Pages

Sunday, September 16, 2012

రొట్టెల పండుగ


 
దేవీపురం గ్రామంలో శివదాసు అనే గృహస్థు ఉండేవాడు. అతడు నిత్యాన్నదానం చేస్తూండేవాడు. ఒక రాత్రి సమయాన ఒక వృద్ధురాలు వచ్చి శివదాసు ఇంటి తలుపు తట్టింది. శివదాసు భార్య లేచి తలుపు తీసి వృద్ధురాలిని, ``ఏమ్మా, ఏం కావాలి?'' అని అడిగింది. అప్పుడా వృద్ధురాలు, ``నేను వచ్చింది నీ కోసం కాదు, నీ భర్తను పిలువు,'' అన్నది. ఆ మాట విన్న శివదాసు బయటకువచ్చి, ఆ వృద్ధురాలిని చూసి నమస్కరించి, ``ఏం కావాలి తల్లీ?'' అని అడిగాడు. ``ఎవరైనా నీ ఇంటికి ఎందుకు వస్తారు? భోజనానికి వచ్చాను,'' అన్నది వృద్ధురాలు. ``సంతోషం. రామ్మా లోపలికి,'' అని పిలిచాడు శివదాసు. ``నేను భోజనం చేయాలంటే ముందుగా నువు్వ నాకొక మాట ఇవ్వాలి,'' అన్నది వృద్ధురాలు. ``ఏం చెయ్యాలో చెప్పు తల్లీ,'' అని అడిగాడు శివదాసు. ``నేను చాలా కష్టాల్లో ఉన్నాను. మనసులో బాధ ఉండగా నేను భోజనం చేయలేను. నా కష్టాలన్నీ నువు్వ తీసుకోగలిగితే, నేను సంతోషంగా భోజనం చేస్తాను,'' అన్నది వృద్ధురాలు. వెంటనే శివదాసు, ``ఈ క్షణం నుంచి నీ కష్టాలన్నీ నేను తీసుకుంటున్నాను. వచ్చి భోజనం చెయ్యి తల్లీ,'' అన్నాడు శివదాసు. ఆ మాటకు వృద్ధురాలి ముఖం విప్పారింది. ``సంతోషం, నాయనా. ఎదుటి వారి కష్టాలు స్వీకరించగలవారు ఎందరుంటారు? తప్పక నీ ఆతిథ్యం స్వీకరిస్తాను. అయితే, ఇంట్లోకి మాత్రం రాను. ఇల్లు నాకు ఇరుకుగా ఉంటుంది. ఇక్కడే ఉంటాను. వెళ్ళి భోజనం తీసుకురా. మరో మాట. ఈ రోజు నాకెందుకో రొట్టెలు తినాలని ఉంది. ఉంటే జొన్నరొట్టెలు తీసుకురా నాయనా,'' అన్నది.

``అలాగే నమ్మా'' అంటూ లోపలికి వెళ్ళి, భార్య చేత త్వరత్వరగా రెండు జొన్నరొట్టెలు చేయించి, బయటకు వచ్చిన శివదాసు అక్కడి దృశ్యం చూసి నిర్ఘాంత పోయాడు. వృద్ధురాలు కనిపించలేదు. ఆమె కూర్చున్న చోట అన్నపూర్ణేశ్వరీ దేవి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహానికి నాగసర్పం పడగ పట్టి ఉంది. తన ఇంటికి వచ్చింది సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరీ దేవి అని గ్రహించి శివదాసు ఆనందంతో ఉప్పొంగి పోయాడు. క్షణాల్లో వార్త ఊరంతా తెలిసిపోయింది. జనం గుంపులు గుంపులుగా వచ్చి దేవిని దర్శించుకున్నారు. మూడు నెలలు తిరిగే సరికి అందమైన ఆలయం నిర్మించి అమ్మవారిని అందులో ప్రతిష్ఠించారు. క్రమక్రమంగా ఎక్కడెక్కడినుంచో వచ్చే భక్తులకు దేవీపురం ప్రజలు ఆతిథ్యం ఇచ్చేవారు. ``మీ కష్టాలు మేం స్వీకరిస్తున్నాం. మీకు అంతా శుభం జరుగుతుంది,'' అని చెప్పి రొట్టెలు పంచేవారు. అప్పటి నుంచి యేటా రొట్టెల పండుగ జరపడం దేవీపురం ప్రజలకు ఆనవాయితీ అయింది. ఆ రొట్టెలు తిన్న వారికి అంతవరకూ ఉన్న సమస్యలు తీరిపోయి మనశ్శాంతి లభించేది. అంతే కాకుండా దేవీపురం గ్రామస్థులు పంచే రొట్టెలు అద్భుతమైన రుచితో, రాజుగారి ఇంట కూడా అంత రుచికరమైన రొట్టెలు దొరకవని పేరు గడించాయి. ఆ సంగతి రాజుగారి వరకు వెళ్ళింది. రాజు ఆశ్చర్యపడి ప్రధాన వంటవాణ్ణి పిలిచి సంగతి చెప్పి, ``దేవీపురం రొట్టెలకు అంత ప్రసిద్ధి ఎలా వచ్చింది? ఒకసారి ఆ ఊరు వెళ్ళి, రొట్టెలను వాళ్ళెలా తయారు చేస్తారో తెలుసుకో,'' అన్నాడు. ``రొట్టెల రుచి తయారు చేయడంలో లేదు ప్రభూ. వాటిని చేయించి ఇచ్చేవారి గొప్పగుణం, తినేవారు కోరుకునే మంచి కోరికలను బట్టి, ఉంటుంది,'' అన్నాడు వంటవాడు. ``ఏమిటి నువ్వంటున్నది?'' అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. ``నా చిన్నప్పుడు దానికి సంబంధించిన ఒక విచిత్ర సంఘటన జరిగింది, ప్రభూ,'' అన్నాడు వంటవాడు. ``ఏమిటది?'' అన్నాడు రాజు. ``దేవీపురానికి పొరుగునే ఉన్న మంగాపురం మా స్వగ్రామం,'' అంటూ వంటవాడు ఇలా చెప్ప సాగాడు: ఆ ఊళ్ళో సంగడనేవాడు దొంగతనాలు చేస్తూ రోజులు గడిపేవాడు.

అయితే, వాడి భార్య గౌరి, ``ఎంత కాలమని ఈ దొంగబతుకు బతగ్గలం? ఏ క్షణాన నీకేం జరుగుతుందోనని నేనెంత భయపడుతున్నానో నీకు తెలియదు. దొంగతనాలు మానేసి కష్టపడి పనిచెయ్�. కలో గంజో తాగి తృప్తిగా బతుకుదాం,'' అంటూ తరచూ పోరసాగింది. భార్యకు తనంటే ఎంత ప్రేమో తెలిసిన సంగడు కొన్నాళ్ళకు ఆమె మాటల గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. అప్పుడే వాడికి దేవీపురం వెళ్ళి రొట్టెలు తింటే అనుకున్నది జరుగుతుందని తెలియ వచ్చింది. అక్కడికి వెళ్ళి రొట్టెలు తిని, ఎవరికీ తెలియకుండా పెద్ద దొంగతనం ఒకటి చేసి, జీవితంలో స్థిరపడి ఆ తరవాత దొంగతనాల జోలికి పోకూడదని నిర్ణయించుకున్నాడు. అప్పటికప్పుడే సంగడు దేవీపురం బయలు దేరాడు. మార్గ మధ్యంలో ఎదురు వచ్చినవారు తాము తిన్న రొట్టెల రుచి గురించి చెప్పుకుంటూంటే, సంగడికి నోరూరింది. ``ఈ రోజు నా పంట పండింది. రుచికరమైన రొట్టెలు. బోలెడంత ధనం దొరుకుతుంది,'' అనుకున్నాడు. దేవీపురం చేరగానే రాందాసు అనే గృహస్థు ఎదురువచ్చి, ``అయ్యా, మా ఇంట ఆతిథ్యం స్వీకరించండి,'' అని చెప్పి సంగణ్ణి తన వెంట తీసుకుపోయి, ``మీ కష్టాలన్నిటినీ నేను స్వీకరిస్తున్నాను. మీకు శుభం జరుగుతుంది,'' అని చెప్పి రొట్టెలు ఇచ్చాడు. సంగడు రొట్టెను నోట్లో పెట్టుకుని కొరికి దిగ్భ్రాంతి చెందాడు. అది భరించ లేనంత చేదుగా ఉంది. అది తెలియని రాందాసు, ``రొట్టె రుచిగా ఉంది కదా? అంతా అన్నపూర్ణేశ్వరి మహిమ!'' అన్నాడు. సంగడు మింగలేక, కక్కలేక ఒక రొట్టె తిని, మిగిలినవి మూటగట్టుకుని బయలుదేరాడు. రొట్టె బాగుండకపోతే పోయింది, రాందాసు దీవించినట్టు శుభం జరిగితే చాలనుకుంటూ, సంగడు ఆ రాత్రి ఒక ధనికుడి ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించాడు. అక్కడా వాడికి చేదు అనుభవమే ఎదురయ్యింది. పట్టు బడినవాణ్ణి ధనికుడి నౌకర్లు చితగ్గొట్టి వదిలారు. ముక్కుతూ మూలుగుతూ ఇల్లు చేరిన సంగణ్ణి చూసి, వాడి భార్య, ``వద్దంటే మానవుకదా?'' అని కళ్ళ నీళు్ళ పెట్టుకుని, ``ఇకపై అంతా మంచి జరగాలని దేవీపురం వెళ్ళి రొట్టెలు తెచ్చాను, తిను,'' అంటూ రెండు రొట్టెలు ఇవ్వబోయింది. 

``నేనే స్వయంగా దేవీపురం వెళ్ళి రొట్టె తిన్నాను. చెప్పలేనంత చేదుగా ఉంది,'' అన్నాడు సంగడు బాధగా. ``మా అందరికీ ఎంతో రుచిగా ఉన్న రొట్టెలు, నీకు మాత్రం ఎందుకు చేదుగా ఉన్నాయి? అంటే అమ్మవారు నీ దుర్బుద్ధిని గ్రహించిందన్న మాట! ఇప్పుడు చెబుతున్నాను. నువు్వ దొంగతనాలు మానకపోతే, ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను,'' అన్నది గౌరి కన్నీళు్ళ ఒత్తుకుంటూ. ``అంత పని చేయకు. దొంగతనాలు మానేస్తాను,'' అని భార్య దగ్గర ఒట్టు వేసిన సంగడిలో, అందరికీ రుచిగా ఉన్న రొట్టెలు తనకు మాత్రం ఎందుకు చేదుగా ఉన్నాయి? అన్న అనుమానం తలెత్తింది. ఆమాటే భార్యతో అన్నాడు. ``ఈ సంవత్సరమంతా బుద్ధిగా నడుచుకో. అప్పుడు తెలుస్తుంది అమ్మవారి రొట్టెల రుచి,'' అన్నది గౌరి. ఆ రోజు నుంచి కూలిపనులు చేసుకుంటూ రోజులు గడుపుతూన్న సంగడికి అప్పుడప్పుడు దొంగతనాల మీదికి మనసు మళ్ళేది. అయినా, అతి ప్రయత్నం మీద వాటి జోలికి పోకుండా నిలదొక్కుకున్నాడు. సంవత్సరం గడిచాక, భార్యతో కలిసి దేవీపురం రొట్టెల పండుగకు వెళ్ళి, రొట్టెలు అందుకున్నాడు. ఒక రొట్టె నోట్లో వేసుకోగానే అద్భుతమైన రుచిగాతోచింది. వాడికి తెలియకుండానే కళ్ళల్లో నీళు్ళ తిరిగాయి. అమ్మవారి గుడికి వెళ్ళి, ``క్షమించు తల్లీ, ఇక ఈ జన్మలో దొంగతనాల జోలికి వెళ్ళను,'' అని భక్తితో చేతులెత్తి మొక్కుతూ ప్రార్థించాడు. భర్తలో వచ్చిన మార్పుకు గౌరి సంతోషించింది. రెండేళు్ళ తిరిగే సరికి భార్యాభర్తలు కూలిపనులకు వెళ్ళే స్థితి నుంచి, సొంతపొలంలో పనిచేసుకునే స్థాయికి ఎదిగారు. సంగడి కథ విన్న రాజు ఒకసారి దేవీపురం వెళ్ళి అన్నపూర్ణేశ్వరీ దేవిని దర్శించుకుని రావాలనుకున్నాడు. రాజు పరివారంతో బయలుదేరి వెళ్ళి, ప్రజలు ఎలాంటి కొరతా లేకుండా శాంతి సుఖాలతో జీవించాలని దేవికి మొక్కుకున్నాడు. గుడి నుంచి వెలుపలికి రాగానే, ఒక పేద రైతు అందించిన రొట్టెలు తిని, వాటి రుచికి ముగ్ధుడయ్యాడు. ఎదుటివారి కష్టాలను స్వీకరించే కరుణాహృదయంగల దేవీపుర గ్రామ ప్రజలకు ఎలాంటి కొరతా రాకుండా చూసుకోవడానికి తగిన చర్యలు తీసుకున్నాడు.
  

No comments:

Post a Comment