చిరునవ్వు నవ్వి, "ఎల్లయ్య మంచీ మర్యాదా ఎరిగినవాడు. చేసే వృత్తులు ఏవైనా మనుషులందరూ ఒక్కటేకదా? మనశాస్త్రపురాణాలు బోధించేవీ అవే. మనల్ని గౌరవించినవాళ్ళను, మనం గౌరవించడంలోనే మన మంచీ మర్యాదా ఉన్నా యి," అన్నాడు.

No comments:

Post a Comment